సూర్యాపేట : రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy ) అన్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి దేశం మొత్తం గర్విస్తున్నదని, పని చేసే ప్రభుత్వానికి పార్టీలకు అతీతంగా ప్రజలు అండగా ఉండాలని కోరారు. సూర్యాపేట రూరల్ మండలం సపవత్ తండా కు చెందిన గిరిజనులు మూకుమ్మడిగా మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ (BRS) లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని , పేదల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ (CM KCR ) దేనన్నారు. తెలంగాణలో రైతులు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, 24 గంటల ఉచిత విద్యుత్, ప్రాజెక్టులు నిర్మించి కాల్వల ద్వారా సాగు నీరు అందిస్తున్నారన్నారు. చేనేత, గీత కార్మికులకు కూడా పింఛన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.
మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగు నీరు అందిస్తున్నారని వెల్లడించారు. గృహలక్ష్మితో రూ.3 లక్షల ఆర్థిక సాయం, కుల వృత్తి దారులకు లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్నదన్నారు. బీఆర్ఎస్లో మాజీ సర్పంచ్ భీమ్లా నాయక్, వార్డ్ మెంబర్లు చందు, జయేంద్ర, జాను, శంకర్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్ రెడ్డి, జడ్పీటీసీ జీడీ భిక్షం, మండల అధ్యక్షుడు వంగాల శ్రీనివాస్ రెడ్డి , లాలు నాయక్, సురేందర్, ఎంపీటీసీ లక్ష్మి సైదులు, మాజీ సర్పంచ్ వాసుదేవ రెడ్డి , మధుర, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.