సూర్యాపేట: జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన సూర్యపేట పట్టణం సుందరీకరణ జరుగుతున్న నేపధ్యంలో మంత్రి జగదీష్ రెడ్డి కొత్త రోడ్ల ఏర్పాటకు శ్రీకారం చుట్టనున్నారు. దీంతో పట్టణ రోడ్లకు మహర్దశ పట్టినట్లేనని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ముందెన్నడూ లేని రీతిలో ఏకకాలంలో కోటి 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో మూడు కొత్త పార్కులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల పట్టణ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
పట్టణంలోని చారిత్రక ప్రాశస్త్యం పొందిన సద్దుల చెరువు సమీపంలో రూ.50 లక్షలతో ఒక పార్క్ నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనితోపాటు రెండు పడకల ఇండ్ల నిర్మాణంతో పట్టణంలో పేరొందిన ఇందిరమ్మ కాలనీలో మరో రూ.50 లక్షలతో, ముత్యాలమ్మ గుడి వెనుక భాగంలో రూ.25 లక్షల అంచనా వ్యయంతో పార్కులు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వీటికి ఈ శనివారం ఉదయం శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
అంతేకాకుండా రోడ్ల విస్తరణతో కొత్త సొగసులు అద్దుకుంటున్న సూర్యాపేట పట్టణంలో మారుమూల కాలనీలకు మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించాలని మంత్రి జగదీష్ రెడ్డి సంకల్పించారు. ఈ క్రమంలో రూ.14 లక్షల అంచనా వ్యయంతో అంబేడ్కర్ నగర్లో, రూ.40 లక్షల అంచనా వ్యయంతో 27వ వార్డు పరిధిలోని ఆర్కే గార్డెన్ సమీపంలో, అదే విదంగా 13వ వార్డు పరిధిలోని అంజనాపురి కాలనిలో రూ.45 లక్షల అంచనా వ్యయంతో కొత్త రోడ్ల నిర్మాణాలకు మంత్రి జగదీష్ రెడ్డి శ్రీకారం చుట్టునున్నారు. వీటన్నింటికీ మంత్రి ఈ శనివారం ఉదయం శంకుస్థాపన చేయనున్నారు. అందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.