శతమానం భవతి అన్నమాట అనాదిగా వస్తున్న ఆశీస్సు. ఆయుష్షు ఎవరి చేతిలోనూ ఉండకపోవచ్చు… కానీ, నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. అది మానవ నైజం కూడా. బతుకు మీద తీపి, రేపటి రోజున కూడా సూర్యుడితోపాటు పరుగుతీస్తామనే ఆశయమే మనల్ని ముందుకు నడిపిస్తున్నది కదా! ఏదన్నా పెద్ద కష్టం వచ్చినా, రాబోయే రోజు బాగుంటుందనే ఆశే మనల్ని కాడి వదలకుండా కాపాడుతుంది కదా! మరి ఆ నూరేళ్లను నిండుగా కాపాడుకోవడం ఎలా! జన్యువులు మన చేతిలో ఉండకపోవచ్చు, కొవిడ్ లాంటి మహమ్మారులు అకస్మాత్తుగా ముంచెత్తవచ్చు… కానీ మన చేతిలో ఉన్నంతవరకూ కొన్ని జాగ్రత్తలు కనుక పాటిస్తే తప్పకుండా ఆరోగ్యంగా ఉండగలం.
Health Tips | రోజులు మునుపటిలా లేవు. పీల్చేగాలి, తాగేనీరు కలుషితం అవుతున్నాయి. కదలకమెదలక కూర్చుని పనిచేసుకునే జీవనశైలి, అనారోగ్యాలను మన కుర్చీ దగ్గరకే డోర్ డెలివరీ చేస్తున్నది. పోనీ ఆహారం విషయంలో జాగ్రత్త ఉందా అంటే అదీ లేదు! అసలే పురుగు మందులతో ఆహారం కలుషితం అవుతుంటే మరింత జాగ్రత్త పడాల్సింది పోయి… మైదా, చక్కెర, రసాయనాలు తప్ప మరొకటి లేని జంక్ఫుడ్కి అలవాటుపడిపోతున్నాం. ఇది నాణానికి ఒకవైపు. మరోవైపు ఆరోగ్యం గురించి అవగాహన కలిగించే సమాచారం ఇబ్బడిముబ్బడిగా అందుబాటులో ఉంటున్నది. వైద్యంలో సరికొత్త పరిశోధనలు జరుగుతున్నాయి. ఎలాంటి అనారోగ్యానికైనా, పరిష్కారం దొరుకుతున్నది. వీటిన్నిటినీ ఉపయోగించుకుంటూ నిండు నూరేళ్లు చల్లగా ఉండేందుకు తెలుసుకుని తీరాల్సిన కొన్ని విషయాలను పంచుకుందాం!
దీర్ఘాయువు ఉంటే సరిపోదు. మలి వయసులోనూ గుండె మెరుగ్గా ఉండాలి, మెదడు చురుగ్గా ఆలోచించాలి. ఈ రెండు అవయవాలూ సక్రమంగా లేకపోతే, ఆయువు భారమవుతుంది. ప్రతిష్ఠాత్మక అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఈ విషయమై ఏడు సూచనలు చేస్తున్నది. వీటిని పాటిస్తే ఏకంగా 20 శాతం మరణాలు తగ్గిపోతాయని అంచనా వేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో పరిశోధనలు, నిపుణుల సూచనలు, గత రికార్డుల ఆధారంగా రూపొందించిన ఈ ఏడు సూచనలకు ‘లైఫ్స్ సింపుల్ 7’ అని పేరు. అవి…
కాస్త జాగ్రత్తగా గమనిస్తే వీటిలో మొదటి నాలుగు సూచనలు మన చేతిలోనే ఉంటాయి. వీటిని మోడిఫయబుల్ బిహేవియర్స్ అంటారు. అంటే మన అలవాట్లను లేదా దినచర్యను మార్చుకోవడం ద్వారా ఈ లక్ష్యాలను చేరుకోవచ్చు. ఉదాహరణకు వ్యాయామం, నడక, ఆటలు లాంటివాటి ద్వారా చురుగ్గా ఉండటం అనే సూచనను అందుకోవచ్చు. ఇక మిగతా మూడు సూచనలు బయోమెట్రిక్ మెజర్స్… అంటే ఎప్పటికప్పుడు అవి నియంత్రణలో ఉన్నాయో లేదో తేలికపాటి పరీక్షల ద్వారా గమనించుకుంటే చాలు. మెరుగైన ఆరోగ్యం కోసం చాలా జాగ్రత్తలే తీసుకోవాలి! కానీ, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఈ ఏడిటినీ ప్రత్యేకంగా ఎంచుకోవడం వెనుక ఓ కారణం ఉంది. మన రక్తనాళాలు గట్టిపడటం లేదా కుంచించుకుపోవడమే గుండె, మెదడు దెబ్బతినేందుకు ప్రధాన కారణం. ఈ పరిస్థితిని రక్తనాళాలు గట్టిపడటం (ఎథెరోస్క్లిరోసిస్) అంటారు. రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది. దీనికి పైన చెప్పుకొన్న ఏడు అంశాలలో అజాగ్రత్తే ముఖ్య కారణం. అందుకే ఈ సప్త సూచనలు!
ఆటపాటలు భారతీయ జీవనవిధానంలో భాగంగా ఉండేవి. శాస్త్రప్రకారం సాగే సంప్రదాయ నృత్యాలు కావచ్చు, మనసును అనుసరించే జానపద నాట్యాలు కావచ్చు… డ్యాన్స్ అంటే మనకు ప్రాణం. కానీ, కాలక్రమంలో ఎవరు ఏమనుకుంటారో అని కాలు కదపడమే మానేశాం. ఫ్లాష్ మాబ్, జుంబా లాంటి కొత్త రకాలు వస్తున్నా… అవి కార్పొరేట్ సంస్కృతిలో భాగంగానే ఉన్నాయి. ఇంతకీ ఇప్పుడు నాట్యం గురించి ఇంతలా చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే కారణం ఉంది!
వయసు మీద పడుతున్న కొద్దీ శరీరంలో అవయవాలు బలహీనపడటం ఒక ఎత్తు. మెదడులో ఏర్పడే సమస్యలు మరో ఎత్తు. మెదడులో ఎప్పటికప్పుడు కొత్త న్యూరాన్లు ఏర్పడి దాని పనితీరును స్థిరంగా ఉంచుతుంటాయి. కానీ, వార్ధక్యంలో కొత్త న్యూరాన్లు ఏర్పడే వేగం తగ్గిపోతుంది.
ఫలితంగా మతిమరపు (డిమెన్షియా), అల్జీమర్స్ లాంటి సమస్యలు వస్తాయి. నాట్యం చేసేవారిలో ఈ సమస్య రాకపోవడాన్ని గమనించారు పరిశోధకులు. ఈ విషయమై నిజానిజాలు తేల్చేందుకు జర్మనీకి చెందిన పరిశోధకులు ఓ ప్రయోగం చేశారు. దీనికోసం 68 ఏళ్ల సగటు వయసున్న కొందరు వృద్ధులను ఎంచుకున్నారు. వీరికి ఏడాదిన్నరపాటు రకరకాల వ్యాయామాలతో కూడిన దినచర్యను సూచించారు. వారిలో కొందరికి సైక్లింగ్, మరికొందరికి వాకింగ్, ఇంకొందరికి నాట్యం సూచించారు. కాలపరిమితి ముగిసిన తర్వాత వీరి మెదడులోని హిప్పో కాంపస్ అనే భాగాన్ని పరిశీలించారు. ఈ హిప్పో కాంపస్ మన మెదడుకు ఆయువుపట్టు. మన నేర్పు, విచక్షణ, జ్ఞాపకశక్తులకు కీలకం.
తమ దినచర్యలో ఏదో ఒక శారీరక శ్రమ చేసిన ప్రతి ఒక్కరిలోనూ ఈ హిప్పో కాంపస్ మెరుగైనట్టు కనిపించింది. కానీ, నాట్యం చేస్తున్నవారిలో అది మరింత శక్తిమంతంగా ఉన్నట్టు తేలింది. ఇందుకు స్పష్టమైన కారణాలు లేకపోలేదు. నాట్యాన్ని నేర్చుకునే క్రమంలో రకరకాల భంగిమలు సాధన చేయాలి. ఒకదాని తర్వాత మరొకటిగా వాటిని ఓ క్రమంలో గుర్తుంచుకోవాలి. వాటికి అనుగుణంగా శరీరాన్ని దారికి తెచ్చుకోవాలి. ఇదంతా జరుగుతున్నప్పుడు మనకు తెలియకుండానే ఏకాగ్రత బలపడుతుంది. సహనం ఏర్పడుతుంది. శరీరమూ, మెదడూ సమన్వయంతో సాగుతాయి. కండరాల మీద పట్టు పెరుగుతుంది. ఇతరులు ఏమనుకుంటారో అన్న జంకు దూరమవుతుంది. ఏతావాతా… నడివయసు తర్వాత నాట్యం అదనపు భారం కాదు, ఆయువును పెంచే మార్గం అని అర్థమవుతున్నది కదా!
ఏ ఇంట్లో పుట్టాలో, ఎవరికి తోబుట్టువు కావాలో మనం ఎంచుకోలేం. కానీ స్నేహితులను మాత్రం మనం ఎంచుకోవచ్చు. నేస్తాల వల్ల కష్టం దూదిపింజలా తేలిపోతుందని, సుఖం రెట్టింపవుతుందనీ తెలుసు. రోగనిరోధక శక్తి నుంచి వ్యసనాలను వదులుకోవడం వరకూ చాలా సందర్భాల్లో స్నేహితుల ప్రభావాన్ని ఎన్నో పరిశోధనలు బలపరిచాయి. కానీ నిండు ఆయుష్షు కోసం, మలి దశలో సంతోషం కోసం స్నేహం చాలా కీలకం అని గమనించాలి. ఈ విషయాన్ని నిరూపించేందుకు మిషిగన్ విశ్వవిద్యాలయానికి చెందిన విలయం చోపిక్ అనే పరిశోధకుడు ఓ అరుదైన ప్రయోగం చేశాడు.
దీనికోసం ఏకంగా వంద దేశాల నుంచి 2.70 లక్షల మంది వివరాలను సేకరించాడు. వీరిలో చాలామంది తమ స్నేహితుల వల్ల మెరుగైన ఆరోగ్యంతో ఉంటున్నామనీ, వార్ధక్యంలో వారి స్నేహం మరింత అండగా ఉంటున్నదనీ చెప్పారు. ఇది కేవలం వారి నమ్మకమేనా లేకపోతే వాస్తవమా తేల్చేందుకు మరో పరిశోధన చేశాడు చోపిక్. దానికోసం ఏడువేల మంది ఆరోగ్య రికార్డులను పరిశీలించాడు. స్నేహితులతో కాలం గడిపేవారు నిజంగానే మెరుగైన ఆరోగ్యంతో ఉన్నట్టు ఈ నివేదికలో తేలింది. అంతేనా! వయసు పెరుగుతున్న కొద్దీ స్నేహితుల ప్రభావం మరింత సానుకూలంగా ఉన్నట్టు బయటపడింది. ఇందుకు స్పష్టమైన కారణాలు కూడా చెబుతున్నారు.
అడుగులు వేయడం నేర్చుకున్న పిల్లలు కదిలేందుకు ఆరుబయలు లేదు. చదువుకునే పిల్లలు ఆడుకునేందుకు ఆటస్థలాలు లేవు. టీనేజిలో అడుగుపెట్టాక చదువుకే సమయం సరిపోతున్నది. కెరీర్ మొదలుపెట్టాక కెరీరే సర్వస్వం అవుతున్నది. వీటికి తోడు మొబైల్, టీవీ లాంటి ఇతరత్రా స్క్రీన్లు సరే. ఈ హడావుడిలో కుర్చీలోంచో, సోఫానుంచో లేచి ఓ నాలుగు అడుగులు వేసేది ఎంతమంది? రోజుకు పదివేల అడుగులు వేయకపోయినా… వీలైనంత నడుస్తూ ఉండమని వైద్యులు చెబుతూనే ఉన్నారు. కానీ కదలని జీవనశైలితో ఊబకాయం, మధుమేహం లాంటి సమస్యలు కొనితెచ్చుకుంటూనే ఉన్నారు. ఈ తరహా జీవనశైలి వల్ల ఏడాదికి ఇరవై లక్షలమంది చనిపోతున్నారని సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థే హెచ్చరిస్తున్నది.
ప్రపంచవ్యాప్తంగా జరిగే మరణాలకు దారితీసే తొలి పది కారణాల్లో శరీర కదలికలు లేకపోవడం కూడా ఒకటి అంటే నమ్మగలమా! అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో 60-85 శాతం మంది ప్రజలు ఈ తరహా జీవనశైలికి అలవాటు పడిపోయారని డబ్ల్యూహెచ్వో గణాంకాలు చెబుతున్నాయి. రోజుకు కనీసం అరగంటైనా సరే శారీరక శ్రమ ఉండి తీరాలని సూచిస్తున్నది. మరో ప్రముఖ ఆరోగ్య సంస్థ జాన్ హాప్కిన్స్ కూడా ఇలాంటి హెచ్చరికలే చేసింది. 12 వేల మంది జీవనశైలిని పరిశీలించిన తర్వాత, 60 ఏళ్ల వృద్ధులు ఎంత బద్ధకంగా జీవితాన్ని గడుపుతున్నారో 19 ఏళ్ల కుర్రకారు కూడా అంతే నిస్ర్తాణంగా ఉన్నారని తేల్చింది. రేపటి నుంచి వాకింగ్, వచ్చే ఏడాది నుంచి వ్యాయామం, ఇవాళ టీవీ చూసేద్దాం, ఇంకాసేపు రీల్స్తో గడుపుదాం… అనుకునే ప్రతి ఒక్కరినీ హెచ్చరించే విషయాలే ఇవి.
ప్రపంచంలో ఉన్న మతాలన్నీ దానం చేయమని సూచిస్తున్నాయి. అసలు దేవుడే లేడనేవారు కూడా సాయం వల్ల సమాజం, అందులో ఉండే మనమూ ప్రభావితం అవుతామని నమ్ముతారు. అలా చేసే దానం మనలో తెలియని సంతృప్తిని కలిగిస్తుందని ఓ యాభై ఏళ్లుగా వైజ్ఞానిక ప్రపంచం కూడా ఒప్పుకొంటున్నది. దీనికి హెల్పర్స్ హై అనే పేరు కూడా పెట్టారు. ఈ హెల్పర్స్ హైతో మనలోని సానుకూల హార్మోన్లు మెరుగుపడతాయనీ… అవి మెరుగైన ఆయుష్షుకూ, ఆరోగ్యానికీ దారి తీస్తాయని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఉదాహరణకు జూరిచ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన ఓ పరిశోధనలో ఎదుటి వ్యక్తికి సాయం చేసిన వెంటనే మన మెదడులో సానుకూలమైన మార్పులు వచ్చినట్టు గమనించారు.
మన భాష, ఏకాగ్రత, ప్రవర్తనలను నియంత్రించే టెంపరాపరేటల్ జంక్షన్; మన నేర్పు, సంతోషాలకు కీలకమైన వెంట్రల్ స్ట్రయటల్; మన ఉద్వేగాలు, సంతృప్తిని ప్రభావితం చేసే ఆర్బిటోఫ్రంటల్ కార్టెక్స్ అనే మూడు భాగాలలో స్పష్టమైన మార్పు కనిపించిందట. ఇలాంటి ఎన్నో మార్పులు మన ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతాయి. దానం చేసే గుణంతో మనలో రక్తపోటు, ఒత్తిడి, నిద్రలేమి లాంటి సమస్యలు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. స్వచ్ఛంద సేవ చేసే అలవాటు ఉన్నవారు, ఇతరుల కంటే మరో ఐదేళ్లు ఎక్కువగా జీవిస్తున్నట్టు లాన్సెట్ పత్రికలో ఓ కథనం వచ్చింది. ఎందుకాలస్యం… సంపదో, సమయమో, నైపుణ్యమో మనకు ఉన్నదానిలోంచి కొంత సాటిమనిషితో పంచుకుందామా!
అనగనగా ఓ నడివయసు మనిషి. పత్రికారంగంలో చిన్నగా మొదలైన కెరీర్, తన ప్రతిభ కారణంగా అత్యున్నత స్థాయికి చేరుకుంది. తన రాతల్ని లోకమంతా చదువుతుంది. తన ఉపన్యాసాల్ని చెవులు రిక్కించుకుని వింటుంది. అలాంటి సమయంలో ఓ కుదుపు. ఓ అనూహ్యమైన వ్యాధి తనకు సోకిందని తేలింది. అప్పట్లో ఈ రుగ్మతకు సరైన చికిత్స లేదు సరికదా, దాన్ని ప్రాణాంతకంగా భావించేవారు. ‘నీ చివరి రోజుల్లో చక్కదిద్దుకోవాల్సిన పనులేమన్నా ఉంటే చూసుకో’మంటూ వైద్యులు అతనికి సూచించారు. ఏం చేయాలో పాలుపోలేదు. ఇక మరణానికి మనసును సిద్ధపరుచుకుంటున్న సమయంలో ఓ ఆలోచన వచ్చింది. బాధ, అనారోగ్యం కలిసి ఉన్నప్పుడు… సంతోషం, ఆరోగ్యం కూడా కలిసే ఉండాలి కదా! అనిపించింది. దాంతో ఓ ఉపాయాన్ని ఆలోచించాడు.
ఓ హోటల్ గదిని అద్దెకు తీసుకుని, ఓ ప్రొజెక్టర్ కొనుక్కుని… వరసబెట్టి కామెడీ సినిమాలు చూడటం, పోషకాహారం తీసుకోవడం చేశాడు. ఇదే తన దినచర్యగా సాగింది. ఫలితం అనూహ్యం. కొద్ది రోజుల్లోనే తను ఆరోగ్యవంతుడయ్యాడు. మరో పాతికేళ్లు హాయిగా బతికేశాడు. తను చావును ఎలా జయించాడో చెబుతూ ఓ పుస్తకం కూడా రాశాడు. ఆ వ్యక్తి పేరు నార్మన్ కజిన్స్. తను రాసిన పుస్తకం ‘అనాటమీ ఆఫ్ ఇల్నెస్’. ఈ సంఘటన జరిగి 60 ఏండ్లు అయింది. అప్పుడంటే నార్మన్ మాటల్ని ఎవరూ నమ్మలేదు. కానీ ఇప్పుడలా కాదు! నవ్వు క్యాన్సర్ని సైతం జయిస్తుందని, రోగనిరోధకశక్తిని మెరుగుపరుస్తుందనీ… నిండైన ఆరోగ్యంతో మెరుగైన ఆయుష్షును అందిస్తుందనీ తేల్చే పరిశోధనలు బోలెడు వచ్చాయి. హాస్య చతురత ఉన్నవారు ఏకంగా ఎనిమిదేళ్లు ఎక్కువ జీవిస్తారని ఓ నివేదిక తేల్చింది. స్మైల్ ప్లీజ్!
ఒకప్పుడు మనకు పంచదార అంటే ఏమిటో తెలియదు, సన్ ఫ్లవర్ ఆయిల్ ఉపయోగించలేదు, మైదా వాడేవాళ్లం కాదు. ఇప్పుడలా కాదు… ఈ మూడూ లేకుండా రోజు గడవదు. వీధికో బేకరీ, పూటకో చిరుతిండి. పైగా మన ఆహారం మీదే లేనిపోని అపోహలు. చెడు కొవ్వును తొలగించే నెయ్యినీ, ప్రొటీన్లను అందించే పప్పులనీ ద్వేషించే పరిస్థితి. ఏ ప్రాంతం వారైనా, అక్కడ దొరికే ఆహారం తీసుకోవాలనీ… అన్ని రకాల పండ్లు, కూరలను భోజనంలో భాగంగా మార్చుకోవాలనీ నిపుణుల సూచన.
సంప్రదాయబద్ధంగా మన ఆహారంలో భాగమైన చాలా పదార్థాలు కేవలం రుచి, రంగుకు మాత్రమే కాదు… ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నారు. కర్కుమిన్ అనే అద్భుత రసాయం వల్ల పసుపు ఆ రంగులో ఉంటుంది, రక్తపోటును అదుపు చేసే సల్ఫర్ వల్ల వెల్లుల్లికి ఆ వాసన అబ్బింది! ఇలా మన వంటింట్లోనే ఓ ఔషధశాల కనిపిస్తుంది. అల్లం నుంచి ఉసిరి వరకు మన పెద్దలు వాడిన ప్రతీ పదార్థంలో పరమార్థం ఉంది. వీటన్నింటినీ కాదని బ్రెడ్, పిజ్జాల పేరుతో మనం తినే మైదా పదార్థాల్లో ఉన్న పోషకాలు- సున్నా! ఇక నిర్ణయం మనదే!
మహిళల ఆరోగ్యం, పోషక అవసరాలు విభిన్నంగా ఉంటాయి. రుతుక్రమం, పిల్లల్ని కనడం లాంటి బాధ్యతలతో వారిలో హార్మోన్ల తీరు ఒడుదొడుకుల మధ్య ఉండవచ్చు. ఐరన్, క్యాల్షియం లాంటి పోషకాల అవసరం ఎక్కువ కావచ్చు. వీటితోపాటు మరికొన్ని ఆహారపదార్థాల్ని కూడా తీసుకోవాలని నిపుణుల సూచన. అవి పరిపూర్ణ ఆరోగ్యాన్నీ, ఆయుష్షునూ అందిస్తాయట.
మహిళలలో కాల్షియం లోటు ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఇది నేరుగా వారి ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. క్యాల్షియం అందించే ముఖ్యవనరు పాలు. విటమిన్ డి జోడించిన (ఫోర్టిఫైడ్) పాలు తీసుకుంటే మరింత మేలు.
వీటిలో ఉండే కోలిన్ రొమ్ము క్యాన్సర్ను నివారిస్తుందనీ… ల్యూటెన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయనీ చెబుతారు.
వీటిలో ఉండే పీచుపదార్థం కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. ప్రొటీన్ ఇన్హిబిటర్స్ రొమ్ము కేన్సర్ రానివ్వవు. రక్తపోటు, మధుమేహాన్ని అదుపుచేసే పోషకాలూ ఉన్నాయి.
ఇందులో ఉండే ఐరన్, రుతుస్రావం వల్ల కోల్పోయే రక్తాన్ని భర్తీ చేయడంలో సాయపడుతుంది. ఇందులోని ఫోలేట్, గర్భధారణ సమయంలో అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ అందిస్తుంది.ఇవేకాకుండా చేపలు, బాదం లాంటి పప్పులు, పెరుగు లాంటి దార్థాలు మహిళల ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.