Komuravelli Mallanna Temple | భారతీయ సనాతన ధర్మానికి మూలం వేదాలు. సృష్టి రహస్యాన్ని, మానవ జీవన విధానాన్ని తమలో ఇముడ్చుకున్న విజ్ఞాన నిధులు అవి. అలాంటి ప్రాచీన సంపదను భావితరాలకు అందిస్తున్నది కొమురవెల్లిలోని వీరశైవ ఆగమ పాఠశాల. కొండల్లో వెలసిన కొమురవెల్లి మల్లన్న భక్తులపాలిట కొంగుబంగారం. ఆయన సన్నిధిలోని ఆగమ పాఠశాల విద్యార్థులను అర్చకులుగా, పురోహితులుగా తీర్చిదిద్దుతున్నది.
తెలంగాణ ప్రాంతాన్ని పాలించినవారిలో కాకతీయులు, ఇతర రాజులు శైవ మతాన్ని ఆదరించారు. ఊరూరా శివాలయాలు కట్టించారు. కొన్ని ఆలయాల్లో వీరశైవ పూజారులు వంశపారంపర్యంగా అర్చకత్వం చేసేవారు. అయితే, కాలక్రమంలో వారంతా ఆ బాధ్యతలకు దూరమవుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో వీరశైవ ధర్మంలో వైదిక వృత్తికి ప్రాధాన్యం పెంచడమే లక్ష్యంగా 2009లో కొమురవెల్లిలో ఆగమ పాఠశాల ప్రారంభించారు. మల్లికార్జున స్వామి దేవాలయం, రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వీరశైవ పంచాచార సంప్రదాయాల ప్రకారం ఇక్కడ బోధన జరుగుతున్నది.
కొమురవెల్లి ఆగమ పాఠశాలలో ప్రవేశానికి కనీసం ఐదో తరగతి ఉత్తీర్ణులై, 14 ఏండ్లలోపు విద్యార్థులు అర్హులు. ప్రవేశం పొందినవారికి ఆరేండ్లపాటు శిక్షణ ఇస్తారు. మొదటి రెండేండ్లు అర్చక ప్రవేశం, మంత్రాలు, దేవాలయంలో నిర్వహించే పూజలు నేర్పిస్తారు. మూడో ఏడాది నుంచి అర్చవర, భాషా కర్మలు, షోడశ కర్మల గురించి నేర్పుతారు. చివరి రెండేండ్లు దేవాలయ క్రతువులు, మహోత్సవాల నిర్వహణ, కల్యాణాలు, యజ్ఞయాగాది నిర్వహణ గురించి బోధిస్తారు. జ్యోతిషం, ముహూర్తభాగం కూడా పరిచయం చేస్తారు. శైవక్షేత్రాల విశేషాలు, పురాణేతిహాసాలు చెబుతారు. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రంతోపాటు, ప్రోత్సాహకంగా రూ. లక్ష నగదు అందిస్తున్నారు.
పన్నెండేండ్లుగా ఈ ఆగమ పాఠశాల నుంచి దాదాపు 200 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. స్వగ్రామాలకు వెళ్లి ఆలయాల్లో అర్చకత్వమూ నిర్వహిస్తున్నారు. మరికొందరు పురోహితులుగా జీవనోపాధి పొందుతున్నారు. హైదరాబాద్లోని ఆలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో నిత్యపూజలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం కొమురవెల్లి పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఆగమశాస్త్రాన్ని అభ్యసిస్తున్నారు. తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర పొరుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులూ ఇక్కడ చదువుతున్నారు. విద్యార్థులకు మల్లన్న ఆలయం ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నది. విద్యార్థుల వసతి ఖర్చులను దేవాదాయ శాఖ 50 శాతం, మల్లన్న ఆలయం 50 శాతం భరిస్తున్నాయి. దాతలు నిర్మించిన కాటేజీలో పాఠశాల నడుస్తున్నది. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులరద్దీ పెరిగినప్పుడు విద్యార్థులకు సెలవులు ప్రకటిస్తున్నారు. దీనివల్ల విద్యాబోధన ఆగిపోతున్నది. ‘ఓం సహనావవతు. సహనౌ భునక్తు. సహవీర్యం కరవావహై’.. అంటూ సాగే శాంతిపాఠం సారాన్ని గుర్తుకు తెస్తుంది ఆ ఆవరణ. ‘గురు శిష్యులమైన మమ్మల్ని రక్షించు. విద్యలతో మమ్మల్ని ప్రకాశింపజేయి. త్రివిధ తాపముల నుంచి రక్షించు’ అంటూ ఆ విద్యార్థులు చేసే ప్రార్థనను మల్లికార్జునుడు ఆలకిస్తూనే ఉంటాడు.
వీరశైవ విద్యకు ఎంతో చరిత్ర ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వీరశైవ ఆగమ పాఠశాలలు రెండే ఉన్నాయి. అందులో ఒకటి శ్రీశైలంలో ఉండగా, మరొకటి కొమురవెల్లి క్షేత్రంలో ఉన్నది. పన్నెండేండ్లుగా వందలాది విద్యార్థులు ఇక్కడ ఆగమ విద్యను అభ్యసించారు. పురోహిత వృత్తిలో స్థిరపడ్డారు. అంతేకాదు, ఆగమశాస్త్ర వైభవాన్ని భావితరాలకు అందిస్తున్నారు.
– వీరేమట్ లింగవీరేశ్, అధ్యాపకుడు
✍ తుంగ పవన్ కుమార్
“మల్లన్న పట్నాలు ఎలా వేస్తారు? కొమురవెల్లి, ఐనవోలు పట్నాల ప్రత్యేకత ఏంటి?”