దౌల్తాబాద్, జూన్ 5 : సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం దీపాయంపల్లిలో తల్లి దండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరి చిన్నారుల దయనీయ పరిస్థితిపై మండలానికి చెందిన చెన్నరాజు ట్విటర్లో శుక్రవారం మంత్రులు హరీశ్రావు, కేటీఆర్కు ట్వీట్ చేయగా, వారు స్పందించారు. దీపాయంపల్లికి చెందిన గొల్ల రాములు గుండె సమస్యతో కొన్నేండ్ల కింద మృతిచెందాడు. ఆరునెలల కింద ఆయన భార్య అనసూయ అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో ఆ దంపతుల పిల్లలు సమీరా, సందీప్ అనాథలుగా మారారు. ఉండడానికి ఇల్లు లేక గ్రామంలో ప్రభుత్వ ఖాళీ స్థలంలో టార్పాలిన్ కవర్లతో గుడిసెలా నిర్మించుకొని నివసిస్తున్నారు. వారి దయనీయ పరిస్థితి గురించి మంత్రులకు యువకుడు ట్వీట్ చేయగా, శనివారం మంత్రులు స్పందించారు. చిన్నారులకు తాను అండగా ఉంటానని, ప్రభుత్వం పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తానని హరీశ్రావు హామీ ఇచ్చారు. వారి యోగక్షేమాలు చూడాలని సిద్దిపేట కలెక్టర్కు మంత్రి కేటీఆర్ సూచించారు. దీంతో గ్రామస్తులు మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.