Purple Mango | తియ్యతియ్యగా నోరూరించే మామిడి పండంటే ఎవరికైనా ఇష్టమే. ఆ పండ్ల రాకకోసమే మండుటెండల్ని పండువెన్నెల్లా స్వాగతించేవారూ ఉన్నారు. లోకో భిన్న రుచిః అన్నట్టు, మామిడి పండ్లలోనూ అనేకానేక రుచులు. మనం తినే పసుపు పచ్చ మామిడికి భిన్నంగా ఊదా రంగులోనూ కాస్తున్నాయి. వీటి రూపులాగానే ఖరీదూ ప్రత్యేకం. ఈ రకం పండ్లు కిలో దాదాపు 3 లక్షల రూపాయలు పలుకుతున్నాయి!
వేసవికి ముందు వచ్చే పుల్ల మామిడి పండ్ల నుంచి చిరుజల్లుల్లో తడిసిన చివరి పండుదాకా ప్రతి దశలోనూ రుచి చూసే అభిమానులు ఎంతోమంది. బంగినపల్లి, తోతాపురి, రత్నగిరి అల్ఫాన్సో, హిమాయత్… ఇలా మనదేశంలో దాదాపు 1,500 రకాల మామిడి పండ్లు పండుతాయి. భారతీయులు తినగా మిగిలిన మరో 60వేల టన్నుల పండ్లు ఎగుమతి అవుతున్నాయి. అయితే వీటన్నిటిలోకి అత్యంత ఖరీదైన ఊదా రంగు మామిడి పండు ఇప్పుడిప్పుడే మనదేశంలో పండుతున్నది.
నిండైన ఊదా రంగులో చూసేందుకు ప్రత్యేకంగా కనిపించే ఈ పండును పర్పుల్మ్యాంగో, మియాజకి మ్యాంగో అనీ పిలుస్తారు. తయా-నో-టొమాగో, ఎగ్స్ ఆఫ్ సన్షైన్గానూ వీటికి పేరుంది. కాయగా ఉన్నంత వరకూ ఊదా రంగులో ఉండే ఈ మామిడి రకం బాగా పండాక కెంపు వర్ణంలోకి మారిపోతుంది. రాక్షసబల్లి గుడ్డు ఆకృతితో సూర్యోదయపు ఛాయలో కనిపించడం వల్ల ఈ పండ్లను ఎగ్స్ ఆఫ్ సన్షైన్గా పిలుస్తారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మామిడి పండ్లుగా ఇవి ప్రసిద్ధి చెందాయి. రూపురేఖలే కాదు వీటినుంచి వచ్చే తియ్యటి వాసన కూడా విభిన్నంగా ఉంటుంది. జెల్లీలా మెత్తటి గుజ్జుతో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ప్రత్యేకమైన రుచితో ఉంటాయివి. అయితే వీటి ఖరీదుకు రుచికన్నా వీటిని పండించడం వెనక ఉన్న శ్రమే కారణం. నాటినప్పటి నుంచీ ఈ మొక్కలను ప్రత్యేక శ్రద్ధతో పెంచాలి. సూర్యరశ్మి, వర్షపాతం సరైనంతగా అందాలి. ఎక్కువ కాలంపాటు వేడి వాతావరణం ఉండాలి. ఉష్ణోగ్రత ఈ పండ్ల ఉత్పత్తి మీద అధిక ప్రభావం చూపుతుంది. దీంతో వీటిని పాలీహౌజ్లలోనే పెంచుతారు. పిందెలు వేశాక వాటిని గుత్తులు గుత్తులుగా పెరగనివ్వరు. బాగా పరిశీలించి అత్యంత ఆరోగ్యంగా ఉన్న పిందెను ఎంపిక చేసుకుని ఒక్కో కొమ్మకు ఒక్కో పిందె మాత్రమే ఉంచి, మిగతావాటిని తుంచేస్తారు. అలా ఒక్కో కొమ్మకూ మిగిలిన కాయకు చుట్టూ వలలాంటి దాన్ని ఏర్పాటుచేస్తారు. దీనివల్ల సూర్యరశ్మి పండు మొత్తం సమానంగా పడి కాయంతా మంచి రంగు వస్తుంది. ఆ వలలను కూడా దారాలతో వేలాడదీస్తారు. దానివల్ల కాయ పండినా రాలి కిందపడకుండా వలలోనే వేలాడుతూ ఉంటుంది.
కేవలం చెట్టు మీద పండి రాలితేనే ఆ పండుకు సరైన రుచి, పోషక విలువలు వస్తాయంటారు నిపుణులు. అలా పండినా సరే ప్రతి పండూ లక్షలు పలకదు. పండు బరువు కనీసం 300 గ్రాములు ఉండి, పండంతా ఒకే వర్ణంలో కనిపిస్తూ, చక్కెర స్థాయులు 15 శాతం దాటితేనే దానికి మేలైన విలువ. అలాంటి పండ్లే కిలో ఎనిమిది, తొమ్మిది వేలు మొదలు మూడు, నాలుగు లక్షల దాకా పలుకుతాయి. అందుకే విదేశాల్లో వీటిని బహుమతులుగా ఇచ్చి పుచ్చుకుంటారు. జపాన్లో మియాజకి ప్రాంతంలో ఈ పండ్లు అధికంగా పండుతాయి. ప్రస్తుతం భారత్ సహా ఫిలిప్పీన్స్, థాయిలాండ్, బంగ్లాదేశ్లోనూ కాస్తున్నాయి. ఆ మధ్య, మధ్యప్రదేశ్లో ఓ జంట ఈ రకానికి చెందిన రెండు మామిడి చెట్ల కోసం నలుగురు మనుషులూ, ఆరు కుక్కలను కాపలాగా పెట్టడంతో వీటి ప్రత్యేకత వార్తల్లోకెక్కింది.
“మామిడి పండ్లతో ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గి పట్టులా మారతాయి”
Mangoes | కార్బైడ్తో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి”
“ఒక్క మామిడి పండు ధర రూ.వెయ్యి పైనే!”
కిలో రూ . 2.7 లక్షలు పలికే మామిడి రకం..భారత్లో ఎక్కడ దొరుకుతాయో తెలుసా..!”
“మామిడి పండ్లు తినగానే ఆ ఐదింటి జోలికి అసలే పోవద్దు..!”