సూర్యాపేట, జూన్ 1 : కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి జ్వర సర్వేను పటిష్టంగా నిర్వహించాలని వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్. జి. శ్రీనివాస్, కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డితో కలిసి కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా కేసులు ఎక్కడ ఎందుకు పెరుగుతున్నాయో గుర్తించి ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో కరోనా పరీక్షల సంఖ్య పెంచి వేగవంతం చేయాలని తెలిపారు. కొవిడ్ పేషెంట్లను ఐసొలేషన్ కేంద్రాలకు తరలించాలని, చికిత్స అవసరమైన వారికి ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లాలని సూచించారు. అనంతగిరి, మోతె, అర్వపల్లి మండలాల్లో హోం ఐసొలేషన్లో ఉన్న వారిని వెంటనే ప్రభుత్వ ఐసొలేషన్ కేంద్రాలకు తరలించాలని చెప్పారు. జిల్లాలో ఎక్కువగా గిరిజన తండాలు ఉన్నందున మొబైల్ వాహనాల ద్వారా కరోనా పరీక్షలు చేయాలని తెలిపారు. అనంతరం పీహెచ్సీల వారీగా కొవిడ్ వివరాలను తెలుసుకున్నారు.
కరోనా ఉధృతి తగ్గింది : కలెక్టర్
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్ ఉధృతి కొంత మేర తగ్గిందన్నారు. జిల్లాలో లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పాఠశాలలు, వసతి గృహాలు, ఇతర భవనాలను తమ ఆధీనంలోకి తీసుకొని మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. రెండో విడుత ఇంటింటి సర్వేలో 7,20,873 మందిని పరీక్షించగా 20,246 మందికి లక్షణాలున్నట్లు గుర్తించారని, 16,741 మందికి మెడిసిన్ కిట్లు అందించారని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్పీ భాస్కరన్, అదనపు కలెక్టర్లు మోహన్రావు, పద్మజారాణి, జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, ఆర్డీఓలు రాజేంద్రకుమార్, కిశోర్కుమార్, వెంకారెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం, డాక్టర్ వెంకటరమణ, వైద్యాధికారులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. సమన్వయంతో పనిచేయాలి
కోదాడ రూరల్ : కరోనా కట్టడికి వైద్య, ఆరోగ్య, పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రిజ్వీ ఆదేశించారు. మంగళవారం కోదాడ మండల పరిషత్ కార్యాలయంలో కోదాడ, హుజూర్నగర్ డివిజన్లకు చెందిన అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొవిడ్ పాజిటివ్ రేటు తగ్గించేలా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ప్రభుత్వ వైద్యుల సమస్యలు పరిష్కరించాలని డాక్టర్ కల్యాణ్చక్రవర్తి ఆయనను కోరారు. వైద్య, ఆరోగ్యశాఖలో తాత్కాలిక ఉద్యోగులకు భద్రత కల్పించాలని తెలంగాణ మెడికల్, పబ్లిక్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాతాకుల మధుబాబు వినతి పత్రం అందించారు. సమావేశంలో తాసీల్దార్ జె.శ్రీనివాస్శర్మ, సూపరింటెండెంట్ రజిని, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.