సూర్యాపేట : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం కాంగ్రెస్ (Congress) కు పట్టుకుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డి (Jagadish Reddy) అన్నారు. శనివారం హుజూర్నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటమి భయంతో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Venkatreddy) , ఉత్తం కుమార్రెడ్డి (Uttam Kumar reddy) పోలీసులను అడ్డంపెట్టుకుని రాజకీయ మాడుతూ బీఆర్ఎస్ నాయకులను తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీ మారాలంటూ ఒత్తిడి చేస్తున్నారని, ఎటువంటి కారణాలు లేకుండా కేవలం అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం నాలుగు నెలల్లోనే వారి గ్రాఫ్ పడిపోయి ఎంపీ ఎన్నికల్లో ఓటమి భయం మొదలయ్యిందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రైతుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను ఎదుర్కొంటుందని వెల్లడించారు.
బీఆర్ఎస్ (BRS) నాయకులకు కేసులు కొత్త కాదని, ఉద్యమ కాలంలోనే అక్రమ కేసులను లెక్క చేయలేదని అన్నారు. పోలీసుల తీరుపై చట్టపరంగా పోరాటం చేస్తామని తెలిపారు. అక్రమ ఇసుక రవాణా వెనుక మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి ఒంటెద్దు నరసింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.