Health Tips | పొద్దునే లేవగానే పరగడుపున నీళ్లు తాగడం మంచి అలవాటు. ఇలా చేయడం చర్మానికి మంచిది. కిడ్నీల సమస్యలు, వాటిలో రాళ్లు ఏర్పడే ముప్పు కూడా తక్కువగా ఉంటుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎండాకాలంలో అయితే శరీరంలో తగినంత హైడ్రేషన్ ఉండటానికి దోహదపడుతుంది. రాత్రంతా నీళ్లు తాగం కాబట్టి, లేవగానే నీళ్లు తాగితే మెదడుకు తగినంత ఆక్సిజన్ సరఫరా కావడానికి నీళ్లు ఉపకరిస్తాయి. పైగా నీళ్లు శరీరంలోని మలినాలను తొలగిస్తాయి. ఇక పొద్దునే ఎన్ని నీళ్లు తాగాలంటే… నోరు శుభ్రం చేసుకున్న తర్వాత కనీసం రెండు నుంచి మూడు గ్లాసుల నీళ్లు తాగాలి. గోరువెచ్చటివి గానీ, వేడివి గానీ అయితే మరీ మంచింది. మరో మాట నీళ్లు తాగిన అరగంట తర్వాతే ఏదైనా తినాలి.
ఏడాదిపాటు వేచి చూసిన తర్వాత పండ్ల రాజు మామిడి కాలం వస్తుంది. మార్కెట్లో రకరకాల పండ్లను చూడగానే ఎవ్వరికైనా నోరు ఊరిపోతుంది. మామూలు వాళ్లయితే ఓకే! కానీ డయాబెటిస్ ఉన్నవాళ్లు మాత్రం మామిడిపండ్లు తినాలంటే రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయేమో అని భయపడతారు. అయితే, ైగ్లెసిమిక్ ఇండెక్స్ 50 కంటే తక్కువ ఉన్నవాళ్లు మామిడి పండు నిరభ్యంతరంగా తినొచ్చంటున్నారు నిపుణులు. అంతేకాకుండా మామిడిని తిన్న వెంటనే రక్తంలో ఉన్నపళంగా చక్కెర స్థాయులు ఏం పెరిగిపోవు. మామిడిలో విటమిన్ సి, ఎ, బి, కె, కాల్షియం, ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. మామిడిలో ఉండే మాంజిఫెరాన్ అనే బయో యాక్టివ్ మూలకం రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. అయితే, డయాబెటిస్ రోగులు రోజువారీగా మామిడి పండ్ల మోతాదు 100 గ్రాములకు మించకుండా చూసుకోవాలి. కాకపోతే, మామిడితోపాటు ఏదైనా ప్రొటీన్లు ఉన్న ఆహారం తింటే మంచిదట.
జంతువుల వృషణాలు, మనుషుల బొడ్డుతాడులో కంటే మూడు రెట్లు ఎక్కువగా మనుషుల వృషణాల్లో మైక్రో, నానో ప్లాస్టిక్ కణాలు ఉన్నాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఇది మే 15న ‘టాక్సికాలజికల్ సైన్సెస్’ జర్నల్లో ప్రచురితమైంది. అవి సూక్ష్మమైన ముక్కల్లాగా కనిపిస్తాయని పరిశోధకులు తెలిపారు. మన శరీరాల్లో ఎంత ప్లాస్టిక్ పేరుకుపోయి ఉంటుందనే విషయంలో ఈ అధ్యయనం మన కండ్లు తెరిపిస్తుంది. అయితే మనుషులలో వంధ్యత్వం, వృషణాల్లో క్యాన్సర్, ఇతర క్యాన్సర్ల విషయంలో ఈ సూక్ష్మ ప్లాస్టిక్ కణాల పాత్ర ఏమైనా ఉందా అనే విషయం నిర్ధారణ కోసం మరింత పరిశోధన జరగాల్సి ఉందంటున్నారు పరిశోధకులు. కాబట్టి, ఆహారంలో, ఆహారాన్ని ప్యాక్చేసే ఉత్పత్తుల్లో ప్తాలేట్స్, ఇతర రసాయనాలు లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా స్టీలు, గాజు పాత్రలు ఉపయోగించాలని చెబుతున్నారు.