యాదాద్రి, మే 20 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూ ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పరమ పవిత్రంగా జరిగే సేవలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. ప్రధానాలయం వెలుపల ప్రాకారం అద్దాల మండపంలో గల ఊయలలో అమ్మవారిని శయనింపు చేసి వివిధ రకాల పాటలతో కొనియాడుతూ గంట పాటు లాలిపాటలు పాడారు. స్వామికి నిత్యారాధనలు తెల్లవారుజాము 3గంటల నుంచి మొదలయ్యాయి. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.
ఉదయం 4గంటలకు ఆలయాన్ని తెరిచి సుప్రభాతం, బిందె తీర్థం నిర్వహించి లక్ష్మీనారసింహుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వామికి నిజాభిషేకం, సహస్రనామార్చన చేశారు. రూ.600 టికెట్ తీసుకున్న భక్తులకు ప్రధానాలయంలోని ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విడుతలుగా సువర్ణ పుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులను అర్చించారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం చేశారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చించారు. స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొండకింద కల్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించి, ఆ పక్కనే లక్ష్మీపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత బస్సుల్లో కొండపైకి చేరుకుని స్వయంభులను దర్శించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉచిత దర్శనాలు కొనసాగాయి. పాతగుట్ట ఆలయంలో స్వామి ఆర్జిత సేవలు ఘనంగా నిర్వహించారు. శ్రీవారి ఖజానాకు రూ.33,69,790 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.