సూర్యాపేట, నూతనకల్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు మితిమీరి పోతున్నాయి… పదేండ్ల కేసీఆర్ పాలనలో పచ్చగా ఉన్న రాష్ర్టాన్ని అరాచకాలతో కాంగ్రెస్ రాజ్యమేలుతోంది… తక్షణమే కాంగ్రెస్ నాయకులు తీరు మార్చుకోవాలి… పోలీసులు కూడా అరాచకాలను ప్రోత్సహించడం మానుకోవాలి… పరిస్థితి ఇలాగే కొనసాగి పరాకాష్టకు చేరితే ఆ పార్టీని పాతరేయడం బీఆర్ఎస్కు పెద్ద సవాలేం కాదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ను హెచ్చరించారు. ఇప్పటికీ తిరుగుబాటు వద్దు… తిరిగి మన రోజులే రాబోతున్నాయని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో ఇటీవల కాంగ్రెస్ గూండాల చేతిలో హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు.
మల్లయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం బాధిత కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. పార్టీ మల్లయ్య కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డితో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం లింగంపల్లిలో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ దాడులు తట్టుకొని 50 శాతం స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ శ్రేణులకు అభినందన తెలిపారు. సర్పంచ్ ఎన్నికలకే కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందని ఎద్దేవా చేశారు.
మేం తిరగబడితే రాష్ట్రం ఆగం
దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుత బీఆర్ఎస్ బలం తెలుసని, ఒకవేళ తమ కేడర్ తిరగబడితే ఏమైతదో ఒక్కసారి ఆలోచన చేయాలని కేటీఆర్ హెచ్చరించారు. పదేళ్లు మేము అధికారంలో ఉన్నాం… ఏనాడూ మీలాగా ఆలోచించలేదు… మేం కూడా మీలాగే ఆలోచించి ఉంటే ఎలా ఉందేదని ప్రశ్నించారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా దిక్కుమాలిన రాజకీయాలు మాని, ప్రజలకు మంచి చేయడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు కొనసాగితే తాము కూడా తిరగబడక తప్పదని, అదే జరిగితే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పి, పరిస్థితి చేయి దాటిపోతుందని హెచ్చరించారు.
కేసీఆర్ పదేండ్ల ప్రభుత్వంలో తుంగతుర్తిలో శాంతి వెల్లివిరిసిందని, అందరి సంతోషం కోసం, పేదల కడుపు నింపడం కోసమే పని చేశామని కేటీఆర్ చెప్పారు. అన్నదాతలకు నీళ్లు ఇవ్వాలని కృషి చేశామని, తుంగతుర్తికి కాళేశ్వరం నీళ్లు తెచ్చామని గుర్తు చేశారు. నల్లగొండ జిల్లా ఎల్లమ్మగూడెంలో సైతం తమ పార్టీ సర్పంచ్ అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేసి అతని చేత మూత్రం తాగించి దాష్టీకానికి పాల్పడ్డారన్నారు. చిట్యాల మండలంలో తమ అభ్యర్థి గెలవాల్సి ఉండగా ఓట్లు గల్లంతు చేశారన్నారు. ఇక మంత్రి ఉత్తమ్ ఏరియాలో అయితే అరాచకాలు పెచ్చుమీరుతున్నాయన్నారు. తాము సంయమనం కోల్పోతే మీరు మిగలరు. సహనాన్ని పరీక్షించవద్దు.. జాగ్రత్త కాంగ్రెస్ గూండాల్లారా అంటూ హెచ్చరించారు.
మల్లయ్య కుటుంబానికి ఉద్యోగం
కాంగ్రెస్ గూండాల చేతిలో హత్యకు గురైన మల్లయ్య కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. హత్య జరిగిన రోజు మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానని ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చానన్నారు. వాస్తవానికి హత్య జరిగిన రోజునే తాను ఇక్కడకు రావాలనుకున్నానని అయితే బీఆర్ఎస్ కేడర్ ఆగ్రహంతో ఉంది… ఉద్రిక్తత పెరిగే అవకాశం ఉంటుందని జగదీశ్రెడ్డి, కిశోర్ చెప్పడంతో ఆగిపోయానని కేటీఆర్ తెలిపారు. ఈ లెక్కన బీఆర్ఎస్ నాయకులు ఎంతటి శాంతికాముకులో తెలుసుకోవాలని కాంగ్రెస్కు హితవు పలికారు. మల్లయ్య కుటుంబానికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా మొక్కవోని ధైర్యంతో పోరాడి పంచాయతీ ఎన్నికల్లో సుమారు 50 శాతం సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలను కైవసం చేసుకున్న గులాబీ సైనికులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని కేటీఆర్ అన్నారు. మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, బూడిద భిక్షమయ్య గౌడ్, భూపాల్రెడ్డి నాయకులు చింతల వెంకట్రెడ్డి, ఒంటెద్దు నర్సింహారెడ్డి, గుజ్జ యుగేందర్రావు, దయాకర్రెడ్డి తదితరులు ఉన్నారు.