సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): కాంట్రాక్టర్ల అత్యాశ, అవినీతికి అలవాటు పడిన అధికారుల ధనదాహం వెరసి జీహెచ్ఎంసీ ఖజానాకు భారీ స్థాయిలో గండిపడింది. నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ, నకిలీ బిల్లులతో ఒకే పనికి రెండుసార్లు బిల్లులు డ్రా చేసుకున్న అక్రమాల పుట్ట తవ్వినకొద్దీ కదులుతోంది. ఇప్పటివరకు వెలుగుచూసిన జాబితా దాదాపు 200మారుకు చేరుకోవడం సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.140 కోట్లకు పైగా గండి కొట్టిన ఈ భారీ కుంభకోణం వెనుక శాఖాపరమైన యంత్రాంగం లోపభూయిష్ట తీరు స్పష్టమవుతోంది. సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ, ఉద్దేశపూర్వకంగానే సాఫ్ట్వేర్ లోపాలను, రికార్డుల తనిఖీ లేమిని ఆసరాగా చేసుకుని ఈ డబుల్ పేమెంట్ల దందాను సాగించినట్లు తెలుస్తోంది.
సవాల్గా మారిన రికవరీ..
కొందరు కాంట్రాక్టర్లు, అవినీతి అధికారుల పాలైన ప్రజాధనాన్ని తిరిగి రాబట్టడం జీహెచ్ఎంసీకి సవాల్గా మారింది. ఇప్పటికే నిధులు తీసుకొని చేతులెత్తేసిన కాంట్రాక్టర్ల నుంచి కోట్లాది రూపాయలు తిరిగి వసూలు చేయడంపై స్పష్టత కొరవడింది. మరోవైపు, కళ్లెదుటే రూ.140 కోట్ల మేర ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమవుతున్నా చూసీచూడనట్లు వ్యవహరించిన, అక్రమ బిల్లులపై సంతకాలు చేసిన బాధ్యులైన అధికారులపైనా చర్యలు తీసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం దాదాపు రూ.50 కోట్ల మేర కాంట్రాక్టర్ల నుంచి రికవరీ చేయగా.. ఆర్థిక, విజిలెన్స్ విభాగం ఆదే పనిగా 200 మంది కాంట్రాక్టర్ల నుంచి రికవరీ చేసే పనిలో పడింది. వడ్డీలతో సహా చెల్లించాలని ఆధికారులు అంటుండటం, ఈఆర్పీ కట్ చేయడం లాంటి అస్ర్తాలను ప్రయోగిస్తున్నారు. కానీ ఆశించిన స్థాయిలో కాంట్రాక్టర్ల నుంచి డబుల్ పేమెంట్లు రికవరీ కాకపోవడం గమనార్హం. మొత్తంగా ప్రజాధనానికి జవాబుదారీగా ఉండాల్సిన యంత్రాంగం మౌనం వహించడం వెనుక ఉద్దేశపూర్వక నైజమే ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి.