సూర్యాపేట : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విజన్ ఉన్న నాయకుడని (Visionary Leader), ఏ ప్రభుత్వ పథకమైనా మానవీయ కోణంలో ఆలోచించి అమలు చేస్తారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి (Minister Jagadish reddy) పేర్కొన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లో జరిగిన కుట్టు మిషన్ల పంపిణీలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రం ఏర్పాటుతో తెలంగాణ ప్రజల కష్టాలు దూరమవుతాయన్న ఉద్దేశ్యంతో కేసీఆర్ (CM KCR) ప్రాణాలకు ఎదురొడ్డి రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని వివరించారు. గత ప్రభుత్వాల పాలనలో సాగునీరు అందక పంటలు పండేవి కాదని, నేడు ప్రాజెక్టులు కట్టి రైతులకు సాగునీటిని అందివ్వడం వల్ల రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతుందని వెల్లడించారు. తెలంగాణ ఎవరి పాలనలో అభివృద్ధి చెందిందో ప్రజలు గమనించాలని కోరారు.
ఒక్క నల్గొండ జిల్లాలోనే 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుపడి ప్రజలంతా సంతోషంగా బ్రతుకుతున్నారని తెలిపారు. టైలర్స్ వృత్తిదారుల సంఘ భవనం కోసం స్థల కేటాయింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, టైలర్ సంఘం నాయకులు నగశ్ పాల్గొన్నారు.