మిర్యాలగూడ : కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో పంటలు (Crops) ఎండిపోయాయని మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి (Jagadish Reddy) మండిపడ్డారు. మిర్యాలగూడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని , నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఇవ్వకుండా రైతుల పొలాలను ఎండబెట్టిందని ఆరోపించారు. మహాయజ్ఞంగా నిర్మించి లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తున్న కాళేశ్వరంపై అసత్య ప్రచారం చేశారని చేస్తున్నారని విమర్శించారు.
పంటలు ఎండిపోయిన తరువాత నీళ్లు వదిలి ఏం లాభమని అన్నారు. ప్రతిపక్ష పార్టీగా రైతుల తరఫున పోరాటం ప్రారంభించామని, పార్టీ అధినేత కేసీఆర్ (KCR) ఆధ్వర్యంలో ప్రభుత్వం మెడలు వంచేదాకా పోరాటం ఆగదని వెల్లడించారు. రైతాంగాన్ని ఆదుకోవాలని రేపు అన్ని నియోజకవర్గాల్లో నిరసన దీక్ష చేస్తున్నామని తెలిపారు. సాగర్(Sagar) ఎడమ కాల్వ కింద, లిఫ్ట్ల కింద, ఎస్ఎల్బీసీ(SLBC) కింద కూడా నీటి విడుదల చేసి చెరువులను నింపాలని డిమాండ్ చేశారు.
ప్రాజెక్టుల్లో నీటిని సద్వినియోగం చేసుకునే తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. మూర్ఖత్వంతో, అవగాహన రాహిత్యంతో పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. కరెంటు నిర్వహణ లేకపోవడంతో గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. నెలలో సగం రోజులు సీఎం ఢిల్లీలో ఉంటున్నాడని, సామంత రాజు లాగా ఢిల్లీకి కప్పం కడుతున్నాడని ఆరోపించారు. జిల్లా మంత్రులు ఉన్నారా లేదో కూడా అర్థం కావడం లేదని అన్నారు.