పోరాట యోధులకు పుట్టినిల్లు సూర్యాపేట అని, ప్రజా ఉద్యమాల్లో ఈ నేల ఎంతో కీలక పాత్ర పోషించిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేటలో జిల్లా ఆర్య వైశ్య ప్రముఖులతో ఇష్టాగోష్టిగా మంత్రి మాట్లాడారు. సమాజ సేవలో విశేష పాత్ర పోషిస్తున్న వర్తక, వ్యాపార వర్గాలు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదలు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదాయని గుర్తు చేశారు. భవ బంధాలను దూరం చేసుకొని బొమ్మగాని ధర్మ భిక్షం, ఆస్తిపాస్తులను వదులుకొని భీమిరెడ్డి నర్సింహా రెడ్డి, నిజాయితీకి ప్రతి బింబంగా నిలిచిన ఉప్పల మల్సూర్ ఇక్కడి బిడ్డలు కావడం గర్వపడే అంశమని తెలిపారు. ఆర్యవైశ్యులు వ్యాపారానికే పరిమితం కాలేదని, వారి సహకారంతో ఉద్యమాలు సాగాయని చెప్పారు. పలువురి సేవా స్ఫూర్తిని స్మరించుకునేందుకు ఈ నెల 16న జిల్లా కేంద్రంలో సేవాంకిత సభను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వనమా వెంకట రామయ్య, గుండా వెంకటప్పయ్యను స్మరించుకోవడంతోపాటు కేసీ గుప్తా విగ్రహం పునరుద్ధరణ
చేపట్టనున్నట్లు తెలిపారు.
– సూర్యాపేట టౌన్, జూలై 14
సూర్యాపేట టౌన్, జులై 14 : పోరాట యోధులకు సూర్యాపేట పుట్టినిల్లుగా చరిత్ర సృష్టించిందని, ప్రజా ఉద్యమాల్లోనూ సూర్యాపేట కీలకపాత్ర పోషించిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ప్రతి ఉద్యమం వెనుక వ్యాపార వర్గాలు కీలక పాత్ర వహించినట్లు ఆయన తెలిపారు. నాటి నైజాం పాలనకు వ్యతిరేకంగా ఈ గడ్డ మీద నుంచే పొరాటం ప్రారంభమైందన్నారు. ఆ పోరాటం వెనుక ముఖ్య భూమిక పోషించింది వ్యాపార వర్గాలేనన్న నగ్న సత్యాన్ని విస్మరించరాదన్నారు. శుక్రవారం ఉదయం సూర్యాపేట జిల్లా ఆర్మవైశ్య ప్రముఖులతో ఇష్ఠాగోష్టిగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. వ్యాపారంతో పాటు సమాజ సేవలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్న వర్తక, వ్యాపార వర్గాలు నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదలు నిన్నటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలకు ఊపిరిలూదారని ఆయన గుర్తు చేశారు. నైజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం మొదలైంది సూర్యాపేటలోనేనని అది కూడా వర్తక వ్యాపార, వాణిజ్య వర్గాల ప్రోత్సాహం తోటే అని తెలిపారు. ఆ తర్వాత జరిగిన 1969 తెలంగాణ తొలి దశ మొదలు, 1972లో జరిగిన జై ఆంధ్రా ఉద్యమానికి వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలైంది కూడా చైతన్యానికి మారుపేరుగా నలిచిన సూర్యాపేట నుంచే అని తెలిపారు. ఆ తర్వాతి క్రమంలో 1998 ప్రాంతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై తెలంగాణ జనసభ పేరుతో వేరు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన నేల కూడా సూర్యాపేటే అన్నారు.
అటువంటి గడ్డ మీద నుంచే బహుబందాలను దూరం చేసుకుని బొమ్మగాని ధర్మ భిక్షం.. ఆస్తి పాస్తులను వదులుకుని బీమిరెడ్డి నర్సింహారెడ్డి.. నిజాయితీకి ప్రతిబింబంగా నిలిచిన ఉప్పల మల్సూర్ సూర్యాపేట బిడ్డలు కావడం మనం గర్వపడే అంశం అన్నారు. అటువంటి మహనీయుల స్ఫూర్తి వర్తమానానికి అందించాల్సిన గురుతర బాధ్యత మనందరి మీద ఉన్నదని తెలిపారు. ఎక్కడా కూడా ఆర్యవైశ్యులు వ్యాపారానికే పరిమితం కాలేదని, వారి ప్రోత్సాహంతోనే ఉద్యమాలు సాగాయని వివరించారు. మొన్నటికి మొన్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో బాల భవన్ ఏర్పడిందంటే అది ముమ్మాటికీ వనమా వెంకటరామయ్య గొప్పదనమేనని కొనియాడారు. అటువంటి వారిని స్మరించుకునేందుకే ఈ నెల 16న జిల్లా కేంద్రంలో సేవాంకిత సభను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వనమా వెంకటరామయ్య, గుండా వెంకటప్పయ్యను స్మరించుకోవడంతో పాటు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించిన కేసీ గుప్తా విగ్రహం రోడ్ల విస్తరణతో పక్కకు పోయినందున అదే రోజు పునరుద్ధరణ ఉంటుందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో మీలా మహదేవ్, మొరిశెట్టి శ్రీనివాస్, వెంపటి సురేశ్, బ్రహ్మాండ్లపల్లి మురళి, ఉప్పల ఆనంద్, తోట శ్యామ్, బండారు రాజా, రాచర్ల కమలాకర్, మీలా వంశీ, యామా ప్రభాకర్, చల్లా లక్ష్మీకాంత్, మాజీ మార్కెట్ కమిటి చైర్ పర్సన్ ఉప్పల లలితాఆనంద్, గుండా శ్రీదేవి, ఇరిగి కోటేశ్వరి పాల్గొన్నారు.