న్యూఢిల్లీ : మామిడి పండ్లు అనగానే మనకు బంగినపల్లి, అల్పాన్సా, లంగ్దా వంటి ఎన్నో రకాల పండ్లు నోరూరిస్తుంటాయి. అసలు ప్రపంచంలోనే అత్యధిక ధర పలికే మామిడి పండు ఎక్కడ పండిస్తారో, దాని ధర ఎంతో తెలిస్తే అవాక్కవాల్సిందే. పర్పుల్ మ్యాంగోగా పేరొందిన మియజకి మ్యాంగో ప్రపంచంలోనే అత్యధిక ధర పలికే పండుగా పేరొందింది. జపాన్లోని మియజకి నగరంలో ఇవి అధికంగా కాపుకొస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో మియజకి మామిడి కిలోకి రూ 2.70 లక్షల ధర పలుకుతోంది.
ఈ రకం మామిడికి చెందిన రెండు చెట్లు మధ్య ప్రదేశ్లోని జబల్పూర్లో పెరుగుతున్నాయి. ఈ చెట్లను సెక్యూరిటీ సిబ్బంది, కుక్కలను ఏర్పాటు చేసి మరీ ఏపుగా పెంచుతున్నారు. ఈ మామిడిని టైయా నో టొమాగో బ్రాండ్ పేరుతో విక్రయిస్తుంటారు. ఈ రకం మ్యాంగోలను ఎగ్స్ ఆఫ్ సన్షైన్ అని కూడా పిలుస్తారు. ఈ మామిడి పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండదు. పండినప్పుడు ఈ మామిడి పర్పుల్ రంగులోకి మారి ఆకారం డైనోసార్ ఎగ్స్ను మరిపిస్తుంది. ఈ మామిడి రంగును బట్టి దీన్ని డ్రాగన్స్ ఎగ్ అని కూడా అంటుంటారు. ఈ మామిడి పండ్లు ఒక్కోటి 350 గ్రాముల బరువుంటుంది.
సాదారణ మామిడి రకంతో పోలిస్తే వీటిలో 15 శాతం చక్కెర కంటెంట్ అధికం. మియజకి మామిడి అధికంగా జపాన్లో పండుతుంది. 1970, 80 ప్రాంతాల నుంచి మియజకి మామిడి మియజకి నగరంలో సాగవుతోంది. ఈ ప్రాంతం ఈ తరహా మామిడి రకానికి అనుకూలమైన వాతావరణం, సానుకూల వర్షపాతం వంటి సానుకూల అంశాలను కలిగిఉంది. ఇక జబల్పూర్లో ఈ తరహా మామిడి చెట్లను పెంచుతున్న వారు తమకు ఇది ప్రపంచంలోనే అత్యధిక ధర పలికే మామిడి రకం అని తెలియదని, తాము రైలులో వస్తుండగా ఓ వ్యక్తి ఈ మొక్కలను ఇచ్చాడని చెబుతున్నారు. ఈ రకం మామిడికి వారు దామిని అని పేరు పెట్టారు. తొలి పండును దేవుడికి సమర్పిస్తామని వారు చెప్పుకొచ్చారు.