కోదాడ: టీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తుంటే విమర్శలు చేయడం సరికాదని, అసత్య ప్రచారాలు మానుకోవాలని డిసిసిబి డైరెక్టర్ కొండా సైదయ్య స్పష్టం చేశారు. శనివారం పట్టణంలోని సహకార సంఘ కార్యాలయంలో ఆయా సంఘాల చైర్మన్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాకాలంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ప్రతి సహకార సంఘం నుంచి రూ. 2 కోట్ల వరకు వ్యవసాయం, వ్యవసాయేతర రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు.
రాబోయే యాసంగి పంట ధాన్యం కొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు రాజకీయ లబ్దికోసం రైతుల కల్లాల దగ్గరకు వెళ్లి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని, కల్లాల దగ్గరకు వచ్చే కాంగ్రెస్ నాయకులను రైతులు నిలదీయాలని అన్నారు. ఎవరి ప్రభుత్వంలో రైతులకు మేలు జరిగిందో చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని, కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ది ఉంటే తన సవాల్ను స్వీకరించి బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘాల చైర్మన్లు ఆవుల రామారావు, నలజాల శ్రీనివాసరావు, అలసకాని జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.