Omicron on Gold | కొత్త సంవత్సరం కోసం కోటి ఆశలు.. మహిళామణుల గురించి వేరే చెప్పనక్కర్లేదు.. పరిస్థితులు అనుకూలిస్తే నూతన వసంతంలోనైనా కాసింత బంగారం కొనుక్కోవాలని ఆశలు పెట్టుకుంటారు. కానీ బంగారం ధర సగటు భారతీయుడికి అందనంత పైపైకి దూసుకెళ్లే సంకేతాలు కనిపిస్తున్నాయి. కరోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ భయాలు.. ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు.. అమెరికా డాలర్ బలోపేతం వంటి అంశాలతో వచ్చే ఏడాది తులం బంగారం రూ.55 వేల మార్క్ను దాటుతుందని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు.
గతేడాది ఆగస్టులో 10 గ్రాముల (24కే) బంగారం రూ.56,200లతో ఆల్టైం రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. 2021-22 ద్వితీయార్థంలో కాసింత ధర తగ్గినా.. నూతన సంవత్సరంలో మళ్లీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.48వేలకు చేరువలో ఉంది. ఇది గతేడాది ఆగస్టులో ఆల్టైం రికార్డుతో పోలిస్తే సుమారు 14 శాతం.. గత జనవరి నుంచి నాలుగు శాతం తక్కువే.. డాలర్పై రూపాయి మారకం విలువ బలహీనంగా ఉండటంతో అంతర్జాతీయ ధరలతో పోలిస్తే దేశీయు బులియన్ మార్కెట్లో మూడు శాతానికి పైగా ధర పలుకుతున్నది. 2021లో మదుపర్లు ఈక్విటీల్లో పెట్టుబడుల మదుపుకు పరుగులు తీయడం వల్లే కాసింత బంగారం ధర తగ్గిందని కామ్ట్రెండ్జ్ కో-ఫౌండర్ కం సీఈవో జ్ఞానశేఖర్ త్యాగరాజన్ చెప్పారు.
స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 1791 డాలర్లు.. భారత్ ఎంసిఎక్స్ ఫ్యూచర్స్లో తులం బంగారం రూ.47,740 పలుకుతోంది. ఒమిక్రాన్ వేరియంట్తోపాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో మధ్యకాలికంగా.. వచ్చే ఐదారునెలల్లో మోస్తర్గా బంగారం ధర పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒమిక్రాన్ కేసులు పెరిగితే స్టాక్మార్కెట్లు బలహీనపడే సంకేతాలు ఉన్నాయి. అదే జరిగితే బంగారం ధర పెరగడం ఖాయంగా కనిపిస్తున్నది. ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్లో రూ.49,200 వద్ద స్వల్పకాలిక ఒత్తిడి ఉంటుందని సమాచారం. వచ్చే ఏడాది రూ.51,800 వరకు దూసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. రూ.42,500 వద్ద మద్దతు లభిస్తుందని బులియన్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.