Spanish Tapas Platter | ప్లేట్ చిన్నదైపోయింది. స్పూన్ బక్కచిక్కింది. గిన్నెలు డైటింగ్ చేస్తున్న అమ్మాయిల్లా.. జీరో సైజులో కనిపిస్తున్నాయి. చిన్న హోటళ్లు మొదలు పెద్దపెద్ద రెస్టారెంట్ల వరకూ ఆ ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. దీనివల్ల ఆహారం వృథా తగ్గింది. కస్టమర్ల ఆరోగ్యమూ మెరుగుపడుతున్నది. ఆ ట్రెండ్ పేరే ‘తపస్’.
‘చిన్న కుటుంబం. చింతలు లేని కుటుంబం’ అని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. ఇప్పుడా ప్రస్తావన ఎందుకంటే, చిన్నగా.. కొద్దిగా.. మితంగా ఎప్పుడు తిన్నా ఆరోగ్యమే. అందుకే ఇన్నాళ్లూ స్పెయిన్కే పరిమితమైన ‘తపస్’ ఫుడ్డింగ్ స్టైల్ ఇప్పుడు భారత్ వంటి దేశాలకూ పాకింది. మీకు ఇష్టమైన ఆహారాన్ని చాలా పరిమితంగా.. చిన్నచిన్న ప్లేట్లలో మళ్లీమళ్లీ వడ్డించడమే ‘తపస్ స్టైల్’. ఇప్పుడీ ట్రెండ్ను ప్రముఖ రెస్టారెంట్లు విధిగా అమలు చేస్తున్నాయి. ఇన్నాళ్లూ.. పెద్దపెద్ద గిన్నెల్లో.. ప్లేటు నిండా వడ్డిస్తే.. చాలావరకు ఆహారం వృథా అయ్యేది. దీనివల్ల నిర్వాహకులకూ నష్టం వాటిల్లేది. పైగా ఆహారాన్ని వృథా చేశామనే బాధ కస్టమర్లను వేధించేది.. ‘తపస్’తో అలాంటి బాధలేమీ ఉండవు. కస్టమర్లకు కొద్దికొద్దిగా, నచ్చిన ఆహారాన్ని కొసరి కొసరి వడ్డిస్తారు కాబట్టి, కడిగి పారేసినంత శుభ్రంగా పళ్లెంలోని ఆహారాన్ని ఆరగిస్తారు.
‘తపస్’ ఫుడ్డింగ్ స్టైల్ గురించి తెలుసుకోవాలంటే, దానికి ఆద్యుడైన స్పెయిన్ రాజు ఆల్ఫాన్సో XIII గురించీ తెలుసుకోవాలి. ఒకసారి ఆల్ఫాన్సో తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. ఆయనకేమో ఆకలి ఎక్కువ. సమయానికి ముద్ద తినకపోతే క్షణం గడవదు. వైద్యులు మాత్రం చాలా మితంగా తినాలని, పరిమితంగా మద్యం సేవించాలని చెప్పారు. తేడావస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. అయితే ఆల్ఫాన్సో తప్పనిసరి పరిస్థితుల్లో చిరుతిండ్లను ఆశ్రయించాడు. ఆ కాలంలో తన వంటశాలలోని ప్రముఖులను పిలిపించి.. తనకు నచ్చిన ఆహారాన్ని రుచిగా, అతి తక్కువ మోతాదులో వండాలని ఆజ్ఞాపించాడు. ఇంకేముంది..? ‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా’ అన్నట్లుగా ఆయన కోరినట్లే చిన్నచిన్న గిన్నెల్లో నచ్చినవన్నీ వండివార్చారు. అలా రోజూ తనకు నచ్చిన ఆహారాన్ని చిన్నచిన్న గిన్నెల్లో మితంగా తీసుకుంటూ, కొద్దికొద్దిగా వైన్ తాగుతూ.. కొద్దికాలంలోనే అనారోగ్యం నుంచి గట్టెక్కాడు ఆల్ఫాన్సో XIII.
ఇంకో కథనం ప్రకారం.. ఆల్ఫాన్సో ఒక దగ్గర మద్యం కోసం ఆగాడట. అక్కడ ఒక వ్యాపారి రుచికరమైన ఆహారాన్ని చిన్నపాటి గిన్నెల్లో వడ్డించాడట. ఆ పద్ధతి రాజుకు బాగా నచ్చడంతో.. రుచికరమైన ఆహారాన్ని మితంగా తీసుకోవడం ప్రారంభించాడట. నాటినుంచే చిన్నగిన్నెల్లో ‘తపస్’ అనే కొత్తరకం వడ్డన మొదలైందని అంటారు.
ముంబై, గోవా, హైదరాబాద్ లాంటిచోట్ల ఇప్పటికే ఈ ట్రెండ్ విస్తరించింది. నిజానికి వైద్యులు కూడా తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తినాలని చెబుతారు. చిన్న పళ్లాల్లో తింటున్నప్పుడు.. పొట్టకంటే ముందు మనసు నిండుతుంది. ఆహార పరిమాణమే కాదు, చాలాచోట్ల ఆహార పదార్థాలు, మిఠాయిల సైజు కూడా తగ్గించారు. లడ్డూ, జిలేబీ, మైసూర్పాక్లు మునుపటితో పోలిస్తే చిక్కిపోయాయి. గతంలో సగం ముక్క మాత్రమే తీసుకుని, మిగతా సగం వృథాగా పడేసేవారు. ఇప్పుడు, చిన్నపాటి మిఠాయిని నేరుగా నోట్లో వేసుకుంటున్నారు. ఇది కూడా తపస్ ట్రెండ్లో భాగమే. ఈ ట్రెండ్ రెస్టారెంట్ నుంచి ఇంటి వరకూ విస్తరించింది. డైనింగ్ టేబుల్ మీద వాడుకోవడానికి అనువుగా ‘తపస్ ప్లేట్స్’ అంటూ పళ్లాలు లభిస్తున్నాయి. ‘దీన్ని కేవలం ట్రెండ్గానే భావించలేం. తపస్ ఓ ఆహార ఉద్యమం, ఆరోగ్య ఉద్యమం. వృథా అరికట్టడం, మితాహారాన్ని ప్రోత్సహించడం ఈ ఉద్యమ లక్ష్యాలు. ఆహారాన్ని ప్రేమించే ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు’ అంటాడు హైదరాబాదీ చెఫ్ ఠాకూర్ విక్రమ్సింగ్.
“లావణ్య త్రిపాఠి వర్షాకాలంలో ఈ ఫుడ్ను లొట్టలేసుకుని తింటుందట!!”