యాదగిరిగుట్ట, జూలై 21: బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, 37 ఏళ్లుగా వంగపల్లి పీఏసీఎస్ చైర్మన్గా రైతులకు సేవలందించిన గొంగిడి మహేందర్రెడ్డిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పొగడ్తల వర్షం కురిపించారు. 1989 నుంచి వంగపల్లి ప్రాథమిక వ్యవసాయ పరస్పర సహకార సంఘం చైర్మన్గా ఉంటూ నియోజకవర్గ రైతులకు సేవలందించారని కితాబునిచ్చారు. మంగళవారం మండలంలోని వంగపల్లి పీఏసీఎస్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
వంగపల్లి పీఏసీఎస్ చైర్మెన్గా మోటకొండూరు మండలం వర్టూర్ గ్రామానికి చెందిన నెమ్మాని సుబ్రహ్మణ్యంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగపల్లికి చెందిన సీనియర్ నాయకుడు గొంగిడి మహేందర్రెడ్డి మంచి రాజకీయ నాయకుడన్నారు. కిందిస్థాయి నుంచి వచ్చిన వ్యక్తి అని, సహకార బ్యాంకును అభివృద్ధి చేయాలనే తపన ఉన్నదంటూ కొనియాడారు.
ఆయన చైర్మన్గా ఉన్న సమయంలో చిన్నకందుకూరు, వంగపల్లిలో సహకార బ్యాంకు సాయంతో నిర్మించిన నూతన షాపులను తన చేత ప్రారంభోత్సవం చేయించారన్నారు. ప్రొటోకాల్ పాటించిన గొప్ప వ్యక్తి అన్నారు. పీఏసీఎస్ అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. అనంతరం పాలక వర్గాన్ని సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చైతన్యారెడ్డి, నార్ముల్ డెయిరీ డైరెక్టర్ కళ్లేపల్లి శ్రీశైలం, మాజీ సర్పంచ్ బాలరాజు గౌడ్, వివిధ మండలాలకు చెందిన పీఏసీఎస్ చైర్మన్లు పాల్గొన్నారు.