అనంతగిరి: గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని, ప్రతి నెలా పల్లె ప్రగతి పనులకు నిధులను మంజూరు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధ వారం మండల పరిధిలోని శాంతినగర్లో సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతిపిత గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని అన్నారు.
గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం ప్రభుత్వం ప్రయత్నస్తున్నదని, డెబ్బై ఏండ్లలో సాధించాలనుకున్న ప్రగతిని ఏడేండ్లలో సాధించిందన్నారు. పల్లెలన్నీ ప్రగతి వైపు పయనించేందుకు గ్రామాలలో చెత్త సేకరణ ట్రాక్టర్లు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, మిషన్ భగీరథ నీరు, పల్లె ప్రకృతివనాలు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేస్తానని చెప్పారు.
కార్యక్రమంలో వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి, సర్పంచ్ బద్దం కృష్ణారెడ్డి, ఎంపీటీసీ అనూష, కో ఆప్షన్ సభ్యులు, ఏఈ హర్ష, టీఆర్ఎస్ నియో జకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు బుర్ర పుల్లారెడ్డి, మండలాధ్యక్షుడు గింజుపల్లి రమేశ్, బుర్ర నరసింహారెడ్డి, శ్రీనివాస్గౌడ్, రాజేశ్వరరెడ్డి, స్వరూప వెంకటరెడ్డి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.