సూర్యాపేట: తండాలను పంచాయతీలుగా చేసిన మానవతవాధి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి(Minister Jagadish reddy) అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని సూర్యాపేట రూరల్ మండలం రాజా నాయక్ తండా, లక్ష్మీ నాయక్ తండా, చివ్వెంల మండలం బడితండా, పీర్ల తండా,మున్యానాయక్ తండా, పాండ్య నాయక్ తండా లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు .
ఈ సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం గిరిజన తండాలు, గూడేలను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్(CM KCR) కే దక్కుతుందని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని 3,146 గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన సీఎం కేసీఆర్ గిరిజనుల ఆరాధ్యుడన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడే నాటి వరకు తండాలను పట్టించుకున్న ప్రభుత్వాలే లేవన్నారు. స్వరాష్ట్రంలోనే అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని వెల్లడించారు.
మిషన్భగీరథ(MIssion Baghiratha) తో స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని, తండాలకు రహదారులు నిర్మించామని పేర్కొన్నారు. తెలంగాణ రాకముందు, వచ్చిన తరువాత జరిగిన అభివృద్ధిని గమనించాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ‘గిరిజన బంధు’ అమలు చేస్తామన్నారు. రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గురుకులాలు ఏర్పాటు చేశారని వివరించారు. బీఆర్ఎస్ పార్టీకి గిరిజనులు అండగా నిలువాలని కోరారు.
గతంలో పాలించిన దామోదర్ రెడ్డి తన హయాంలో ఏమి చేయకపోగా, కొట్లాటలను ఘర్షణలను ప్రోత్సహించి, మూడు కొట్లాటలు ఆరు కేసులను ఇచ్చాడే తప్ప గిరిజన అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. తనను మరోసారి ఆశీర్వదిస్తే , డ్రై పోర్టు తీసుకొచ్చి వేలాదిమందికి ఉపాధి కల్పిస్తానని అన్నారు.