నల్లగొండ, ఏప్రిల్ 12 : చేనేత, పవర్లూమ్ కార్మికులకు ఆర్థికంగా చేయూతనిచ్చి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేనేత పొదుపు మరియు భద్రత పథకం(త్రిఫ్ట్)అమలు చేస్తున్నది. పథకం కాలపరిమితి మూడేండ్లు ఉండగా మూడేండ్లలో చేనేత కార్మికులు పొదుపు చేసిన సొమ్ముకు రెట్టింపు అందజేసి వారిని ఆదుకుంటుంది. అయితే ఈ పథకం జిల్లాలో ఇప్పటికే రెండుసార్లు అమలు కాగా, తాజాగా మరోసారి అమలుకు చర్యలు చేపడుతున్నది. గతంలో కొవిడ్ పరిస్థితులు ఉన్నప్పటికీ చేనేతలు ఆర్థికంగా ఇబ్బంది పడొద్దని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రూ.30 కోట్లు విడుదల చేసింది. దాంతో జిల్లా యంత్రాంగం ఈ నెల 15 నుంచి ఉమ్మడి జిల్లాలో దరఖాస్తులు తీసుకునేలా చర్యలు చేపట్టింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 3,025 మందికి ప్రయోజనం చేకూరనున్నది. ఈ పథకం కింద గతేడాది కార్మికులకు రూ.10.13 కోట్ల ప్రయోజనం చేకూరగా, ఈ సారి రూ.12 కోట్లు రానుంది. ఇదిలా ఉండగా ఈ సారి కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల బీమా అందజేసేలా చర్యలు చేపడుతూ ప్రీమియం చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నది.
మరో దఫా ఆర్థిక భరోసా..
చేనేత, పవర్లూమ్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న త్రిఫ్ట్ పథకం జిల్లాలో 2017 జూలై 20 నుంచి కొనసాగుతుంది. ఈ పథకం కింద చేనేత కార్మికులు గతంలో నెలకు రూ.వెయ్యి పొదుపు చేస్తే మరో రూ.వెయ్యి జమ చేసి రూ.2 వేల ప్రోత్సాహకం అందిస్తుంది. వారి కింద ఓ సహాయకుడు రూ.600 పొదుపు చేస్తే, మరో రూ.600 జమ చేసి రూ.1200 ప్రోత్సాహకం అందజేసింది. అదే విధంగా పవర్లూమ్ కార్మికులు రూ.వెయ్యి పొదుపు చేస్తే మరో రూ.వెయ్యి ప్రోత్సాహకం అందజేస్తుంది. కార్మికులు తమ పొదుపు సొమ్మును రికరింగ్ డిపాజిట్-1(ఆర్డీ-1)ఖాతాలో జమ చేయనుండగా నెలవారీగా ప్రభుత్వం వారి పేరుతో ఉన్న రికరింగ్ డిపాజిట్-2(ఆర్డీ-2)ఖాతాలో జమ చేస్తుంది. 36 నెలల తర్వాత పొదుపుతోపాటు ప్రోత్సాహకం అందజేస్తుంది. ఇప్పటికే జిల్లాలో రెండుసార్లు ఈ పథకాన్ని అమలు చేసిన సర్కారు మరో దఫా అమలు చేయాలని తలచి నిధులు విడుదల చేయగా, దాని అమలుకు చేనేత యంత్రాంగం చర్యలు చేపడుతుంది.
3,025 మందికి లబ్ధి
త్రిఫ్ట్ పథకం కింద నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 3,025 మంది కార్మికులు నెల వారీగా తమ సొమ్మును రికరింగ్ డిపాజిట్లో జమ చేస్తున్నారు. ఇందులో చేనేత కార్మికులు 2,292 మంది ఉండగా ప్రధాన చేనేత కార్మికుడికి రూ.2,400, సహాయ చేనేత కార్మికుడికి రూ.1,200 చొప్పున నెల వారీగా జమ చేస్తుంది. ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి 36 నెలల కాలానికి వారి ఖాతాల్లో జమ చేస్తారు. ఇక పవర్లూమ్ కార్మికులు 733 మంది ఉండగా, వీరికి నెలకు రూ.వెయ్యి చొప్పున జమవుతాయి. మొత్తంగా చేనేత, పవర్లూమ్ కార్మికులు 3,025 మందికి రూ.18 కోట్లు వారి ఖాతాల్లో జమవుతాయి.
జియో ట్యాగింగ్ చేసిన వారికే అవకాశం
జిల్లాలో హ్యాండ్లూమ్ కార్మికులు 2,292, మరమగ్గం కార్మికులు 733 మంది ఉన్నట్లు చేనేత, జౌళి శాఖ యంత్రాంగం గుర్తించి వారికి జియో ట్యాంగింగ్ ఇచ్చింది. వీరు ప్రతిరోజూ గరిష్ఠంగా రూ.12వేల వరకు ఆర్జిస్తారు. ఇందులో 8 శాతం పొదుపు చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వం 16 శాతం పొదుపు చేసి మొత్తం సొమ్ము మూడేండ్ల తర్వాత ఇస్తుంది. ఏ కారణం చేతనైనా ఉత్పత్తులు విక్రయించలేకపోవడం, నూలు దిగుమతి లేకపోవడం, మరమగ్గాలు పని చేయకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వీటిన్నంటినీ అధిగమించి వారి జీవన విధానాన్ని మెరుగుపర్చుకునేందుకు ఈ త్రిఫ్ట్ ఎంతో ఉపయోగ పడుతుంది. జూన్ 1 నుంచి జిల్లాలో 36 నెలలపాటు ఈ పథకం అమలు కానున్నందున ఆసక్తి కలిగి జియో ట్యాగింగ్ ఉన్న కార్మికుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
దరఖాస్తు చేసుకోవాలి : ఏడీ
జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న మరమగ్గ కార్మికులు ఈ నెల 15 నుంచి మే 31 వరకు నల్లగొండలోని చేనేత జౌళి శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ ఏడీ ద్వారక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిజైనింగ్, వార్పింగ్, వైండింగ్, బ్లీచింగ్, రోలింగ్ విభాగంలో పని చేస్తున్న కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ.18కోట్లు కేటాయించినందున మరమగ్గ కార్మికులు వారి వేతనంలో 8 శాతం పొదుపు చేస్తే ప్రభుత్వం మరో 8 శాతం జోడించి వారి ఆర్డీ-2 ఖాతాలో పొదుపు చేస్తున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు 99121 83164 నంబర్ను సంప్రదించాలని సూచించారు.