సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలో పోలీసులు 25 కిలోల గంజాయిని పట్టుకుని(Ganja seize ) ఇద్దరిని అరెస్టు చేశారు. జిల్లా అదనపు ఎస్పీ నాగేశ్వరరావు మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. పట్టణంలోని ఎన్టీఆర్ పార్క్ వద్ద అనుమానంగా ఆపి ఉన్న రెండు కార్లను పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించి అధికారులకు సమాచారం అందించారని పేర్కొన్నారు.
పోలీసులు (Police) కార్లను తనిఖీ చేయగా ఒక కారులో 24 కిలోలు, మరో కారులో కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ కేసులో నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి గ్రామానికి చెందిన చారగొండ ప్రకాష్, మిర్యాలగూడ శాంతినగర్కు చెందిన తాల్ల సుమంత్ను అరెస్టు చేయగా భార్గవ రామ్ అనే నిందితుడు పరారైయ్యాడని ఆయన తెలిపారు.
తాల్ల సుమంత్కు గంజాయి తాగే అలవాటు ఉండడంతో ప్రకాష్ తోట(Field) లో గంజాయిని పండించారని వెల్లడించారు. పంటను తెంపిన తరువాత ఇద్దరు కలిసి సూర్యాపేటకు వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్లో ఉన్న భార్గవ్రామ్కు సమాచారం అందజేసి సూర్యాపేటకు పిలిపించుకున్నారు. బుధవారం రాత్రి అనుమానస్పదంగా ఉన్న కార్లను తనిఖీ చేయగా గంజాయి గుట్టు రట్టయిందని ఏసీపీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి రెండు కార్లను, 25 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. వీరిలో భార్గవ్రామ్ పరారీలో ఉన్నాడని ఆయన పేర్కొన్నారు.