ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట పర్యటనకు సర్వం సిద్ధ్దమైంది. జిల్లా కేంద్రంలో నిర్మించిన కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయం, మెడికల్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలు ప్రారంభోత్సవానికి ముస్తాబయ్యాయి. సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి ఆదివారం ఉదయం 11.15గంటలకు హెలికాప్టర్లో సూర్యాపేటకు ముందుగా మెడికల్ కాలేజీ భవనాలను ప్రారంభించి, అనంతరం ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్, జిల్లా పోలీస్ ఆఫీస్, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని అందుబాటులోకి తేనున్నారు. కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించి, అక్కడే జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అటునుంచి సూర్యాపేట కొత్త మార్కెట్ సమీపంలో మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో ఏర్పాటుచేస్తున్న భారీ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా చేరుకుని ప్రసంగించనున్నారు. స్వరాష్ట్రంలో సూర్యాపేట రూపురేఖలు మార్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రజలు పెద్దఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు సిద్ధమవుతుండడంతో అందుకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రారంభానికి సిద్ధమైన భవనాలు, సభా ప్రాంగణాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి శనివారం పరిశీలించారు. అధికారులకు అవసరమైన సూచనలిచ్చారు.
సూర్యాపేట, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట పర్యటనకు సర్వం సిద్ధమైంది. ప్రారంభోత్సవాలు చేయనున్న భవనాలు ముస్తాబయ్యాయి. ఆదివారం సీఎం పర్యటన పురస్కరించుకొని సూర్యాపేట పట్టణం సర్వాంగ సుందరంగా, గులాబీమయంగా మారింది. ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నేరుగా సూర్యాపేటకు చేరుకొని తొలుత రూ.500 కోట్లతో చేపడుతున్న మెడికల్ కళాశాలకు సంబంధించి రూ.156 కోట్లతో నిర్మించిన ప్రధాన భవనాలను ప్రారంభిస్తారు. అనంతరం రూ.30.18 కోట్లతో పాత వ్యవసాయ మార్కెట్లో నిర్మాణమైన ఇంటెగ్రేటెడ్ మోడల్ మార్కెట్ను ప్రారంభించి.. అక్కడి నుంచి నేరుగా రూ.38.50 కోట్లతో 20 ఎకరాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న జిల్లా పోలీసు కార్యాలయం వద్దకు చేరుకొని ప్రారంభిస్తారు. అనంతరం సమీపంలోనే నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి జిల్లా కేంద్రంలో రూ.50 కోట్లతో 21 ఎకరాల్లో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవం చేస్తారు. అక్కడ జిల్లా అధికారులతో సమీక్ష అనంతరం సూర్యాపేటలో మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారు.
కాగా, సీఎం పర్యటన సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కాగా, సీఎం హెలికాప్టర్ దిగేందుకు స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాల, నూతన కలెక్టరేట్లో పర్మినెంట్ హెలిప్యాడ్తోపాటు బహిరంగ సభ జరుగనున్న ప్రాంగణానికి సమీపంలో మరో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. తొలుత ఎస్వీ డిగ్రీ కళాశాలలో ల్యాండ్ అయిన తరువాత సీఎం అక్కడి నుంచి వాహనాల్లో పట్టణంలో పర్యటించనున్నారు. హెలికాప్టర్ తిరిగి బహిరంగ సభా ప్రాంగణం వద్ద ల్యాండ్ అయి సభ అనంతరం అక్కడి నుంచి సీఎంను తీసుకొని హైదరాబాద్ వెళ్లనుంది.
సీఎం పర్యటన ఇలా..
ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నేరుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లో దిగుతారు. అక్కడి నుంచి వాహనంలో సమీపంలో ఉన్న మెడికల్ కళాశాల వద్దకు వెళ్లి ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి సద్దుల చెరువు మినీ ట్యాంక్బండ్ కింది రోడ్డు మీదుగా పాత వ్యవసాయ మార్కెట్లో నిర్మించిన అధునాతన మోడల్ మార్కెట్ వద్దకు చేరుకొని దానిని ప్రారంభిస్తారు. తదనంతరం కర్నల్ సంతోష్బాబు చౌరస్తా మీదుగా ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయం, ఆ పక్కనే ఉన్న బీఆర్ఎస్ పార్టీ నూతన భవనాలను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి జనగాం క్రాస్రోడ్డు మీదుగా జాతీయ రహదారిపైకి వచ్చి కొత్త బస్టాండ్ మీదుగా ఎక్స్టెన్షన్ 60 ఫీట్ల రోడ్డు మార్గంలో నూతన కలెక్టరేట్ భవనం వద్దకు చేరుకుంటారు. కలెక్టరేట్ను ప్రారంభించి జిల్లా అధికారులతో సూర్యాపేట అభివృద్ధిపై సమీక్ష చేపడుతారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేయనున్నారు. అనంతరం కొత్త మార్కెట్ సమీపంలో 70 ఎకరాల ప్రాంగణంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
పార్కింగ్ ప్రాంతాలు..
బహిరంగ సభకు వచ్చే వారితో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఆయా ప్రాంతాల్లో పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూర్.ఎస్, చివ్వెంలతోపాటు మోతె, తుంగతుర్తి నియోజకవర్గం నుంచి వచ్చే వారి కోసం నూతన వ్యవసాయ మార్కెట్, అంబేద్కర్ గ్రౌండ్లో వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. పెన్పహాడ్ మండలంతోపాటు కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల నుంచి వచ్చే వారి కోసం సుధాకర్ పీవీసీ సమీపంలోని రహదారి మీదుగా నూతన వ్యవసాయ మార్కెట్ తూర్పు వైపు ఉన్న ఓపెన్ ప్లేస్లో పార్కింగ్ సదుపాయం కల్పించారు. వీఐపీలకు మాత్రం బహిరంగ సభ జరిగే డయాస్ వెనుకాల ఏర్పాటు చేశారు.
సీఎం కేసీఆర్ కోసంఎదురుచూస్తున్న జనం
సూర్యాపేటలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కోసం అంతా ఎదురు చూస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సీఎం ప్రారంభించాల్సిన భవనాలు, బహిరంగ సభ ప్రాంగణాన్ని మంత్రి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనను కలిసిన మీడియాతో మాట్లాడారు. సూర్యాపేటను జిల్లా కేంద్రం చేయడంతోపాటు వందల కోట్లు ఇవ్వడంతో అద్భుతమైన అభివృద్ధి జరిగిందన్నారు. ప్రత్యేకించి ప్రజలు ఊహించని విధంగా ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చిన వరం మెడికల్ కళాశాల అని, దానిని నేడు ప్రారంభోత్సవం చేస్తారని తెలిపారు. సాగునీరు లేక రైతులు నీరసించిపోతే సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారన్నారు. దాని తొలి ఫలితం సూర్యాపేటకే దక్కిందని చెప్పారు. ఇప్పటికే ఆరు సార్లు పంటలు పండించిన రైతులు ఏడోసారి నాట్లు పెడుతున్నారన్నారు. అలాగే పట్టణ ప్రజలకు మిషన్ భగీరథతో స్వచ్ఛమైన తాగునీటిని ఇస్తున్నామని గుర్తు చేశారు. అందుకే సీఎంను చూడాలి.. ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలని, ఆయన మాటలు వినాలని సాధారణ ప్రజలు, రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. సొంత వాహనాలు, ట్రాక్టర్లు, లారీలు, ఆటోల్లో స్వచ్ఛందంగా వస్తున్నారనే సమాచారాన్ని బీఆర్ఎస్ శ్రేణుల ద్వారా తెలిసిందని చెప్పారు. ఆ స్థాయిలో జనం వస్తున్నందున తదనుగుణంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ వ్యాఖ్యలు ఉంటాయని తెలిపారు.