మన సమాజం ఆధునికత వైపు పరుగులు పెడుతున్నా సంచార జానపద గాయక జాతులు ఇంకా మినుకుమినుకుమంటూ మనుగడ సాగిస్తున్నాయి. అలాంటివారిలో జంగం పాటలవాళ్లు ఒకరు. కరోనా కష్టకాలంలో ఆకలికి తాళలేక మరణించిన భార్య అంతిమక్రియల కోసం విషాదాన్ని భరిస్తూ తంబుర చేతబట్టి మరీ వృత్తి ధర్మం నిర్వహించిన జంగమయ్య కథ ‘డిమ్కి’. రచయిత్రి స్ఫూర్తి కందివనం ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించిన ఈ కథ.. నమస్తే తెలంగాణ – ముల్కనూరు ప్రజా గ్రంథాలయం కథల పోటీ 2021లో తొలి బహుమతి దక్కించుకున్నది. కష్టపడి చదువుకుని, ఉన్నత స్థానానికి ఎగబాకిన అణగారిన వర్గాల కృషీవలుల పట్ల సమాజంలో వివక్ష ఓ పట్టాన పోదని, నిరంతరం ఎర్రచీమల్లా కుడుతూనే ఉంటారని, అయినా జీవితంలో వెనకడుగు వేయొద్దనే సందేశాన్ని ఇస్తుంది ‘నల్లచీమలు’ కథ. గీత కార్మికుల బతుకు వెతలను మూడు తరాల నేపథ్యంతో రాసిన కథ ‘ముసురు’. విధిలేని పరిస్థితిలో ఓ మృగాడిని చంపిన యువతి విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తారనే ప్రశ్నతో సాగిన కథ ‘తీర్పు’. తండ్రి చెప్పిన చిన్న అబద్ధం కొడుకు ప్రవర్తనలో తెచ్చిన మార్పును ‘నాయిన చెప్పిన అబద్ధం’ తెలుపుతుంది. ‘నేను మీ’, ‘ఊరు యాది కొచ్చింది’, చీకటి వెలుగులు, స్వేచ్ఛ.. ఇలా ‘డిమ్కి’ సంపుటిలోని కథలు సమాజంలో సానుకూలమైన మార్పును ఆశిస్తూ సాగుతాయి. రచయిత్రి ముందుమాటలో పేర్కొన్నట్టు సాహిత్యంతో అప్పటికప్పుడు మార్పు సాధ్యం కాకపోయినా, అది రేపటి మార్పునకు పునాది కావాలి. ఆ దిశగా జరిగిన ప్రయత్నమే.. ‘డిమ్కి’ కథల సంపుటి.
రచన: స్ఫూర్తి కందివనం
పేజీలు: 85, ధర: రూ. 90
ప్రచురణ: శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్టు
ప్రతులకు: ఫోన్ 96527 45117
శ్రీనివాస విలాసము
పరిష్కర్త: వైద్యం వేంకటేశ్వరాచార్యులు
పేజీలు: 348
ధర: రూ. 300
ప్రచురణ: అక్షరార్చన
ప్రచురణలు
ఫోన్: 99896 79681
పద్మ, వాయు,లింగ పురాణాలు
ప్రశ్నోత్తర మాలిక రచన: నండూరు గోవిందరావు పేజీలు: 236
ధర: రూ. 200
ఫోన్: 98498 01490
సర్వధారి
సంపాదకులు: ఆచార్య మాడభూషి సంపత్ కుమార్
పేజీలు:181,ధర: రూ.150
ప్రచురణ:
సౌశీల్య ప్రచురణ
ఫోన్: 98440 15759
…? చింతలపల్లి హర్షవర్ధన్