The Sepoi | అది 2016. పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్పై ఇండియన్ ఆర్మీ దుస్తుల్లో ఉగ్రమూక దాడికి తెగబడింది. తొమ్మిది మంది సైనికులు, ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. ముష్కరులు ఎలాగోలా పాత డ్రెస్ను దొరకవట్టి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ సంఘటన తర్వాత, ఆర్మీ డ్రెస్ను చెత్తపాలు చేయడానికి సైనికులు జంకుతున్నారు. అలాగని ఇంట్లోనూ పెట్టుకోలేరు. ఈ సమస్యకు వినూత్నమైన పరిష్కారం అందిస్తున్నాయి రెండు సంస్థలు.
మేజర్ జనరల్ అషిమ్ కోహ్లీ ఇండియన్ ఆర్మీ నుంచి రెండేండ్ల క్రితం పదవీ విరమణ పొందారు. సిపాయిగా చేరిన నాటి నుంచి మేజర్ జనరల్ అయ్యే వరకూ వివిధ హోదాల్లో తాను ధరించిన ఆర్మీ యూనిఫామ్లు అనేకం ఉన్నాయి ఆయన దగ్గర. కొన్నిటిని పాత జ్ఞాపకాలుగా తన దగ్గరే ఉంచుకోవాలనుకున్నారు. ‘మిగిలిన వాటిని ఏం చేయాలి?’ పడేయడం ఇష్టం లేదు. ఎందుకంటే అవి ఒంటికి, ఇంటికి గౌరవంతోపాటు హోదానూ ఇచ్చాయి. ‘పడేసినా, వాటిని ఎవరైనా దుర్వినియోగం చేస్తే?’ అన్న అంతర్మథనంలో నుంచి పుట్టిందే ‘సేవాజ్ నీసిం ఫౌండేషన్’. పఠాన్కోట్ దాడి తర్వాత త్రివిధ దళాల సిబ్బంది తమ యూనిఫామ్లను వ్యర్థాల పాలు చేసే సాహసం చేయడం లేదు. సైనికుల పెట్టెల్లో గుట్టలుగా మూలుగుతున్న ఆ పాత యూనిఫామ్లను సేకరించి అప్ సైక్లింగ్ చేస్తున్నది ‘సేవాజ్ నీసిం ఫౌండేషన్’.
ఆర్మీకి అందించే దుస్తులు చాలా నాణ్యమైనవి. త్వరగా చిరిగిపోవు. అందుకే వాటితో స్కూల్ బ్యాగ్లు, మాస్క్లు, దుప్పట్లు తయారు చేయిస్తున్నారు అషిమ్ కోహ్లీ. వీటిని ఆర్మీ సంక్షేమ సంఘాలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు ఉచితంగా ఇస్తున్నారు. ‘వర్ధికా సమ్మన్’ అనే వెబ్సైట్ ద్వారా అవసరమైన వారికి అందజేస్తున్నారు. వీటికి సంబంధించిన కుట్టుపనిని నిరుపేద మహిళలకు అప్పగించారు. తద్వారా, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇస్తున్నారు అషిమ్ కోహ్లీ. సైన్యానికి, సమాజానికి ఎంతోకొంత తిరిగి ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్టు చెబుతారు ఆ రిటైర్డ్ మేజర్ జనరల్. రెండు నెలల్లోనే దాదాపు ఐదు వేలకు పైగా యూనిఫామ్లను సేకరించారు కోహ్లీ.
ముంబైకి చెందిన భార్యాభర్తలు.. సిద్దార్థ్, సుచి జైస్వాల్. 2019లో సిపాయి అనే మాట కలిసొచ్చేలా ‘సిపోయ్’ సంస్థను స్థాపించారు. వీరు కూడా త్రివిధ దళాల అధికారులు, సైనికుల నుంచి పాత యూనిఫామ్లు సేకరించి అందమైన బ్యాగులు, ల్యాప్టాప్ బ్యాగులు, బ్యాక్ప్యాక్స్, టోట్ బ్యాగులు, మాస్క్లు వంటివి తయారు చేసి ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. డిజైన్తో పాటు నాణ్యత కూడా బాగుండటంతో ‘సిపోయ్’ వెబ్సైట్ ద్వారా జనం విరివిగా కొనుగోలు చేస్తున్నారు. తద్వారా వచ్చే లాభాల్లో 15 శాతం సైనికుల పిల్లలు, వారి భార్యల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నారు.
సిపోయ్ సంస్థ సైనికుల నుంచి సేకరించే యూనిఫామ్లకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ యూనిఫామ్తో పాటు దాతల వివరాలు కూడా తీసుకుంటారు. సదరు సిపాయి పోరాటాల చరిత్రను తాము తయారు చేసే బ్యాగుల్లో భద్రపరుస్తారు. దీంతో కొనుగోలు చేసినవారు కూడా, ఆ బ్యాగులను సగర్వంగా ధరిస్తారు. ‘మేం సిపోయ్ని ప్రారంభించినప్పుడు, కస్టమర్లలో ఎక్కువ మంది సాధారణ పౌరులే ఉంటారని అనుకున్నాం. కానీ, సైనికుల బంధువులు కూడా కొనుగోలు చేస్తున్నారు’ అని చెబుతారు సిద్దార్థ్ దంపతులు. భారత సైన్యం గౌరవాన్ని కాపాడే ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకునేవారు thesepoi.com వెబ్సైట్ను సందర్శించవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pregnancy Tips | ఏ సమయంలో కలిస్తే పిల్లలు పుడతారు?
bullettu bandi | బుల్లెట్టు బండి పాట పాడింది మోహన.. మరి రాసింది ఎవరో తెలుసా?
శ్రీదేవి సోడా సెంటర్ ఆనందికి పెళ్లయిందా?
చేతులను ఎందుకు 20 సెకన్లు శుభ్రంచేసుకోవాలి?