నల్లగొండ, మే 7 : నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామంలో పనిచేసే పరమేశ్ (పేరు మార్చాం) అనే ఉద్యోగికి ఓటు హక్కు మునుగోడులో ఉండగా.. భువనగిరి ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు వేయాలని మెసేజ్ వచ్చింది. ఎల్బీనగర్లో ఓటు హక్కు ఉన్న తేజశ్విని (పేరు మార్చాం) అనే మహిళా ఉద్యోగి నల్లగొండలోని ఒక బ్యాంకులో పని చేస్తుండగా నల్లగొండలోని ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు వేయాలని మెసేజ్ వచ్చింది. దాంతో మంగళవారం ఆమె కోమటిరెడ్డి ప్రతీక్రెడ్డి కళాశాలకు వచ్చి ఓటేద్దామంటే తన పేరు లేదని హెల్ప్ డెస్క్ చెప్పింది. ఈ విషయాన్ని అక్కడే ఉన్న నమస్తే తెలంగాణ విలేకరి ఆర్డీఓ రవి దృష్టికి తీసుకెళ్తే ఎల్బీనగర్కు వెళ్లి వేయాలని చెప్పడంతో వెనుదిరిగిన ఆమె అక్కడి వరకు ఏం వెళ్తాంలే అనే పరిస్థితి. చండూరులో పని చేస్తున్న ఒక ఉద్యోగికి ఓటు నకిరేకల్లో ఉంటే మిర్యాలగూడ ఫెసిలిటేషన్ సెంటర్ నుంచి మెసేజ్ వచ్చింది. నల్లగొండ పాలిటెక్నిక్ కళాశాలలో ఏడుగురు ఉద్యోగులకు డ్యూటీ పడితే ఒక్క మహిళా ఉద్యోగికే మెసేజ్ వచ్చి మిగిలిన వారికి రాకపోవడంతో నల్లగొండ ఫెసిలిటేషన్ సెంటర్ నుంచి వెనుదిరిగారు. ఇవీ జిల్లాలో ఎన్నికల డ్యూటీ పడి ఓటు కోసం ఇక్కట్లు పడుతున్న ఉద్యోగుల పరిస్థితి.
జిల్లాలో మొత్తం 18వేల మంది ఉద్యోగులకు ఎన్నికల డ్యూటీలు పడ్డాయి. వీరికి ఇటీవల రెండు విడుతలుగా శిక్షణ ఇచ్చిన ఎన్నికల యంత్రాంగం ఈ నెల 13న జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ఎన్నికల విధుల్లో పాల్గొనాలని ఆర్డర్ కాపీలు సైతం ఇచ్చింది. ఆర్డర్ కాపీలు తీసుకున్న ఉద్యోగులు ఆ రోజు ప్రత్యక్షంగా ఓటు హక్కును వినియోగించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గానికి ఒక ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన అధికారులు.. ఉద్యోగుల నుంచి బ్యాలెట్ ద్వారా ఓటు స్వీకరిస్తున్నారు. అయితే.. డ్యూటీ పడ్డ ఉద్యోగులకు ఆర్డర్ పత్రాలు వచ్చినప్పటికీ ఒక నియోజకవర్గంలో ఓటు ఉంటే మరో నియోజకవర్గంలో ఓటు వేయాలని మెసేజ్లు రావడం, లేదంటే మెసేజ్లు అసలు రాకపోవడంతో ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 3నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతుండగా నేటితో పూర్తి కానుంది. కానీ.. ఇప్పటి వరకు 12వేల మంది ఉద్యోగులు ఓటు వేయగా.. ఇంకా ఆరు వేల మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉన్నది.