Ellala Srinivas Reddy | నాన్న గవర్నమెంట్ డాక్టర్. అమ్మ ఆదర్శ రైతు. ఇద్దరి ఆశయాలను ఒంటబట్టించుకున్నారు. ఎంబీబీఎస్ చేసి పేదల డాక్టర్ అయ్యారు. లక్సెట్టిపేట నుంచి జగిత్యాల వరకు.. ఆరోగ్య, ఆర్థిక, విద్య, ఉపాధి కల్పనలో పేదలకు అండగా ఉంటున్నారు. ‘హాస్పిటల్ పెట్టి ఎంత సంపాదించినవ్?’ అని ఎవరైనా అడిగితే.. ‘డబ్బుకంటే విలువైన ఎన్నో జీవితాలను నిలబెట్టాను’ అని వినమ్రంగా పలికే డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్రెడ్డి పరిచయం..
మాస్వస్థలం ధర్మపురి. వ్యవసాయ కుటుంబం. నాన్న ఎల్లాల రాజిరెడ్డి ప్రభుత్వ వైద్యుడిగా సేవలు అందించారు. అమ్మ మొదటినుంచీ రైతు. నేను పిల్లల డాక్టర్గా స్థిరపడ్డాను. ఆ తర్వాత, మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో నా భార్య డాక్టర్ అరుణా రెడ్డితో కలిసి ఓ హాస్పిటల్ ప్రారంభించాను.
ఒకసారి.. మా దవాఖానకు ఉట్నూరు నుంచి కొంతమంది గిరిజనులు వచ్చారు. వారం రోజుల పసిబిడ్డను తీసుకొచ్చారు. ఇంట్లోనే ప్రసవం జరిగినట్టుంది. తల్లీబిడ్డల్ని వేరు చేసేందుకు బొడ్డుతాడును కత్తితో కోసి, పేడ పూశారు. ఇన్ఫెక్షన్ సోకి పరిస్థితి విషమించింది. నాకు చాలా కోపం వచ్చింది. అంతలోనే ‘పాపం! వాళ్లకేం తెలుసు? అయినా, తగిన వైద్య సౌకర్యాలు ఉంటే అలా చేసేవారా?’ అనిపించింది. వెంటనే వైద్యం ప్రారంభించాను. పదిరోజుల తర్వాత ఆ పసిపాపను ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించాను. ఆ ఖర్చులు కూడా చెల్లించుకోలేని పరిస్థితి వారిది. ఎలాంటి ఫీజూ తీసుకోవద్దని మావాళ్లకు చెప్పి పాపను ఆరోగ్యంగా ఇంటికి పంపాను. వృత్తికి న్యాయం చేసిన సంతృప్తి కలిగింది. ఆ తర్వాత, ప్రతి ఆదివారం అటవీ గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి పేదల ఆరోగ్యానికి భరోసా ఇవ్వగలిగాం.
శిబిరాల కోసం గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు చాలా విషయాలు తెలిశాయి. అవగాహన లేక కొందరు, ఆర్థిక ఇబ్బందులతో కొందరు చదువులకు దూరంగా ఉంటున్నారని గుర్తించాను. గ్రామీణ, అటవీ ప్రాంతాల పిల్లలకు విద్యను అందిస్తే అద్భుతాలు సాధిస్తారని అనిపించింది. బడి వయసు పిల్లలను బడిలో చేర్పించి, మేమే ఫీజులు కట్టడం ప్రారంభించాం. ఆర్థిక ఇబ్బందుల వల్ల టెన్త్, ఇంటర్తో చదువు ఆగిపోయిన అమ్మాయిలకు ఆర్థిక సహాయం చేస్తూనే, ప్రైవేట్ హాస్పిటళ్లలో నర్సులుగా ఉపాధి కల్పించాం. మా ఆవిడ గైనకాలజిస్టు, నేను పిల్లల వైద్యుడిని కావడం వల్ల ప్రాక్టీస్తోపాటు సిబ్బంది సంఖ్య కూడా పెరిగింది. అర్ధంతరంగా చదువు ఆగిపోయిన ఎంతోమంది విద్యార్థులు తిరిగి చదువుకోవడం మొదలుపెట్టారు.
ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన నల్ల గంగాధర్ అనాథ. ఐఐటీ ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ సాధించాడు. ఎన్ఐటీలో సీట్ వచ్చింది. ప్రవేశ రుసుము రూ. 54వేలు. ఆ మొత్తం కూడా చెల్లించలేని పరిస్థితి తనది. దీంతో గంగాధర్ బాధ్యత నేనే తీసుకొన్నాను. కాలేజీలో చేర్పించాను. ఎందుకంటే, జీవితాలను మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది.
మా పిల్లల చదువుకోసం 2011లో లక్సెట్టిపేట నుంచి జగిత్యాలకు హాస్పిటల్ను మార్చాం. ఇక్కడ కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ వచ్చాను. నేను ఈ వృత్తిలోకి వచ్చి పదిహేడేండ్లు అవుతున్నది. ఇప్పటివరకు దాదాపు మూడువేల మంది విద్యార్థులకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాను. మా హాస్పిటల్లో నిరుపేదలకు ఫీజులు తీసుకోకుండానే చికిత్స చేస్తున్నాం. దాదాపు 250 ఉన్నత పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో లీడ్ ఇండియాతో కలిసి అవగాహన తరగతులు నిర్వహించాం. 300ల మందిని ఐఐఐటీ, ఐఐటీ దిశగా నడిపించాం. ప్రస్తుతం నలుగురికి సివిల్స్ కోచింగ్ ఇప్పిస్తున్నాం. మారిన ప్రతి జీవితం నాకు ఎనలేని సంతృప్తిని ఇస్తుంది. మరింత మందికి సేవ చేయాలన్న సంకల్పాన్ని ప్రసాదిస్తుంది. ఇంతకంటే ఏం కావాలి? నా జన్మ చరితార్థకం.
…? కొత్తూరి మహేశ్ కుమార్
టాలీవుడ్ మొదలు బాలీవుడ్ స్టార్స్ అందరితో ఇన్స్టా రీల్స్ చేయించగలిగే ఈ అమ్మాయి ఎవరో తెలుసా!!”
“అమెరికా వర్జీనియాలో వ్యవసాయం చేస్తున్న తెలంగాణ మహిళ”
“అన్నదాతలకు అండగా నిలబడిన హైదరాబాదీ ఆడబిడ్డ.. ఆమె ఏం చేస్తుందంటే..”
“Kanna Ooru | ఒక్క జిల్లా నుంచి ఎస్సై జాబులు కొట్టారు.. కన్న ఊరు రుణం తీర్చుకుంటున్నారు”