మంచి నిద్ర గుండె, శరీర ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మన దీర్ఘాయుష్షుకు కూడా సహాయకారి అవుతుంది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ, వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ కార్డియాలజీ సంయుక్తంగా నిర్వహించిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని ప్రకటించింది. నియమిత వేళల్లో సుఖంగా నిద్రపోయిన యువతరం అకాల మరణం పాలయ్యే ఆస్కారం తక్కువని ఈ పరిశోధనలో తేలింది. అయితే, ఏ కారణంతోనో మరణించినా, వాటిలో ఎనిమిది శాతం మరణాలకు నిద్ర అలవాట్లలో తేడాలే కారణమట. నాణ్యమైన నిద్రతో పురుషుల్లో 4.7 ఏండ్లు, స్త్రీలలో 2.4 ఏండ్ల ఆయుర్దాయం ఎక్కువవుతుందట.
కౌమారంలో డ్రగ్స్ అలవాటును అర్థం చేసుకోవడానికి వెంట్రుకల విశ్లేషణ కీలకంగా నిలుస్తుందని శాన్డీగోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అధ్యయనం నిరూపించింది. పరిశోధకులు సర్వే చేసిన
వారిలో 10 శాతం మంది తమకు డ్రగ్స్ అలవాటు ఉందని ఒప్పుకొన్నారు. అయితే పరిశోధకులు సర్వేలో పాల్గొన్న వారి వెంట్రుకలను విశ్లేషించినప్పుడు.. మరో 9 శాతం మందికి కూడా డ్రగ్స్ అలవాటు ఉందని తేలింది. కాబట్టే, పోలీసులు మాదకద్రవ్యాల కేసుల్లో నిందితుల కేశాలను తక్షణం పరీక్షలకు పంపుతారు.
ప్రకృతిలో ప్రయాణం మనసుకు సాంత్వన, స్వస్థత చేకూరుస్తుంది. ఇదే విషయాన్ని అమెరికాకు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధన కూడా నిర్ధారించింది. పక్షుల కిలకిలలు, వర్షం చిటపటలు వినడం, సముద్ర తీరంలోనో, నదీ తీరంలోనో అలలు ఒడ్డుకు తాకే సవ్వడులను అనుభూతించడం.. మన ఆరోగ్యాన్ని పెంచుతాయట. అంతేకాదు, ఇవి మన మానసిక బాధలను తగ్గిస్తాయి. మూడ్ను మెరుగుపరుస్తాయి. ఒత్తిడి, చికాకులను మటుమాయం చేస్తాయి. మెదడు సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి.
మాతృత్వ మరణాల్లో పదిశాతం వరకూ గర్భాశయ ఇన్ఫెక్షన్ల కారణంగానే సంభవిస్తాయి. దీనికి మూలం సెప్సిస్ అనే వ్యాధి. ఇది హానికర సూక్ష్మజీవుల వల్ల వ్యాపిస్తుంది. అజిత్రోమైసిన్ అనే సాధారణ యాంటీ బయాటిక్ ఈ రుగ్మతను అధిగమించడంలో సాయ పడుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళలలో ప్రసవం తర్వాత వచ్చే సెప్సిస్ మరణాల ముప్పును ఈ మాత్ర 33 శాతం మేర తగ్గిస్తుందట. న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురితమైన తాజా అధ్యయనం ఈ వివరాలను వెల్లడించింది.