మహిళా.. నీకిది ఆత్మవిశ్వాస నామ సంవత్సరం! మొగుడు, పిల్లగాడు, నాయిన, అన్న, తమ్ముడు.. ఊతకర్రలు ఇంకెంతకాలం? పందెం నీది, నువ్వే పరుగెత్తాలి. శ్రమ నీది, పతకం నువ్వే ధరించాలి. ఏ ఆధారమూ లేకుండా నిటారుగా నిలబడే ప్రయత్నం మొదలుపెట్టు. ఎవరినో బతిమాలాల్సిన పనిలేకుండా నీ నిర్ణయాలను నువ్వే తీసుకునేంత పరిజ్ఞానాన్ని పెంచుకో. మరొకరి సూచనలు తీసుకున్నా.. వినదగు నెవ్వరుచెప్పిన అన్నంతవరకే! అన్నిటికంటే ముందు, నీ ఆరోగ్యం జాగ్రత్త! ఆరోగ్యాన్ని కాపాడే ఆహారం జాగ్రత్త! అన్నం పెట్టే కెరీర్ జాగ్రత్త! కష్టపడి సంపాదించే ప్రతి పైసా జాగ్రత్త! కొలువుతో ముడిపడిన ఒత్తిడులతో జాగ్రత్త! అతి సున్నితమైన నీ మనసు జాగ్రత్త! నీ అమాయకత్వంతో ఆడుకునే సోషల్ మీడియాతో జాగ్రత్త!
చేసిన త్యాగాలు, పడిన రాజీలు, చిందించిన చెమటలు, చిదిమేసుకున్న కలలు..చాలు చాలు! గొప్ప పుస్తకాలు చదువు. మంచి సినిమాలు చూడు. కళలను ప్రేమించు. నీకోసం నువ్వు జీవించు.బంధాలు, కుటుంబం, ఉద్యోగం, పుట్టిల్లు.. అన్నీ ముఖ్యమే!అన్నిటికన్నా నీ మనుగడ ముఖ్యం. నీ అస్తిత్వం ప్రధానం. నీకు నువ్వే బలం. నీకు నువ్వే సైన్యం.
నీ మనోబలమే త్రివిధ దళం.స్థయిర్యంగా, ధైర్యంగా కొత్త ఏడాదిలో ప్రవేశించు..
మనసా క్షేమమా!
చాలామంది, ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యమే అనుకుంటారు. మనసును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. అందులోనూ రెండేండ్లుగా మహిళలు మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కుంగుబాటు, ఆందోళన, ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు మొదలైన రుగ్మతలకు గురి అవుతున్నవారిలో మహిళలే ఎక్కువని అధ్యయనాలు వెల్లడించాయి. కుటుంబ సమస్యలు, ఆఫీసులో పనుల కారణంగా మహిళలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. మానసిక దృఢత్వం తక్కువగా ఉన్న స్త్రీలలో ఇలాంటి ఇబ్బందులు మరీ అధికం. కొత్త సంవత్సరం రాగానే కొత్తకొత్త తీర్మానాలు చేసుకుంటారు. జిమ్కు వెళ్లాలనో, వాకింగ్ చేయాలనో, పొదుపునకు శ్రీకారం చుట్టాలనో ఆలోచిస్తారు తప్ప, మానసిక దృఢత్వం గురించి ఏమాత్రం పట్టించుకోరు. మానసిక ఆరోగ్యంపై వెచ్చించే సమయం, డబ్బు ఏమాత్రం వృథా కాదు.
కొన్ని తీర్మానాలు..
–సహానా రబీంద్రనాథ్
లైఫ్ కోచ్ అండ్ థెరపిస్ట్ SWITCH NOV ,హైదరాబాద్
‘ఇ-వల’లో పడొద్దు!
కరోనా రెండో దశలో నేరాలు ఒకేసారి 8 శాతం మేర పెరిగాయి. ఆ మూలాల్ని కనిపెట్టే ప్రయత్నంలో భాగంగా.. తల్లిదండ్రులు, పిల్లలపై ఒక సర్వే చేశాం. ప్రతి జిల్లాలో రెండు పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడాం. ఇంటర్నెట్ వాడకం పెరగడమే ఇందుకు ముఖ్యకారణమని తేలింది. ఇప్పటికీ 93 శాతం మందికి ఇంటర్నెట్ సురక్షిత వాడకం గురించి తెలియదు. అశ్లీల చిత్రాలు చూడటం, తెలియని వ్యక్తులతో చాటింగ్ చేయడం, నగ్న వీడియో కాల్స్.. ఇలా అమాయ కంగా మోసగాళ్ల వలలో పడుతున్నారు. ఇదే అవకాశంగా ఆ దుర్మార్గులు బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారు. లేదంటే ఆ చిత్రాలను ఏవో వెబ్సైట్లకు అమ్మేస్తున్నారు. కొన్నిసార్లు స్వేచ్ఛ పేరుతో మైనర్ బాలికలు ఇంట్లోంచి వెళ్లిపోతున్నారు. వీటన్నిటి నేపథ్యంలో.. తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. పిల్లల్ని ఎంతసేపూ కంప్యూటర్ ముందు కూర్చో, ఫోన్లో చూసి చదువుకో అని పురమాయిస్తున్నారే తప్ప, ఏ పద్ధతిలో ఇంటర్నెట్ను ఉపయోగించాలన్నది పెద్దలకే తెలియడం లేదు. దాంతో పిల్లలు సులభంగా పెడదారులు పడుతున్నారు. కరోనా సమయంలో ఫ్రెండ్స్, సినిమాలు, రెస్టారెంట్లు.. తదితర సామాజిక జీవితం లేకపోవడంతో సోషల్ మీడియాకు అలవాటుపడ్డారు. నచ్చినట్టు పోస్ట్లు పెట్టడం, అసభ్యమైన చాటింగ్ చేయడం.. అప్పటికప్పుడు వినోదంలా అనిపించినా, తీవ్ర నేరాలకు దారితీస్తున్నాయి.
అప్రమత్తంగా ఉండాలి
తెలంగాణ పోలీసు శాఖ మహిళల కోసం షీ టీమ్స్, సైబ్హర్, డీవీ యాప్, సైబర్ ల్యాబ్, భరోసా సెంటర్లు, సఖి సెంటర్లు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్ మొదలైన విభాగాలను ఏర్పాటు చేసింది. ఏ ఒక్క మహిళ కూడా అభద్రతకు లోనుకాకుండా 24 గంటలూ కృషి చేస్తున్నది. టెక్నాలజీని ఉపయోగించుకుని, టెక్ నేరాలను కట్టడి చేసేందుకు.. పాఠశాల, కాలేజీ విద్యార్థులను మా కార్యక్రమాల్లో భాగం చేస్తున్నాం. వాళ్లకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇస్తున్నాం. ఇలా పరిధి పెరుగుతూ ఉంటే, నేరాల తీవ్రత తగ్గేందుకూ ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వం ఎంత చేస్తున్నా, దాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటేనే సమస్య తీరిపోతుంది. టీనేజ్ అమ్మాయిలు, ఉద్యోగినులు, ఆంత్రప్రెన్యూర్లు సైబర్ నేరగాళ్ల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆన్లైన్లో ఎరుకతో వ్యవహరించాలి.
-బి. సుమతి ఐపీఎస్, డీఐజీ, మహిళా భద్రతా విభాగం, సీఐడీ
భోజనాన్ని ప్రేమించు!
ఇల్లు, పిల్లలు, ఉద్యోగం.. ఇలా రకరకాల బాధ్యతలలో పడిపోయి మహిళలు తిండి గురించి పట్టించుకోవడం మానేశారు. పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలన్న ఆలోచనే రాదు. మహిళల శ్రమకు, వాళ్లు తీసుకునే ఆహారానికి ఏమాత్రం పొంతన ఉండదు. అందుకే, చిన్న వయసులోనే రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. బాల్యం వరకూ ఫర్వాలేదు. కానీ రుతుక్రమం మొదలైన దగ్గరనుంచీ ఆడపిల్లలకు పరిపూర్ణ పోషకాహారం తప్పనిసరి. పురుషులతో పోలిస్తే మహిళలకు క్యాలరీలు తక్కువగా; విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా అవసరం అవుతాయి. రుతుక్రమం, గర్భధారణ, మెనోపాజ్ దశల్లో రక్తహీనత, ఎముకల బలహీనత వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్-డి, విటమిన్-బి9 అందించే పదార్థాలు తప్పక తీసుకోవాలి.
ఈ ఏడాది ఆహారంలో..
మాంసం, కాలేయం, గుడ్లు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ మొదలైన వాటిలో ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకుంటే ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ (పీఎంఎస్) లక్షణాలు తగ్గుతాయి. పాలు, పెరుగు, చీజ్, ఆకుకూరల్లోని క్యాల్షియం కూడా ఆ ప్రభావం నుంచి ఊరటనిస్తాయి.
వేపుళ్లు, ఫాస్ట్ ఫుడ్, ఉప్పు కుమ్మరించిన స్నాక్స్కు దూరంగా ఉండటం మంచిది.
రోజూ ఒక మల్టీవిటమిన్ సప్లిమెంట్ లేదా మెగ్నీషియం, విటమిన్ బి6, విటమిన్-ఇ అందించే ఆహారం తీసుకుంటే అన్నిరకాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఫైబర్ తగ్గితే మలబద్ధకం వస్తుంది. తరచూ బీన్స్, బెర్రీస్, ఆకుకూరలు తీసుకోవాలి.
నిత్య వ్యాయామం, రోజూ ఏడెనిమిది గంటల నాణ్యమైన నిద్ర చాలా అవసరం.
–మయూరి ఆవుల ,న్యూట్రిషనిస్ట్ ,www.trudiet.in
ఆరోగ్యం జాగ్రత్త!
మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. దేశమూ ఆరోగ్యంగా ఉంటుంది.ఆమె మాత్రం తన గురించి పట్టించుకోవడం లేదు. హారతి కర్పూరంలా, కుటుంబ సేవలోతనను తాను కరిగించుకుంటున్నది. కొత్త ఏడాది నుంచి అయినా మహిళలు ఆరోగ్యంపై తగినంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. పురుషుడితో పోలిస్తే మహిళ జీవితంలోనే ఆరోగ్య సంక్షోభాలు ఎక్కువ.
ఏ రుగ్మతా హఠాత్తుగా ఊడిపడదు. చిన్నగా మొదలై తీవ్రస్థాయికి చేరుతుంది. పరిస్థితిని మనం అంతదాకా రానివ్వకూడదు. తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. రక్తపోటు (బీపీ), కొలెస్ట్రాల్, మధుమేహం, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఎముకలను గుల్లబార్చే ఆస్టియోపొరోసిస్ మొదలైన రుగ్మతలకు సంబంధించి కనీసం ఏడాదికోసారి రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం మంచిది. పరీక్ష తర్వాత ఆ నివేదికలను నిపుణులకు చూపించాలి.
సొంత వైద్యం వద్దు
ఆహారాన్ని మించిన ఔషధం లేదు. కానీ, చాలా సందర్భాల్లో మహిళలు పోషక విలువలను పట్టించుకోరు. కుటుంబమంతా తిన్నాక, మిగిలిందే తినేస్తారు. కొన్నిసార్లు అర్ధాకలితో కడుపు మాడ్చుకుంటారు. ఇంకొన్నిసార్లు అవసరానికి మించి తింటారు. రెండూ మంచి పద్ధతులు కాదు. వృద్ధాప్యంలో ఎదురయ్యే రుగ్మతలను అధిగమించాలంటే.. యుక్తవయసు నుంచే ఎముకలకు బలాన్నిచ్చే ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే పురుషుల కంటే మహిళల్లోనే త్వరగా ఎముకల సమస్యలు వస్తాయి. జంక్ఫుడ్కు దూరంగా ఉండాలి. రాత్రిళ్లు కంటినిండా నిద్రపోవాలి. ఏ సమస్య వచ్చినా వైద్యులను సంప్రదించాకే మందులు వాడాలి. సొంత వైద్యం వద్దు. రుతుక్రమంలో మార్పులను గుర్తించిన వెంటనే అప్రమత్తం కావాలి. ఆరోగ్య డైరీ రాసుకుంటే మరీ మంచిది. అపాయింట్మెంట్లు మరచిపోయే ప్రమాదం ఉండదు. కొన్నిసార్లు నిర్లిప్తతే ప్రాణాంతకం.
-డాక్టర్ మంజులా అనగాని
క్లినికల్ డైరెక్టర్ , డిపార్ట్మెంట్ ఆఫ్ గైనకాలజీ ,కేర్ హాస్పిటల్స్
ఆర్థిక స్వేచ్ఛ సాధించు
ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు నిర్వహిస్తున్నా చాలామంది మహిళలు ఆర్థిక విషయాల్లో పురుషులపైనే ఆధారపడుతున్నారు. స్వతంత్రంగా వ్యవహరించే ప్రయత్నం చేసినా.. భర్త, పిల్లలు నిరుత్సాహపరుస్తున్నారు. మరోవైపు ఖర్చు తప్ప, పొదుపు తెలియని మహిళలూ ఉన్నారు. వీళ్లంతా కొత్త సంవత్సరం నుంచి అయినా ఆర్థిక ప్రణాళిక, దీర్ఘకాలిక లక్ష్యం వైపు అడుగులు వేయాలి.
పొదుపు-మదుపు
మెజారిటీ మహిళలు ఆదాయంలోంచి ఎంతోకొంత పొదుపు చేస్తారు. కానీ దాచుకున్న డబ్బును ఎక్కడ, ఎలా పెట్టుబడి పెట్టాలన్న విషయంపై అతి తక్కువ మందికే అవగాహన ఉంటున్నది. కష్టపడి మిగుల్చుకున్న సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, ఈ-బంగారం.. తదితర మార్గాల్లో మదుపు చేయవచ్చు. రూపాయి మరో రూపాయిని సంపాదించేలా ఆర్థిక వ్యూహాన్ని రచించుకోవాలి. ఉద్యోగినులైతే పన్నుల భారం పడకుండానే మదుపు చేయడంపై దృష్టిపెట్టాలి. రాబడి మీద ఆశతో, వడ్డీల మీద మమకారంతో.. అంతగా సురక్షితంకాని మార్గాలవైపు వెళ్తుంటారు కొందరు. దీనివల్ల అసలుకే ఎసరు రావచ్చు. ప్రైవేటు చిట్టీలు, వడ్డీ దందాలు ఎంతోకాలం నడవవు. రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసిన సంఘటనలు అనేకం. సంపాదనకు ఉద్యోగం ఒక్కటే మార్గం కాదు. ఇంటర్నెట్ పుణ్యమా అని ఉపాధి అవకాశాలు విస్తృతం అయ్యాయి. పెయింటింగ్స్, కుట్లు, అల్లికలు, హోమ్ చెఫ్, ట్యూషన్స్.. ద్వారా ఎంతోకొంత ఆర్జించే అవకాశం ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఓ వరమే. సంపాదన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. సమాజంలో ఓ గుర్తింపును తెస్తుంది. జీవన నాణ్యతను పెంచుతుంది. వృద్ధాప్యంలో ఆసరాగా నిలబడుతుంది.
-దీప నిట్టల ,చార్టర్డ్ వెల్త్ మేనేజర్ ,డైరెక్టర్, శ్రీమంత్రణ ఫైనాన్షియల్ సర్వీసెస్
ఫిట్గా ఉండాలి మేడమ్!
కొత్త సంవత్సర ముఖ్య నిర్ణయాల్లో ఫిట్నెస్ ఒకటి. కాకపోతే ఆ తీర్మానం డైరీకే పరిమితం అవుతున్నది. ఒకటి రెండు రోజుల్లోనో, ఒకటిరెండు నెలల్లోనో ఆ ఉత్సాహం నీరుగారిపోతున్నది. దయచేసి, ఆడవాళ్లు ఆరంభశూరులు అన్న మాటను నిజం చేయకండి. ఫిట్గా ఉండాలన్న నిర్ణయం మంచిదే. నేటి నుంచే ఆ ప్రయత్నాలు మొదలుపెట్టండి. తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్లే చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎంతసేపూ భర్త, పిల్లల గురించే ఆలోచిస్తూ, వాళ్ల కోసమే కష్టపడుతూ అదే జీవితం అనుకునే మహిళలు.. ఇకనైనా తమను తాము ప్రేమించుకోవాలి. తమ ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలన్నది తెలుసుకోవాలి. పక్కా ప్రణాళికతో రోజువారీ జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలి. వ్యాయామం శారీరక, మానసిక ఆరోగ్యాలు రెండిటిపైనా ప్రభావం చూపుతుంది. ఈ ఏడాది నుంచి అయినా కుటుంబం, ఉద్యోగం ఎంత ముఖ్యమో ఫిట్నెస్ కూడా అంతే అవసరమన్న విషయాన్ని మర్చిపోకూడదు. సెలబ్రిటీల ఫిట్నెస్ గోల్స్ గురించి వార్తల్లో వింటాం, చూస్తాం. అయితే వాళ్లు కేవలం అందం కోసమే శ్రమించట్లేదని తెలుసుకోవాలి. నిత్య వ్యాయామం వల్ల అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు దూరమై, కొత్త ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇంట్లో ఒంటరిగా చేయలేమని అనుకునేవాళ్లు జిమ్కు వెళ్లొచ్చు. నలుగురితో కలవడం వల్ల వ్యాయామం అంటే ఆసక్తి కలగవచ్చు. లేదంటే ఇంటి పక్కన ఉన్న నలుగురు మహిళలు బృందంగా ఏర్పడవచ్చు. రోజూ కలిసి దగ్గర్లోని పార్కుకు వెళ్లి నడక, జాగింగ్, యోగా చేయవచ్చు. వారానికి నాలుగు రోజులైనా ధ్యానం చేయాలి. దీనివల్ల మానసిక ఉల్లాసం రెట్టింపు అవుతుంది. వీలైతే, కాలేజీ రోజుల్లో ఆడిన ఆటలను మళ్లీ మొదలుపెట్టొచ్చు. ఈ ఏడాది నుంచి, వీలైతే ఈ రోజు నుంచే వ్యాయామానికి శ్రీకారం చుట్టండి.
–ప్రతిమ ,వ్యవస్థాపకురాలు, ‘ఫిట్బీ’ ఆన్లైన్ జిమ్