new technology trends 2022 | జీవితాన్ని కొత్తగా ఆరంభించడంలో ఓ ఉత్సాహం ఉంది. ‘నిన్నటివరకూ ఓ లెక్క… అన్నది పాఠం మాత్రమే. రేపటి రోజును నాకు నచ్చినట్టుగా మార్చుకుంటాను’ అని నిశ్చయించుకోవడంలో ఓ నమ్మకం ఉంది. అందుకే, కొత్త సంవత్సరం వచ్చిందంటే మనకంత సంబురం. న్యూ ఇయర్.. మన దృష్టిలో ఓ కాల విభజన మాత్రమే కాదు. కొత్త ఆశలకు రెక్కలందించే పుష్పకవిమానం. అందులో ఎవరితోనైనా ప్రయాణించవచ్చు, ఎక్కడికైనా వెళ్లవచ్చు, ఏ లక్ష్యాన్నయినా సాధించవచ్చు. ఆ బలమైన నమ్మకంతోనే 2022కి స్వాగతం చెబుతున్నాం!
2020 వరకూ మన దృక్పథం వేరుగా ఉండేది. కానీ కొవిడ్ మన జీవితాలను మార్చేసింది. ఒక్కసారి ఆగి తరచి చూసుకునే ఎరుక పెరిగింది. డిగ్రీలకన్నా నైపుణ్యం మిన్న అనే విచక్షణ వచ్చింది. మాధ్యమాల తీరు మారింది. ఆ మాటకొస్తే అసలు బతుకే మారిపోయింది. కొవిడ్ సన్నగిల్లినా, దాంతోపాటే వచ్చిన కొన్ని మార్పులు మనతోనే ఉండబోతున్నాయి. వాటితోపాటు పెరుగుతున్న సాంకేతికత, పోటీతత్వం.. మరెన్నో కొత్త మార్గాలకు దారితీయనున్నాయి. ఇక నిత్య చలనశీలి అయిన మనిషి ఆలోచనల్లో మార్పులకు, వాటికి అనుగుణంగా ప్రాణంపోసుకునే ట్రెండ్స్కు కొదవేలేదు. అందుకే 2022లో మనకు స్పష్టంగా కనిపించబోయే కొన్ని తీరులు, బలపడే కొన్ని అలవాట్లను ఏర్చికూర్చి మీ చెంతకు చేరుస్తున్నాం. ఇవి సమగ్రం కాకపోవచ్చు. కానీ ఓ సూచనగా మాత్రం ఉపయోగపడతాయి. కాలమనే సంద్రపు తీరును గమనించడమూ, దాని అలలకు అనుగుణంగా ప్రయాణించడమూ సురక్షిత యాత్రలో ఓ భాగం.
లోకంలో ప్రతి లావాదేవీ డిజిటల్గా మారిపోతున్నది. అలాంటప్పుడు డబ్బు కూడా డిజిటల్ రూపంలోకి ఎందుకు మారకూడదు? అన్న ప్రశ్నకు జవాబే క్రిప్టో కరెన్సీ! నిన్నమొన్నటి వరకూ ఈ తరహా నగదు ఓ భ్రమ. సాంకేతికంగా పండిపోయినవారికి మాత్రమే అర్థమయ్యే బ్రహ్మపదార్థం. క్రమంగా క్రిప్టో గురించి చర్చలు ఎక్కువయ్యాయి. దాని మీద పెట్టుబడులూ పెరుగుతున్నాయి. మేం బిట్కాయిన్స్ కూడా అంగీకరిస్తాం అంటూ వ్యాపార సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఎలన్ మస్క్ లాంటి ప్రముఖులు క్రిప్టో కరెన్సీకి మంచి భవిష్యత్తు ఉందని కితాబు ఇవ్వడమే కాకుండా, భారీగా పెట్టుబడి పెడుతున్నారు. క్రిప్టో కరెన్సీ ఆవిర్భావమే ఓ రహస్యం. సతోషి నకమోటో అనే అజ్ఞాత వ్యక్తి ప్రచారంలోకి తెచ్చిన వ్యవస్థ ఇది. ఓ సంక్లిష్టమైన ప్రోగ్రామింగ్ ద్వారా డిజిటల్ రూపంలో ఉండే ఈ నగదును రూపొందిస్తారు. ఇలా చేయడానికి చాలా పరిజ్ఞానం, ఆధునిక సాంకేతికత అవసరమవుతాయి. ఈ ప్రక్రియలో తలమునకలైనవారిని ‘మైనర్స్’ అంటారు. ఇక వాళ్ల నుంచి బయటపడిన క్రిప్టోను ఎవరు కొంటారు, ఎన్ని చేతులు మారాయి అన్నది తెలియడానికి బ్లాక్చెయిన్ సాంకేతికత ఉపయోగపడుతుంది. మరొకరు వేలు పెట్టడానికి వీల్లేకుండా, ప్రతి లావాదేవీని కచ్చితంగా నమోదు చేసేదే బ్లాక్ చెయిన్! ఇదీ స్థూలంగా క్రిప్టో కరెన్సీ. వేగంగా పెరుగుతున్న క్రిప్టో ఆదరణ మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. భారత ప్రభుత్వం త్వరలోనే ఈ నగదుకు సంబంధించి చట్టాన్ని తీసుకురానుంది.
మూడు దశాబ్దాల నాటి సంగతి! కాలక్షేపానికి కేరాఫ్ అడ్రస్గా మొబైల్ ట్రాన్సిస్టర్ ఉండేది. దృశ్య మాధ్యమాలు పెరిగిపోయాక… వినడం తగ్గిపోయింది. మొబైల్, కంప్యూటర్, టీవీ, ట్యాబ్… సాధనం ఏదైతేనేం, చూపులకే పని పడుతున్నది. పెరిగిపోతున్న స్క్రీన్ టైమ్ వల్ల కలిగే అనర్థాలు అనుభవంలోకి వస్తున్నాయి. పని ఆపేసి చూడాలి, మరో విషయం మీద దృష్టి పెట్టడానికి వీల్లేదు, పూర్తి శక్తినంతా దానిమీదే కేంద్రీకరించాలి! కండ్లకూ, మనసుకూ అసలట కలిగించే దృశ్య మాధ్యమానికి బదులు… పాడ్కాస్టులకు ఆదరణ పెరుగుతున్నది. వింటూ వింటూనే.. వంట, డ్రైవింగ్ చేసుకోవచ్చు. స్థానిక భాషల్లో బ్రౌజింగ్ పెరగడం, డేటా చవకగా మారిపోవడం కూడా పాడ్కాస్టులకు ప్రాణం పోశాయి. సునో ఇండియా (హైదరాబాద్) లాంటి సంస్థలు కేవలం పాడ్కాస్టులనే రూపొందించేందుకు మొదలయ్యాయి. లాక్డౌన్ సమయంలో వీటికి మరింత ఆదరణ పెరిగింది. పూరీ జగన్నాథ్ నుంచి కరీనా కపూర్ వరకు తమ స్వరాలతో వీటి చరిష్మా పెంచారు. మొబైల్లో మంచి వాయిస్ రికార్డర్ ఉంటే చాలు… పైసా ఖర్చు లేకుండా పాడ్కాస్టు రూపొందించేయవచ్చు. ఆడియో నాణ్యత పెంచేందుకు Audacity లాంటి సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ప్రతి అంచెలోనూ అండగా నిలబడుతూ, పాడ్కాస్టును అప్లోడ్ చేయించే ‘యాంకర్’ లాంటి వెబ్సైట్లూ ఉన్నాయి. ఇక రాబోయే కాలం పాడ్కాస్టులదే!
2015లో జియో ఫోన్లను ప్రకటించడం ఎన్నో వివాదాలకు దారితీసింది. 4జి స్పెక్ట్రమ్లో హక్కులు ఉన్న ఐబీఎస్ఎల్ అనే సంస్థను కొనుగోలు చేసిన రిలయన్స్… ఆ సాంకేతికతను కొత్త తరహాలో ఉపయోగించుకోవడానికి సిద్ధపడింది. సాధారణ సేవలకు విభిన్నంగా, ఇంటర్నెట్ను ఉపయోగించే VoLTE పరిజ్ఞానంతో ఫోన్ చేసుకునే అవకాశం కల్పించింది. ఎప్పటిలాగే నామమాత్రపు ధరలకు ఫోన్లు, ఉచిత ఆఫర్లతో తన పట్టు బిగించింది. ఫలితంగా మిగతా సంస్థలు కుదేలైపోయాయి. ప్రస్తుతానికి 42 కోట్ల మంది వినియోగదారులతో, దేశంలోనే పెద్ద టెలికాం సంస్థగా ఆవిర్భవించింది జియో. ఇక ఇప్పుడు జియో ఫైబర్ వంతు! 2018లో మొదలైన ఈ ప్రణాళిక ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చింది. ఇందులో ట్రిపుల్ ప్లే సౌలభ్యమే కీలకం. ఇంటర్నెట్, కేబుల్ టీవి, ఫోన్… ఈ మూడింటినీ అందించేదే ట్రిపుల్ ప్లే! తనదైన మౌలిక సదుపాయాలతో ఎక్కువ వేగంతో, నిరంతరాయంగా సేవలు అందించే ప్రయత్నం మరో ఆకర్షణ. కాస్త ఎక్కువ ధరలకు ఒటీటీలను కూడా ఉచితంగా అందించడం మరో అస్త్రం. వెరసి, ఎప్పటిలాగే మార్కెట్ను ముట్టడించేందుకు సిద్ధంగా ఉంది. మహానగరాల్లో, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో జియో ఫైబర్ వేగంగా విస్తరిస్తున్నది. దీనికి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్, భారత్ ఫైబర్ వంటి సంస్థల నుంచి గట్టిపోటీనే ఉంది. వీటిలో ఎవరు విజేతగా నిలిచినా ఒకటి మాత్రం ఖాయంగా కనిపిస్తున్నది. మనం వచ్చే ఏడాది కేబుల్ టీవీ నుంచి ఫైబర్ టీవీ వైపు వేగంగా అడుగులు వేయబోతున్నాం!
తంజావూరుకు చెందిన జగదీశ్, ఎజిలరసి దంపతులు బ్యాంకులో పనిచేస్తారు. కానీ ఏ ఉద్యోగమూ ఆదుకోలేని ఆర్థిక కష్టం వారికి వచ్చింది. తమ బిడ్డ భారతికి ఓ అరుదైన వ్యాధి సోకింది. నయం కావాలంటే 16 కోట్ల రూపాయల విలువ చేసే ఇంజక్షన్లు ఇవ్వాలి. అంత సొమ్ము ఎవరిని అడుగుతారు? ఎక్కడినుంచి తెస్తారు? ఇలాంటి సమయంలో క్రౌడ్ ఫండింగ్ వారిని ఆదుకుంది. ఒక మనిషికి అసాధ్యంగా తోచే కష్టం… పది మందీ చేతులు కలిపితే తేలికైపోతుంది.. అన్న సిద్ధాంతం మీద ఆధారపడిన క్రౌడ్ ఫండింగ్ మార్గం మరీ కొత్తేమీ కాదు. ధార్మిక కార్యక్రమాల కోసం, ఊరుమ్మడి వేడుకల కోసం, పుస్తకాల ప్రచురణ కోసం విరాళాలు సేకరించడం చూస్తూనే ఉన్నాం. కాకపోతే వ్యూహాలు మారాయి. సినిమా తీయడం దగ్గరనుంచీ, వ్యాపారం మొదలుపెట్టడం వరకూ క్రౌడ్ ఫండింగ్ను ఉపయోగించుకుంటున్నారు. దీన్ని మరింత సులభంగా మార్చేందుకు విస్తృతంగా యాప్స్ వచ్చాయి. మిలాప్, కెట్టో, ఇంపాక్ట్ గురు, టాల్ గివింగ్ లాంటి సంస్థలు… దాతలకు, కష్టంలో ఉన్నవారికి మధ్య వారధిగా నిలిచే ప్రయత్నం చేస్తున్నాయి. వీటిలో కొన్ని పూర్తి స్వచ్ఛందంగా నడిస్తే, మరికొన్ని నామమాత్రపు రుసుము వసూలు చేస్తున్నాయి. కొవిడ్ సమయంలో వేగం పుంజుకున్న క్రౌడ్ ఫండింగ్ సేవలు ఈ ఏడాది మరింత ప్రజాదరణ పొందబోతున్నాయి.
కొవిడ్ వల్ల అనేక కష్టనష్టాలు భరించాం. ఆ సవాళ్లను దాటుకునేందుకు కొన్ని మార్గాలనూ నిర్మించుకున్నాం. వాటిలో ఒకటి ఆన్లైన్ ఆరోగ్య సేవలు. ఇది కేవలం వైద్యుల వరకే పరిమితమైన వ్యవస్థ కాదు. ఆరోగ్యసేతు లాంటి యాప్స్ ప్రజారోగ్యానికి చాలా ఉపయోగపడ్డాయి. ‘ఆరోగ్యసేతు’ అనేది.. ఒకవైపు కొవిడ్ లక్షణాలు తెలియచేయడానికి, టీకా కోసం పేరు నమోదు చేసుకోవడానికి ప్రజలకు ఉపయోగపడితే… కొవిడ్ హాట్స్పాట్స్ గుర్తించడానికి, ఆరోగ్య సమాచారం అందించడానికి ప్రభుత్వానికి సాయపడింది. ఈ తరహా యాప్స్తోనే నైజీరియా, రువాండా, శ్రీలంక వంటి చిన్నచిన్న దేశాలు కూడా కొవిడ్ను సమర్థంగా ఎదుర్కొన్నాయి. క్రమంగా ఆన్లైన్ ఆరోగ్య సేవలు అందరికీ అలవాటైపోయాయి. గంటల తరబడి వేచి చూడాల్సిన పన్లేదు. రానూపోనూ శ్రమ తప్పుతుంది. భౌతిక దూరం లాంటి జాగ్రత్తలు పాటించవచ్చు! ఆన్లైన్ ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు చాలా పరికరాలను రూపొందిస్తున్నారు. గుండె వేగాన్ని తెలుసుకోవడం దగ్గరనుంచీ అవసరమైనప్పుడు చర్మంలోకి మందును పంపే ప్యాచెస్ వరకూ… సాంకేతికత ఎదుగుతోంది. ఉదాహరణకు అబాట్ కంపెనీ ‘ఫ్రీ ైస్టెల్’ సెన్సార్ను చేతికి జోడించుకుంటే చాలు, ఒంట్లో చక్కెర పరిమాణం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ముందుముందు వైద్యులు కూడా ఆగ్మెంటెడ్ రియాలిటీ లాంటి పరికరాలతో రోగిని దూరం నుంచే పరిశీలించే అవకాశాలు పెరుగుతున్నాయి.
ఆటలంటే మనకు ఇష్టం. ఆటల్లో గెలుపు ఓ కిక్ ఇస్తుంది. తద్వారా వచ్చే ప్రతిఫలం, ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఇదే ఆటకు బలం. ఈ తత్వాన్ని మిగతా రంగాలకు అన్వయించడమే గేమిఫికేషన్! క్రెడిట్ కార్డులకు అందే రివార్డు పాయింట్ల మతలబు ఇదే! మీరు ఎంత ఖర్చుపెడితే, అన్ని బహుమతులు ఇస్తాం.. అనే మాట ఓ మోస్తరు పరిహాసంగా తోచవచ్చు. కానీ గేమిఫికేషన్ కూడా ఇలాగే పనిచేస్తుంది. ఇప్పుడు దీన్ని అన్నింటికీ వర్తింపచేస్తున్నారు. యాప్స్ రూపొందించడంలో ఇప్పుడు గేమిఫికేషన్ ఓ ముఖ్యభాగం. కార్డులు, రివార్డులు, మెడల్స్, పాయింట్స్… పేరు ఏదైనా గేమిఫికేషన్లో భాగమే. ఒక్కసారి ఆట మొదలుపెట్టామంటే ఓడిపోబుద్ధి కాదు. మధ్యలో విరమిస్తే, దారుణమైన నష్టం జరుగుతుందనే భావన కలిగిస్తారు. ఇక్కడ అసలైన ఆట మన మనస్తత్వంతోనే! ఇప్పుడు ఉద్యోగుల మధ్య పోటీతత్వాన్ని పెంచేందుకు కూడా కార్పొరేట్ యాజమాన్యాలు గేమిఫికేషన్ను నమ్ముకుంటున్నాయి. సోషల్ మీడియాలోనూ గేమిఫికేషన్ పెరుగుతున్నది. అనుచరుల సంఖ్యను బట్టి హోదాలు కల్పించడం, బిరుదులు ఇవ్వడం కనిపిస్తున్నది. ఇక ఇప్పుడు గేమిఫికేషన్ వ్యక్తిత్వ వికాస రంగంలోకి కూడా అడుగుపెట్టబోవడమే రాబోయే ట్రెండ్. మన బలహీనతలు తుంచేందుకు, బలాలు పెంచేందుకు, లక్ష్యాలు సాధించేందుకు… ఆఖరికి అంట్లు కూడా సంతోషంగా కడిగేందుకు గేమిఫికేషన్ సూత్రాలు బోధించే నిపుణులు రాబోతున్నారు!
జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు విలాసంగా భావించిన కారు ఇప్పుడు సౌకర్యం కిందికి మారిపోయింది. కొవిడ్ తర్వాత వ్యక్తిగత వాహనాలకు కూడా గిరాకీ పెరిగింది. కానీ ఇప్పటికీ కారు కొనడం అంటే ఓ ప్రహసనం. మనసుకు ఏ కారు నచ్చుతుందో నిర్ణయించుకోవాలి. తీరా తీసుకున్నాక ఏమాత్రం తేడా వచ్చినా బాధపడాలి. అంతేనా! కారు కోసం అప్పు చేస్తే, అదో అదనపు బాధ్యత. ఇక బీమాలాంటి ఖర్చులు, ఎప్పటికప్పుడు సర్వీసింగ్. ఎలాగూ ఉంటాయి. వీటన్నింటి నుంచి తప్పించుకునే ఉపాయమే కార్ సబ్స్క్రిప్షన్. మీకు నచ్చిన మోడల్ ఎంచుకోవచ్చు. నెలకు/ సంవత్సరానికి ఇంత అంటూ రుసుము చెల్లించి ఉపయోగించుకోవచ్చు. నచ్చితే మార్కెట్ రేటు చెల్లించి పూర్తిగా సొంతం చేసుకోవచ్చు. మోజు తీరాక మరో మోడల్ను ఎంచుకోవచ్చు. ఉద్యోగరీత్యా తరచూ ఊళ్లు మారేవారికి, ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వాడాలనుకునేవారికి, తక్కువ ఖర్చుతో విలాసవంతమైన కారు నడపాలనుకునేవారికి… కార్ సబ్స్క్రిప్షన్ ఓ వరమే! అందుకే ఓ పదేండ్ల క్రితం మొదలైన ఈ వెసులుబాటుకు మంచి ఆదరణ లభిస్తున్నది. క్విక్లీ కార్, జూమ్ కార్ లాంటి సంస్థలు కార్లను కొనుగోలు చేసి ఈ సౌకర్యం అందిస్తున్నాయి. ఇప్పుడు నేరుగా కారు తయారీ సంస్థలే తమ వాహనాలకు ఈ సౌలభ్యాన్ని అందించడం విశేషం. మారుతి, హ్యుండయ్… తమ వాహనాలను సబ్స్ర్కైబ్ చేసుకోమని ఊరిస్తున్నాయి.
ఆన్లైన్ యాప్స్ ద్వారా కొనుగోళ్లు మనకు అలవాటైపోయాయి. పైగా ఇవి ప్రతి రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. పుస్తకాలతో మొదలైన అమెజాన్, ఇప్పుడు అమ్మని వస్తువంటూ లేదు. ఆహారాన్ని అందించే స్విగ్గీ సరుకులను కూడా సరఫరా చేస్తున్నది. ఈ భారీ సంస్థలకు దీటుగా నిలబడాలంటే మిగతా వ్యాపారస్తులు ఆన్లైన్ సాంకేతికతను ఉపయోగించుకోవాల్సిందే! అందుకోసం ఇప్పుడు షాపింగ్మాల్స్ కూడా వెబ్సైట్లను నిర్వహించడం మొదలుపెట్టాయి. ప్రత్యేకమైన యాప్స్ అందిస్తున్నాయి. రాయితీలకు సంబంధించిన సందేశాలను పంపిస్తున్నాయి. సొంతంగా వెబ్సైట్లనూ నిర్వహిస్తున్నాయి. ఇది ఆరంభం మాత్రమే! స్టోర్లోకి అడుగుపెట్టిన వెంటనే ‘ఇవాళ ఫలానా వస్తువు మీద ఆఫర్ ఉంది తీసుకోండి’ అని ఊరించే నోటిఫికేషన్స్, అక్కడ ఉండే స్క్రీన్ మీద నచ్చిన వస్తువులను ఆర్డర్ చేసుకునే సౌలభ్యం, మన అభిరుచులను బట్టి బట్టల్లాంటివి ముందుగానే ఆర్డర్ చేసే వెసులుబాటు… లాంటి ఆకర్షణలు మొదలయ్యాయి. కొవిడ్ సమయంలో దిగ్గజ సంస్థలన్నీ మొహం చాటేసిన వేళ, సందు చివర ఉన్న కొట్లే మనని ఆదుకున్నాయి. అవి మన జీవితాల్లో భాగం అనే బంధమూ ఉంది. అవి కనుక సాంకేతికతను అందిపుచ్చుకోవడం మొదలుపెడితే… ఇక తిరుగులేనట్టే!
ఇంటి బయట ఏదో అలికిడి అవుతున్నది. బయట ఉన్న కెమెరా అటువైపు తిరిగింది, వెంటనే యజమానికి ఉప్పందించింది. బయట మబ్బులు కమ్ముకుని వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. దాన్ని గమనించుకుని ఫ్యాన్ వేగం తగ్గిపోయింది. ఒకప్పుడు ఇదంతా మాయల మరాఠీ తంతులా కనిపించేంది. కానీ స్మార్ట్ హోమ్ వస్తువులు ఇప్పుడు జీవితానికి చేరువగా, జీవనశైలిలో భాగంగా మారిపోయాయి. ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు! అందులో అలెక్సా, సిరి, గూగుల్ అసిస్టెంట్ లాంటి యాప్స్ డౌన్లోడ్ చేసి ఉంటే చాలు. వాటికి అనుగుణంగా నాట్యమాడే ఉత్పత్తులు ఇప్పుడు అందుబాటు ధరలోనే దొరుకుతున్నాయి. 2022 నాటికి మనదేశంలో స్మార్ట్ హోమ్ మార్కెట్ ఆరువేల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా! ఇప్పటికే స్మార్ట్ లైట్స్ రంగంలో దూసుకువెళ్తున్న విప్రో.. వచ్చే ఏడాది నాటికి తన బల్బుల వ్యాపారంలో 15 శాతం స్మార్ట్ వెలుగుల నుంచే రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలెక్సా ఇప్పటికే గతంతో పోలిస్తే అయిదు రెట్ల ‘స్మార్ట్’ అభివృద్ధిని సాధించింది. గూగుల్ మూడువేలకు పైగా స్మార్ట్ బ్రాండ్స్తో పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నది. రియల్మీ సంస్థ కూడా స్మార్ట్ విభాగంలో డోర్ బెల్ నుంచి కళ్లద్దాల వరకూ ఈ ఏడాదిని ఎన్నో ఉత్పత్తులతో ముంచెత్తనుంది. ఇక ఏసీ లాంటి ఉత్పత్తుల లేటెస్ట్ మోడల్స్ అన్నీ కూడా అలెక్సా లాంటి యాప్స్కు అనుగుణంగా ఉంటున్నాయి. కాస్త ధర చెల్లిస్తే చాలు అలెక్సా/గూగుల్ హోమ్తో పనిచేసే ట్యూబ్లైట్లు కూడా దొరుకుతున్నాయి. మొత్తానికి 2022 స్మార్ట్ సంవత్సరంగా మారనుంది!
ఒకప్పుడు ఇల్లు అంటే.. నాలుగు గోడలు, ఓ పైకప్పు అన్నట్టే ఉండేది. సౌకర్యంగా, విశాలంగా ఉంటే చాలనుకునేవారు. కాలం మారుతున్నది. చిన్నదైనా పెద్దదైనా ఇప్పుడు ఇంట్లో ప్రతి గదినీ, ప్రతి గోడనీ జాగ్రత్తగా ఎంచుకుంటున్నారు. భవన నిర్మాణ ముడిసరుకులోనూ మార్పులు వచ్చేశాయి. ఫైబర్, అల్యూమినియం శాతం పెరిగిపోతున్నది. ఇంట్లో ఒక్క గదికైనా చెక్క ఫ్లోరింగ్ చేయించుకోవడం ఇప్పటి ట్రెండ్. ఇక భవన నిర్మాణంలో రాబోయే సాంకేతికత గురించీ చెప్పుకోవాలి! ఒకప్పుడు ఇంటి ప్రణాళికను కాగితం, కలంతో లాగించేసేవారు. తర్వాత త్రీడీ మోడలింగ్ను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడిక Building Information Modeling (BIM) వంతు. ఇది ఇంటి రూపును మాత్రమే నిర్ధారించదు. అందులో విద్యుత్ పరికరాలు ఎక్కడ ఉండాలి, నీటి సౌలభ్యం ఎలా ఉండాలి, ఫ్లోరింగ్ ఎలా జరగాలి, కప్బోర్డ్స్ రూపు ఎలా ఉండాలి… ఇలా ఒక ఇంటికి సంబంధించిన ప్రతి అంశాన్నీ పరిగణనలోకి తీసుకుంటుంది. బిల్డర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, చెక్కపనివారు… ఇలా ప్రతి ఒక్కరూ ఆ BIMలో భాగం పంచుకుంటారు. వినియోగదారుని అవసరాల మేరకు మార్పులు చేస్తారు. దీనికోసం ఆటోడెస్క్ లాంటి సంస్థలు శిక్షణ ఇస్తున్నాయి. మున్ముందు BIM రంగంలో పుష్కలమైన ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి. ఇక భవన నిర్మాణంలో జీపీఎస్, డ్రోన్లను వినియోగించడమూ రాబోయే ట్రెండే!
ఇప్పుడిప్పుడే వస్తున్న మార్పు ఇది. ఏదైనా కస్టమర్ కేర్ను సంప్రదించడానికి ప్రయత్నిస్తే… ‘మీకు ఏ విధంగా సాయపడగలను’ అంటూ అటువైపు నుంచి ముచ్చట మొదలవుతుంది. మన ఎంపికల ఆధారంగా తగిన సూచనలు ఇవ్వడమో, ఫిర్యాదు నమోదు చేసుకోవడమో చేస్తుంది. మొదట్లో వీటి సామర్థ్యం పట్ల సందేహపడిన జనం, క్రమంగా అలవాటుపడుతున్నారు. ఓ నివేదిక ప్రకారం 69 శాతం వినియోగదారులు, చాట్ బోట్ల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని తేలింది. కృత్రిమ మేధ ఆధారంగా నడిచే ఈ ‘చాట్ బోట్ల’ సాంకేతికత రానురాను మెరుగుకానుంది. ఓ అంచనా ప్రకారం రాబోయే రెండేండ్లలో 47 శాతం సంస్థలు తమ కస్టమర్ కేర్ విభాగంలో చాట్ బోట్లను సిద్ధం చేసుకోనున్నాయి. ఇదేమీ విశేషం కాకపోవచ్చు. ఎందుకంటే ధర చెల్లిస్తే ఈ సాంకేతికత రూపొందించి అందించే సాఫ్ట్వేర్ సంస్థలకు కొదవ లేదు. సత్వర స్పందన వచ్చినప్పుడే వినియోగదారులు తృప్తిపడతారు కాబట్టి, సంస్థలూ ముందుకు రావచ్చు. కాకపోతే చాట్ బోట్లు రాటుదేలుతున్నాయి. వినియోగదారుని భాషను బట్టి… అతని భావాన్నీ, ఉద్వేగాలనూ గమనించేందుకు సిద్ధపడుతున్నాయి. క్రమంగా మనతో మాట్లాడే ‘వాయిస్ బోట్స్’ కూడా రానున్నాయి. ఒక యంత్రం మనిషితో సమానమైన విచక్షణతో జవాబు ఇవ్వగలదా లేదా అని నిర్ధారించే పరీక్షను ట్యూరింగ్ టెస్ట్ అంటారు. 2022 నాటికి ఈ ట్యూరింగ్ టెస్ట్ దాటే చాట్ బోట్లు రానున్నాయని ఆశిస్తున్నారు.
ఇంధనం ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పర్యావరణ స్పృహ కూడా పెరుగుతున్నది. కాబట్టి ఖర్చుతోపాటు కాలుష్యాన్నీ అందించే వాహనాలకు బదులు బ్యాటరీలతో నడిచే విద్యుత్ వాహనాలను కొనాలనుకోవడం ఆశ్చర్యం కాదు. కానీ నిన్నమొన్నటి వరకూ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. విద్యుత్ వాహనాల్లో 25 నుంచి 40 శాతం ఖర్చు బ్యాటరీదే అని ఓ లెక్క. లిథియం అయాన్ బ్యాటరీలు చాలా ఖరీదు. పైగా విద్యుత్ వాహనాలకు సంబంధించి ప్రభుత్వ విధానాలూ అస్పష్టం. అందుకనే మనదేశంలో ప్రతి 125 వాహనాలకు ఒక్క విద్యుత్ వాహనమే కనిపిస్తున్నదట. వాటిలోనూ ద్విచక్ర వాహనాలదే హవా. 2022 నాటికి ఈ పరిస్థితి మారనుందని చెబుతున్నారు. లిథియం ధరలు తగ్గడంతో ఇంధన వాహనాల ఖరీదుకే కాస్త అటూఇటూగా రానున్నాయి. మహీంద్ర, టాటా, హ్యుందయ్, కియా, బెంజ్ అన్నీ కూడా బ్యాటరీ కార్లు తీసుకువస్తున్నాయి. ఇక ద్విచక్ర వాహన రంగంలో ఓలా హవా స్పష్టంగా కనిపిస్తున్నది. 2021 సెప్టెంబరులో ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ప్రీ బుకింగ్స్ మొదలుపెట్టిన ఓలా… మొదటి రెండు రోజుల్లోనే 1,100 కోట్ల వ్యాపారం చేసిందని చెబుతున్నారు. బౌన్స్ అనే సంస్థ అయితే, బ్యాటరీ ఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా… ఎక్కడికక్కడ వారి ఔట్లెట్స్ దగ్గర బ్యాటరీలను మార్చే సౌలభ్యం కల్పిస్తున్నది. ‘రీసెర్చ్ అండ్ మార్కెట్స్’ సంస్థ అంచనా ప్రకారం 2030 నాటికి మనదేశంలో విద్యుత్ వాహనాల పరిధి పదిలక్షల కోట్ల రూపాయలకు పైమాటే. అందుకు అనుగుణమైన మార్పు కనిపిస్తున్నది మరి!
డిగ్రీ ఉంటే చాలు ఉపాధి వచ్చేస్తుందనే రోజులు ఎప్పుడో పోయాయి. ఉన్నతవిద్య, రకరకాల ప్రవేశ పరీక్షలు, కఠినమైన ఇంటర్వ్యూలు… వీటన్నిటినీ దాటి ఉద్యోగం గెలుచుకోవాల్సిన రోజులు వచ్చాయి. కాకపోతే, ఒకసారి ఉద్యోగంలో చేరాక కాస్త భద్రత, మరికాస్త భరోసా ఉండేది. ఇప్పుడు ఆ కాలమూ దాటేయబోతున్నాం. కెరీర్ సోపానంలో చకచకా నిచ్చెనలు ఎక్కాలంటే మన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం వచ్చేసింది. మార్కెట్కు అనుగుణంగా మనం ఎదగకపోతే ఇక కష్టమే! దీన్నే ‘అప్స్కిల్లింగ్’ అంటున్నారు. ఇక ఒకటికి నాలుగు విద్యలు నేర్చుకోవడంలో లాభాలూ తెలిసి వస్తున్నాయి. దీన్ని ‘రీస్కిల్లింగ్’ అంటారు. ఆ మధ్య చేసిన ఒక సర్వేలో 82 శాతం మంది నైపుణ్యాల పెరుగుదల లాభమే అని ఒప్పుకొన్నారు. అంతేకాదు! రాబోయేరోజుల్లో యాంత్రీకరణ (ఆటోమేషన్) కారణంగా ఎనిమిది కోట్లకు పైగా ఉద్యోగాలలో కోత పడుతుందని సాక్షాత్తు ప్రపంచ ఆర్థిక సమాఖ్య అంచనా వేసింది. కాబట్టి నైపుణ్యపు ఎదుగుదల ఓ తక్షణ కర్తవ్యం. సాఫ్ట్వేర్ నిపుణులు సైతం ఎథికల్ హ్యాకింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులు చేస్తున్నారు. అప్గ్రాడ్, కోర్స్ఎలా, ఉడాసిటీ లాంటి సంస్థలు అప్స్కిల్లింగ్కు తగిన కోర్సులు అందిస్తున్నాయి. లింక్డ్ఇన్, గూగుల్ లాంటి సంస్థలు కూడా సర్టిఫికేషన్ కోర్సులు నిర్వహిస్తున్నాయి. ఆ మాటకు వస్తే అసలు కంపెనీలే తమ ఉద్యోగుల నైపుణ్యాల మెరుగుదలకు శిక్షణ ఇస్తున్నాయి.
మనమ్ దీక్షిత్, ఆరిఫ్ మంజి.. ఇద్దరిదీ మధ్యప్రదేశ్లోని ఓ చిన్న ఊరు. ఇద్దరూ వ్యాపారస్తులే! డిజిటల్ లావాదేవీల గురించి అవగాహన ఉన్నవారే! అదే సమయంలో, గ్రామీణ ప్రాంతాలలో నెట్, స్మార్ట్ ఫోన్ సౌలభ్యం ఉండవనీ తెలుసు. ఈ రెండిటినీ సమన్వయం చేస్తూ వాళ్లు FidyPay అనే యాప్ రూపొందించారు. ఆన్లైన్, ఆఫ్లైన్.. రెండు మార్గాలలోనూ లావాదేవీలు జరిపే విధంగా ఈ యాప్ ఉంటుంది. ఎస్ఎమ్ఎస్ లింకులు, చిన్నపాటి ఏటిఎమ్ లాంటి సదుపాయాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. ఒకే ఒక్క ఏడాదిలో ఈ యాప్ వినియోగం 14 రెట్లు పెరిగింది. ఆర్థికరంగానికి సాంకేతికతను జోడిస్తూ వినూత్నమైన ఆలోచనలు చేయవచ్చనీ, వాటికి విజయం తథ్యమని చెప్పుకొనేందుకు ఇది ఓ ఉదాహరణ మాత్రమే! ఈ తరహా వ్యాపారాన్ని ఫిన్టెక్ అంటున్నారు (ఫైనాన్స్+టెక్నాలజీ). నిజానికి కొన్నేండ్ల నుంచి ఈ ఫిన్టెక్ సేవలు మనకు అందుబాటులో ఉన్నాయి. పేటీఎమ్, పాలసీ బజార్ లాంటి యాప్స్ మనం వాడుతూనే ఉన్నాం. కానీ ఈ తీరు మరింత విస్తరించడమే రాబోయే ట్రెండ్. ఇంటి రుణాలు, షేర్ మార్కెట్ పెట్టుబడులు, విద్య, బీమా, ఆస్తుల కొనుగోలు… అన్నింటా ఈ ఫిన్టెక్ చొచ్చుకువస్తున్నది. శ్రమ, సమయం, నిబంధనలు అన్నీ తక్కువే కాబట్టి వీటివైపు మొగ్గు పెరుగుతున్నది. 2025 నాటికి మనదేశంలో ఫిన్టెక్ వ్యాపారం విలువ 12 లక్షల కోట్లుగా ఫిక్కీ అంచనా వేయడంతోనే తెలుస్తున్నది… ఈ ట్రెండ్ వేగంగా విస్తరిస్తున్న సంగతి!
‘పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య’ అనే వార్త గుండెను కలచివేసేదే. బంగారంలాంటి కంపెనీ, కలల జీతం… అన్నిటినీ వదిలిపెట్టి, అంతకంటే ముఖ్యమైన కుటుంబాన్ని కలతపెట్టి ఓ మనిషి శాశ్వతంగా వెళ్లిపోవడం బాధ కలిగించేదే! కానీ వెలుగులోకి రాని వార్తలు ఇంకెన్నో! గుండెపోటు లాంటి సమస్యలతో చేజారే జీవితాలెన్నో. ఒకవేళ ఆందోళననీ, దాంతోపాటు వచ్చే అనారోగ్యాన్నీ తట్టుకున్నా… జీవచ్ఛవంలా బతుకుతున్న ఉద్యోగులెందరో! అదే నిరూపిస్తున్నాయి గణాంకాలు. ఈమధ్యే లింక్డ్ఇన్ నిర్వహించిన ఓ సర్వేలో 55 శాతం మంది తాము ఉద్యోగం వల్ల తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నామని చెప్పారు. వారిలో ఒత్తిడి కలగడానికి ముఖ్యమైన కారణం ‘వ్యక్తిగత జీవితాన్ని కూడా పని మింగేయడమే’ అని తేలింది. సర్వేలో పాల్గొన్న చాలామంది… తాము కాస్త విశ్రాంతి తీసుకునేందుకు కొన్నాళ్లు సెలవు పెట్టాలనుకున్నా కుదరలేదని వాపోయారు. తమ ఒత్తిడిని తగ్గించేందుకు యాజమాన్యం ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నది అధికశాతం అభిప్రాయం. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఓ అంతర్జాతీయ నివేదిక గత రెండేళ్ల నుంచి ఒత్తిడి పెరుగుతూ వస్తున్నదనీ… ప్రస్తుతం 84 శాతం మంది ఉద్యోగస్తులు ఏదో ఒక కారణంతో పని ఒత్తిడికి గురవుతున్నారనీ తేల్చింది. రాబోయే రోజుల్లో యాజమాన్యాలు ఈ ఒత్తిడి మీద దృష్టి పెట్టనున్నాయి. పనివేళల పట్ల కాస్త సానుకూలంగా ఉండటం, కౌన్సెలింగ్ అందుబాటులో ఉంచడం, తరచూ వారితో సంభాషించే ప్రయత్నం చేయడం, కాలక్షేపానికి అవకాశం ఇవ్వడం లాంటి చర్యలను ఇక మీదట చూడబోతున్నాం!
2020-21 ఆర్థిక సంవత్సరంలో, మనదేశంలో 10,00,00,000 రూపాయలకు పైగా లావాదేవీలు డిజిటల్ రూపంలో జరిగాయని స్టాటిస్టికా సంస్థ చెబుతున్నది. ఆర్థిక లావాదేవీలు తేలికవుతున్న కొద్దీ, మోసాలు కూడా కొత్తపుంతలు తొక్కుతున్నాయి. ఈమధ్యకాలంలో మనదేశంలో ఆర్థిక మోసాల సంఖ్య 89 శాతం పెరిగిపోయింది. ఒక చిన్న లింక్ క్లిక్ చేసినా, ఓ నెంబరు పంచుకున్నా… ఆఖరికి ఓ వీడియో తెరిచినా కూడా డబ్బులు గల్లంతయ్యే పరిస్థితులు వచ్చేశాయి. వ్యక్తిగత కంప్యూటర్లలోకి చొరబడుతున్న నేరగాళ్లు… అటు డేటానూ ఇటు ఆర్థిక పునాదులనూ కూడా కదిలించేస్తున్నారు. ఎంతో అవగాహన ఉన్నవారు కూడా బోల్తా పడుతున్నారు. కాబట్టి, సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన తక్కువున్న వారి గురించి చెప్పనవసరం లేదు. ఇక మీదట కృత్రిమ మేధను (AI) ఉపయోగించి మరీ ఈ మోసాలకు పాల్పడతారనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘సైబర్ సెక్యూరిటీ’ సేవలకు గిరాకీ పెరిగిపోతున్నది. ఇప్పటికే విసెక్యూర్, విజంగిల్, ఇ-స్కాన్, క్విక్హీల్ లాంటి ఎన్నో సంస్థలు ఈ రంగంలో సాయపడుతున్నాయి. కానీ చిన్నపాటి సంస్థలు, వ్యక్తుల ఆదరణ నోచుకున్న యాప్స్ ఏవీ లేవు. ఇప్పుడు భారత ప్రభుత్వం (I-CAMPS ప్రాజెక్టు), సహా అనేక స్టార్టప్ సంస్థలు సామాన్య ప్రజలకు సాయపడేలా సైబర్ రక్షణకు సంబంధించిన యాప్స్, సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నాయి.
2020 మార్చి నుంచీ కొవిడ్ మన జీవితాల్లో భాగమైపోయింది. కొవిడ్ను ఎదుర్కోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనే సూచనలు వినిపించాయి. కానీ, విటమిన్ టాబ్లెట్లు ఎడాపెడా వాడితే దుష్ఫలితాలు తప్పవు. అందుకనే సహజమైన ఇమ్యూనిటీ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ఓ నివేదిక ప్రకారం 75 శాతం మంది కొవిడ్ తర్వాత, తమ ఆహారంలో ఏదో ఒక మార్పు చేసుకున్నారట. అల్లం, పసుపు, వీట్గ్రాస్, నిమ్మ, యాపిల్ సిడార్ వెనిగర్… లాంటివాటి వాడకం పెరిగిపోయింది. ఇక గ్రీన్ టీ లాంటి అలవాట్ల గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే! రోగనిరోధక శక్తికి ఉపయోగపడే బి6, సి, ఇ, డి విటమిన్లు… మెగ్నీషియం, సెలీనియం, జింక్ లాంటి ఖనిజాల కోసం వేట మొదలైంది. ఓ అధ్యయనం ప్రకారం 50 శాతానికి పైగా వినియోగదారులు ఆహార పదార్థాల ప్యాకెట్ల మీద ఉన్న పోషకాల విలువలను ఆసక్తిగా గమనిస్తున్నారట. పాశ్చాత్య దేశాల్లోనూ పసుపు వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అక్కడ పసుపు పదార్థాల వాడకం 179 శాతం పెరిగినట్టు నీల్సన్ అనే సంస్థ వెల్లడించింది. ఇక జీర్ణవ్యవస్థకూ, రోగనిరోధకశక్తికీ మధ్య సంబంధాన్ని కూడా జనం గ్రహిస్తున్నారు. అలానే జీర్ణవ్యవస్థకు మేలు చేసే యోగర్ట్, పెరుగు లాంటి ప్రోబయాటిక్స్కు గిరాకీ పెరిగిందనీ… 2025 నాటికి వీటి మార్కెట్ లక్ష కోట్ల రూపాయలు దాటేస్తుందని ఓ అంచనా!
దృశ్య మాధ్యమాలు పెరుగుతున్నాయి కానీ, వాటిని ఎక్కువ సేపు చూసే ఓపిక తగ్గిపోతున్నది. అందుకే టిక్ టాక్ ఓ ప్రభంజనంలా నిలిచింది. ‘టిక్ టాక్ను వీక్షించేవారు చాలామందే ఉండేవారు. కానీ వీడియోలు రూపొందించేవారు మాత్రం తక్కువ. అందుకనే టిక్ టాక్లో చవకబారు వీడియోలే ఎక్కువగా వచ్చాయి’ అంటారు నాస్ డైలీ వ్యవస్థాపకులు నుసిర్. చైనాతో గొడవ పుణ్యమా అని ఇప్పుడు ఆ టిక్ టాక్ కూడా నిషేధానికి గురైంది. భారత్ సహా చాలా దేశాల్లో, చిన్న వీడియోలకు ఉన్న ఆకర్షణను ఉపయోగించుకునేందుకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పోటీ పడుతున్నాయి. స్టాటిస్టికా ప్రకారం మన దేశంలోనే 35 కోట్ల మంది ఫేస్బుక్ వాడకందారులు ఉన్నారు. వీరిని ఆకట్టుకునేందుకు రీల్స్ పేరుతో తక్కువ వ్యవధి వీడియోలు రూపొందించే అవకాశం ఇస్తున్నది. ఇక యూట్యూబ్ సంగతి చెప్పనవసరం లేదు. షార్ట్స్ పేరుతో ఒక్క నిమిషం నిడివి గల వీడియోలు అప్లోడ్ చేసే అవకాశం అందిస్తున్నది. వీటికి రోజూ 1,500 కోట్ల వీక్షణలు ఉన్నట్టు అంచనా! ఈ ఏడాది యూట్యూబ్ తన షార్ట్స్ను మరింత విస్తరించే ఆలోచనలో ఉంది. ఇందుకోసం 10 కోట్ల డాలర్లను కేటాయించింది కూడా! భారత్ సహా 70 దేశాల్లో యూట్యూబ్ షార్ట్స్ విభాగంలో మంచి ఆదరణ కలిగిన వీడియోలు రూపొందించినవారికి ఈ నిధి నుంచి నజరానా అందుతుంది.
ఒకప్పుడు వాచీ అంటే హెచ్ఎమ్టీ లాంటి బ్రాండ్లే. ప్రపంచీకరణ తర్వాత రకరకాల చేతి గడియారాలు పరిచయం అయ్యాయి. నిజానికి ఈ మార్కెట్ ఊహించనంత పెద్దది. పదివేల కోట్ల రూపాయల పైనే విలువ కలిగింది. ఇందులో ఇప్పుడో అనూహ్యమైన పరిణామం మొదలైంది. కేవలం సమయమే కాకుండా… ఉష్ణోగ్రత, గుండెవేగం, నడక, నిద్ర లాంటి ఎన్నో వివరాలు అందిస్తాయి. దీనికోసం పీపీజీ సెన్సర్, యాక్సెలరోమీటర్, ఆల్టిమీటర్ లాంటి 16 రకాల సెన్సర్ల వరకూ ఈ వాచీలలో ఉంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెరగడం, మరీ ముఖ్యంగా కొవిడ్ తర్వాత పెరుగుతున్న ఆరోగ్య స్పృహ కారణంగా వీటి వాడకం పెరుగుతున్నది. అందుకే 2016తో పోలిస్తే ఆరోగ్య పరికరాల వాడకం ఏకంగా అయిదు రెట్లు పెరిగిపోయింది. ఇక మనదేశంలో అయితే 2021 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కోటికి పైగా స్మార్ట్ వాచీలు అమ్ముడుపోయినట్టు అంచనా! ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా యాపిల్ స్మార్ట్ వాచీలదే పై‘చేయి’గా ఉండేది. ఇప్పటికీ మూడో వంతు యాపిల్ వాటానే. క్రమంగా ఈ రంగంలోకి కొత్త సంస్థలు వస్తున్నాయి. శామ్సంగ్, ఫిట్బిట్ లాంటి కంపెనీలతో పాటు నాయిస్, బోట్, ఫైర్ బోల్ట్ లాంటి సంస్థలు అందుబాటు ధరల్లోనే స్మార్ట్ వాచీలను ఇస్తున్నాయి. ఒకప్పుడు కనీసం పదివేలకి సిద్ధపడితే కానీ దక్కని స్మార్ట్ వాచ్ ఇప్పుడు రెండు వేలకే దొరుకుతున్నది. ఇక ఈ కొత్త ఏడాది స్మార్ట్ వాచీల శకం అనడానికి ఆలోచించనక్కర్లేదు. మున్ముందు వాటిలో ఏ సౌలభ్యాలు వస్తాయా అన్నదే ఆసక్తికరం.
సినిమా అంటే ఒకరే హీరో ఉండాలి. కథానాయకులు చివరి వరకూ అవే పాత్రల్లో నటించాలి. ప్రతి సినిమాకు ఒక్కడే కథానాయకుడు ఉండాలి. తన పాత్ర కూడా ఉదాత్తంగా కనిపించాలి… గత కొద్దికాలంగా దక్షిణాది సినిమా ఈ సూత్రాలనే అంటిపెట్టుకుని ఉండేది. కానీ లెక్కలు మారుతున్నాయి. మారుతున్న దృక్పథాలతో పాటు… ఓటీటీ హవా కూడా ఇందుకు దోహదపడింది. హీరోయిన్లు కూడా ఐటెం పాటలకు సిద్ధపడుతున్నారు. హీరోలూ ప్రతికూల పాత్రలకు సై అంటున్నారు. సంజయ్ దత్ (కెజిఎఫ్-2), దుల్కర్ సల్మాన్ (కురూప్), ఆర్య (ఎనిమీ) అన్నీ ఈ కోవకే చెందుతాయి. ఈ ఏడాది సినిమాలలో అధికశాతం మల్టీస్టారర్లే అంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు ఇద్దరు నాయకుల చిత్రం అంటే పాటల పంపకాల దగ్గర నుంచీ చాలా లెక్కలు ఉండేవి. ఇప్పుడు పాత్రలకే ప్రాధాన్యత! ఆచార్య, ఎఫ్-3, ఆర్ఆర్ఆర్, బంగార్రాజు, భీమ్లా నాయక్… లాంటి సినిమాలన్నీ ఇద్దరు నాయకులవే! అఖండ, పుష్ప లాంటి సినిమాల్లో నాయకులకు లభించిన ఆదరణ… హీరో ఫలానా విధంగానే ఉండాలనే నిబంధనలు ఇక లేవని తేల్చేసింది. మరోవైపు జైభీమ్ విజయం, పోరాటం అంటే భౌతికంగానే ఉండాల్సిన పనిలేదని నిరూపించింది. ఇవన్నీ వేర్వేరు విషయాలే కావచ్చు. కానీ ‘కథ ఇలా ఉండాలి, పాత్రలు ఇలా ప్రవర్తించాలి’ అనే మూసధోరణి సన్నగిల్లడానికి సూచనలు. కాబట్టి ఇక మీదట ఒక సినిమా తీయాలి అనుకున్నప్పుడు… తప్పకుండా భిన్నమైన ఆలోచనలకు ప్రాధాన్యం ఉండబోతున్నది!
‘ఈ క్రీమ్ రాసుకుంటే తెల్లబడిపోతారు. లోకం మీ పాదాక్రాంతం అవుతుంది’ అనే ప్రకటన కొన్నాళ్ల కిందట బాగానే ఆకర్షించేది. ఇప్పుడలాంటి ప్రకటనలు వస్తే, ప్రతిఘటన తప్పదు. అందం అంటే తెల్లటి చర్మం, జీరో సైజు, నునులేత పెదవులు లాంటి ఊహలు తప్పనే భావన వస్తున్నది. ఆరోగ్యం, ఆత్మవిశ్వాసమే అసలైన అందమనే దృక్పథం పెరుగుతున్నది. అందుకే ఎలాంటి దుష్ఫలితాలు ఇవ్వని సౌందర్య ఉత్పత్తుల వైపే భారతీయ వినియోగదారులు మొగ్గుచూపుతున్నారంటూ గోల్డ్స్టెయిన్ సంస్థ తేల్చింది. పైగా ఇలాంటి ఉత్పత్తుల గురించి తెలుసుకునేందుకు కేవలం ప్రకటనల మీదే ఆధారపడటం లేదు. తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవాలి అనుకునేవారు 81 శాతం యూట్యూబ్ వీడియోల్లో వచ్చే రివ్యూలను అనుసరిస్తున్నారని తేలింది. ఇన్స్టా లాంటి సోషల్ మీడియాలో ‘బ్యూటీ ఇన్ఫ్ల్యూయెన్సర్స్’ పెరిగిపోతున్నారు. ఈ రంగంపట్ల అభిలాషతోనో, వ్యక్తిగత కారణంతోనో స్వయంగా సౌందర్య సాధానాలను ఉత్పత్తి చేసి అమ్ముతున్నవారి సంఖ్యా పెరుగుతున్నది. చర్మవ్యాధితో బాధపడిన తల్లి జ్ఞాపకార్థం మేకపాలతో సౌందర్య ఉత్పత్తులు రూపొందిస్తున్న కృత్తిక కుమరన్, ఇంట్లో పెరిగే ఉత్పత్తులతోనే ‘Enn’s Closet’ బ్రాండ్ మొదలుపెట్టిన నందిత మన్చంద ఈ కోవలోకే వస్తారు. 2027 నాటికి మన దేశంలో సౌందర్య వ్యాపారం నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని స్టాటిస్టికా అంచనా. ఇందులో ఎవరైనా భాగస్వాములు కావచ్చు. ట్రెండ్ తెలుసుకోవాలంతే!
ఓ వ్యక్తి ఉన్నతోద్యోగం కోసం వెళ్తున్నాడు, ఓ వ్యాపారవేత్తను టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేయబోతున్నది, ఓ పెద్ద సంస్థ నిపుణుడి సేవలు పొందాలనుకుంటున్నది… ఇలాంటి సందర్భాలన్నింటిలోనూ ఇప్పుడు అందరూ చూసేది లింక్డిన్లో అతని ప్రొఫైల్నే! సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి, కాలక్షేపం చేయడానికి లింక్డిన్ సోషల్ మీడియా కాదు. వృత్తిపరమైన పరిజ్ఞానం, ఎదుగుదల కోసం ఉపయోగించుకోవాల్సిన మాధ్యమం. 2003లో ఈ సంస్థను మొదలుపెట్టినప్పుడు… ఉద్యోగ అవకాశాలకు సాయపడే వేదికగానే ఉండేది. క్రమంగా కెరీర్కు సంబంధించిన ప్రతి విషయానికీ దోహదపడేలా రూపొందింది. మనం ఏం చేస్తున్నాం, అనుభవం ఏమిటి, ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయి లాంటి ప్రొఫైల్ను తయారుచేసుకోవడంతో పాటుగా… వేర్వేరు విషయాల మీద మన అభిప్రాయాలను ప్రచురించే అవకాశమూ ఇస్తున్నది. అదే వృత్తిలో ఉన్నవారితో పరిచయం పెంచుకునే సౌలభ్యం ఉంది. ఇప్పుడిక లింక్డిన్ ప్రొఫైల్ రూపకల్పన కూడా ఒక నైపుణ్యంగా మారిపోయింది. సంస్థలు సైతం తమ బ్రాండింగ్ మెరుగుపరుచుకునేందుకు, దృక్పథాలను వెల్లడించేందుకు లింక్డిన్ను ఎంచుకుంటున్నాయి. ఫేస్బుక్లాగే లింక్డిన్లోనూ గ్రూప్స్ ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం లింక్డిన్లో వేగంగా చేరుతున్నది భారతీయులే. ఇప్పటికే మనవారు ఎనిమిది కోట్ల మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. దేశంలో మరింతగా విస్తరించేందుకు హిందీలో కూడా అందుబాటులోకి వచ్చింది. సర్టిఫికేషన్ కోర్సులనూ అందిస్తున్నది.
.. ముందే చెప్పుకొన్నట్టు ఈ మార్పులు ఇక్కడితో పరిమితం కాదు. ఉదాహరణకు యువతరం వ్యవసాయాన్ని అందుకోవడం, సాంకేతికంగా సాగు జరగడం, డిజిటల్ ట్రెండ్స్ పట్ల అప్రమత్తత పెరగడం, అంతరిక్షంలోకి కొత్త ప్రయాణాలు, వర్క్ ఫ్రమ్ హోమ్ పట్ల సుముఖంగా ఉంటున్న సంస్థలు, ఆగ్మెంటెడ్ రియాలిటీతో మారుతున్న అనుభూతులు… అన్నీ కూడా గమనించదగ్గవే! నిజానికి టెక్నాలజీ ఓ ప్రవాహం లాంటిది. ఎటు పారుతుందో చెప్పలేం. కొంతవరకు ఊహించగలమంతే!
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఈ కొత్త ఏడాదిలో మహిళలు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి
debut Heroines 2021 | తెలుగు ఇండస్ట్రీపై మెరిసిన కొత్త తారలు వీళ్లే..
Price Shock |2022లో సామాన్యుడికి షాక్.. వంట నూనె మొదలు కార్ల వరకూ అన్నింటి ధరలమోతే?!
Omicron on Gold | కొత్త సంవత్సరం షాకివ్వబోతున్న బంగారం ధరలు.. కారణమిదేనా !
GST Hike | జీఎస్టీ వాత మోత.. ఇవి కొంటే కండ్లు బైర్లు కమ్మాల్సిందే.. న్యూఇయర్లో పెరిగేవి ఇవే !
2021లో మహిళల కోసం జిందగీ అందించిన ప్రత్యేక కథనాలు మీకోసం..