బిర్రుగ మందుతాగి.. మిక్సింగు పాటలతో, కిర్రాక్ డ్యాన్సింగులతో ఊర్లె జనానికి ఉచిత వినోదం పంచి.. అలిసిపోయి, రాత్రి తొమ్మిదింటికి కాళ్లీడ్సుకుంటూ ఇంటికొచ్చిండు నాటుకోళ్ల కోటేశు.
కాళ్లూచేతులూ, మొఖం కడుక్కొని లోపలికొచ్చిండు. కోటేశు ఆంజనేయస్వామికి వీర భక్తుడు. గోడకున్న స్వామి పటానికి దండం పెట్టుకున్నడు. తనకోసమే ఎదురుచూస్తున్న భార్య శాంత కాడికొచ్చి, రేప్పొద్దటికి ఉతారకోసం తెచ్చుకున్న చీప్ లిక్కర్ బాటిల్ను ప్యాంటు జేబులోంచి తీసి, భార్య చేతికిస్తూ..
“భద్రంగ పెట్టు” అన్నడు.
ఆమె బాటిల్ను గూట్లె పెట్టొచ్చి.. “అన్నం పెట్టనా..? తింటవా..?” అని అడిగింది.
కొడుకును యాదికి తెచ్చుకొని..
“మా నాయ్న, అరవిందు వచ్చిండా..?”
అనడిగిండు కోటేశు.
“వచ్చిండుగని, అన్నం పెట్టనా..?
తిని పంటవా..?” అంది మళ్లీ.
“మా నాయ్న తిన్నడా..?”
“ఆ! తిన్నడు.. పన్నడు!” అంది శాంత.
కొడుకు పండుకున్న మంచం కాడికిపోయి కింద కూకున్నడు. కొడుకు కాళ్లు పట్టుకొని..
“నాయ్నా అరవిందూ.. నన్ను మాఫ్జెయ్యి కొడుకా! అక్క పెండ్లికి చేసిన అప్పు తీర్చలేక, నీ చదువు మాన్పించి పనిలో పెట్టిన. నాలాంటి బేవార్సు తండ్రి ఏ కొడుక్కూ ఉండద్దు బిడ్డా.. గా బాధను తట్టుకోలేక, బయటికెవరికీ చెప్పుకోలేక మందు తాగుతున్న. నన్ను మాఫ్జెయ్యి కొడుకా!” అంటూ ఏడ్వబట్టిండు.
“ఓ అయ్యా.. నీ ఏడ్పు ఆపు! ఆడి నిద్ర చెడగొడ్తవా ఏంది?” అంటూ కోటేశును లేపింది. పట్టుకొచ్చి కుర్చీల కూకోబెట్టింది.
“గింతన్నం సల్లల గలిపియ్యన్నా..?
తాగి పంటవా?” అని అడిగింది.
‘తాగుతా’ అన్నట్లు తలూపిండు కోటేశు.
అన్నం కలిపిన సల్లను తాగిపించి, బయటి వాకిలి ముందు గడెమంచం ఏసింది. తాగడానికి మంచినీళ్లు పెట్టి, కోటేశును పట్కపోయి మంచం మీద కూకోబెట్టింది.
“ఇంక పండుకో!” అని ఇంట్లకుపోయింది.
పొలాలమీంచి సల్లటి గాలొత్తదని శానామంది బయట్నే పండుకుంటరు.
కోటేశుకూ అదే అలవాటు.
వేలికున్న ఆంజనేయస్వామి ఉంగరాన్ని ముద్దువెట్టుకొని మంచమ్మీదికి ఒరిగిండు. బజార్ల ఆడిపాడి, ఎగిరి దుంకి అలసి ఉంటాన, ఎంటనే నిద్ర వట్టింది.
ఎవరో తరుముతున్నట్లు సుక్కపొద్దున్నే మెలుకువ అచ్చింది కోటేశుకు. ఆకాశంలో సుక్కలు మెరుస్తున్నయ్. కరెంటు లేదు. శిమ్మ శీకటి. రాత్రి జరిగింది యాదికొచ్చి, ధిగ్గున లేసి కూకుండు. దూపైతుంటే.. మంచం కిందున్న చెంబు తీసి నీళ్లు తాగిండు. సల్లని చెమటలు పడ్తున్నయ్. రాత్రి జరిగింది మళ్లోసారి యాదికి దెచ్చుకున్నడు.
కలకాదు.. నిజమే!
రాత్రి తను నిద్రబోయిన కొద్దిసేపటి తర్వాత ఎవరో తట్టి లేపుతున్నరు.
“భక్తా.. భక్తా..” పిలుస్తున్నరెవరో.. తొలుత కలలో అనుకున్నడు. కానీ, కలకాదు.
“భక్తా.. కోటేశు.. లే నాయనా!” పేరుతో పిలిచేటప్పటికి బలవంతంగా కండ్లు తెరిచిండు. ఎదురుగా నమ్మలేని దృశ్యం. కరెంటు లైట్ల కాంతిలో ధగధగా మెరిసిపోతూ.. గదాధారుడైన ఆంజనేయస్వామి.
స్వామి ప్రసన్నంగా.. “లెమ్ము భక్తా.. భయపడకుము. నేను నీ ఆరాధ్య ఆంజనేయుడను. లే నాయనా!” అని అభయ హస్తం చూపించిండు స్వామి.
తను గభాల్న లేచి రెండు చేతులూ జోడించి దండం పెట్టిండు.
“స్వామీ.. మీ ప్రత్యక్ష దర్శనభాగ్యం.. నమ్మలేకపోతున్నాను స్వామీ!” అన్నడు కోటేశు.
“భక్తా! మద్యానికి బానిసవై సంసారాన్ని దరిద్రంలోకి నెట్టుకుంటున్నావు కదూ!” అన్నాడు స్వామి.
తన రెండు చేతులతో చెంపలు వేసుకొని.. “అవును స్వామీ! తప్పుడు మనిషిని.. తప్పు చేస్తున్నాను. మాఫ్ జెయ్యండి స్వామి!”
“క్షమించితిని! ఈ రోజు నుంచి మద్యము తాగుటను మానివేయవలె! అర్థమైనదా?”
“అర్థమైంది స్వామి! మందు మానేస్తా”
“అంతేకాదు భక్తా! నీ కూతురి వివాహం కోసం చేసిన అప్పు తీర్చడానికి నీ కుమారుడిని పనిలో పెట్టావు. పిల్లాడిని చదువు మాన్పించి పనిలో పెట్టడం మంచిదికాదు. వెంటనే నీ కుమారుని బడికి పంపుము. అప్పుడే నీ సమస్యలు అన్నీ తీరిపోతాయి. నా ఆశీస్సులు నీకు తోడుగా ఉంటాయి. అర్థమైందా..?”
“మీరు చెప్పినట్టే నడుసుకుంటా స్వామి!” అంటూ స్వామికి పాదాభివందనం చేసేందుకు కిందకు వంగాడు. ఆశ్చర్యం! స్వామి కాళ్లకు పాదుకలు ఉండాల్సిన చోట.. తల పైకెత్తి స్వామిని చూడబోయాడు. అంతే.. కండ్లముందు తెల్లని మబ్బులాంటిది కదిలినట్టయింది. కండ్లు మత్తుగా మూసుకుపోతున్నయ్. స్వామివారే తన భుజం పట్టుకొని మంచమ్మీద పడుకోబెడుతూ..
“ఇక సుఖముగా నిద్రపొమ్ము భక్తా!” అన్నారు. ఆ మాటలు మాత్రమే యాదికున్నయ్. తను మైకంలకు జారిపోయిండు. తిరిగి ఇప్పుడు మెలుకువ వచ్చింది.
‘నిజంగా ఆంజనేయస్వామి ప్రత్యక్షమైండా?’ అనుకున్నడు. అది అసాధ్యం.
‘మరైతే.. ఈ ఆంజనేయస్వామి ఎవరు? ఎవరైనా స్వామి వేషం కట్టుకొని వచ్చింర్రా..? అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఎవరికుంది? నా మంచి, నా భార్యాపిల్లల మంచి ఎవరిగ్గావాలె? నేనెవ్వరికీ ఏ సహాయం చేసిందీ లేదు. అదిగూడా నేను ఇష్టపడే ఆంజనేయస్వామి వేషంలో వచ్చి..’ ఇట్లా ఆలోచిస్తూ కూర్చున్న కోటేశుకు దస్తగిరి యాదికొచ్చిండు.
చాలాకాలం కిందటి సంగతి. దస్తగిరి ఈ ఊర్లెనే టైలర్ పనిచేసేటోడు. తనకంటే పెద్దోడైన దస్తగిరిని ‘బావా’ అని, అతని భార్య ఆయేషాను ‘అక్కా’ అని పిల్సేటోడు కోటేశు. ఇద్దరూ మంచి దోస్తుల్లెక్క ఉండేటోళ్లు. దస్తగిరి మంచి టైలరే కాదు, అంతకంటే మంచి రంగస్థల పౌరాణిక నటుడు కూడా. తను ఆంజనేయస్వామి పాత్రకు పెట్టింది పేరు. ఆ పాత్ర చేయడం దస్తగిరికి ఎంత ఇష్టమంటే.. తన సొంత డబ్బులతో గదతోసహా అలంకరణకు కావాల్సినవన్నీ కొనుక్కున్నడు. ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ నాటకంలో ఆంజనేయస్వామి పాత్ర కట్టిండంటే.. సాక్షాత్తూ స్వామే దిగి వచ్చినట్టు ఉండేది. అసొంటి దస్తగిరి, తన మూలంగానే ఊరిడ్సి ఎల్లిపోయిండు.
అప్పట్లో కోటేశుకు కూడా ఆంజనేయుడి పాత్రలో పద్యాలు, డైలాగులు నేర్చుకొని, దస్తగిరి కంటే మంచిగ నటించాలని ఉండేది. నాటకం నేర్పే హార్మోనియం పంతులు ఎంత నేర్పినా రాగం, పద్యం అబ్బలేదు. ‘రెండు పెగ్గుల మందు తాగితే స్వరం తెగి, రాగం వస్తది’ అని ఎవరో అంటే.. మందు తాగడం మొదలుపెట్టిండు. అయినా, స్వరం తెగలే.. రాగం అబ్బలే!
‘మన కోటేశుకు పద్యం అబ్బలేదు గనీ, మద్యం అబ్బింది’ అని నవ్వుకునేటోళ్లు ఊర్లె కొంతమంది.
ఆ యేడుకూడా శివరాత్రి జాతరొచ్చింది. ఆ రోజు రాత్రి ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ నాటకముంది. తనలో ఏదో వెలితి. ఆంజనేయుడి పాత్ర వేయడం లేదని.
అదేరోజు సాయంత్రం కోటేశు దోస్తు ప్రేమ్సాగర్ ఫోన్ చేసిండు..
“మా ఇంటికి సుట్టం వచ్చిండు. దావత్ చేసుకుంటున్నం. నువ్వూ రారా” అని అన్నడు.
వాళ్లింటికెళ్లిండు కోటేశు. అక్కడ ప్రేమ్సాగర్తోపాటు ఆయన సుట్టం, మరో ముగ్గురు కొత్తోళ్లున్నరు. అందరూ కల్సి మస్తు మజా చేస్తూ, మందు తాగింర్రు. ఎంత తాగింర్రంటే.. మాట్లాడుతంటే నాలుక మడత పడేంత. అప్పుడే ప్రేమ్సాగర్ సుట్టం ఆరోజు ఊర్లె ఉన్న ‘నాటకం’ కరపత్రాన్ని చదువుతూ.. “ఆంజనేయుడు – గాన గంభీర షేక్ దస్తగిరి” అని చదివి కాసేపు ఆగిండు..
మళ్లీ తనే.. “చ్ఛ.. చ్ఛ.. ఇదే మన వెర్రితనం. మన దరిద్రం. మన ఆంజనేయస్వామి పాత్రను ఒక ముస్లిం వేయడానికి వాడికెంత ధైర్యం? ఇది మనందరికీ అవమానమా? కాదా?” అని అడిగిండు.
మద్యం మత్తులో ఉన్న మిగతావాళ్లంతా “అవును మనకు అవమానమే!” అన్నరు.
“అసొంటి అవమానం మనం ఎందుకు భరించాలె? వాడిని నాటకం ఆడకుండా ఆపాలె” అన్నడు.
“అవును! ఆపాల్సిందే!” అన్నరు అందరూ.
“అయితే పదండి!”.. అనంగనే అందరూ కల్సి నాటకం దగ్గరికి వచ్చింరు. అక్కడ ప్రేక్షకులు ఏకాగ్రతగా నాటకాన్ని చూస్తున్నరు. అప్పుడే ఆంజనేయుడి పాత్రలో నటిస్తున్న దస్తగిరి పద్యం అందుకున్నడు..
“బండనభీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణ తూణకోదండ కళా ప్రచండ భుజతాండ కీర్తికిన్.. రామమూర్తికిన్” అంటూ శ్రీరాముడిని కీర్తిస్తూ.. శంకరాభరణం రాగంలో నాలుగో శృతిలో పద్యం పాడితే స్టేజీ అదిరిపోయింది. ప్రేక్షకుల్లో అద్భుతమైన స్పందన. చప్పట్లు, కేకలు, ఈలలతో హోరెత్తిపోయింది.
మత్తులో ఉన్న మందు పార్టీ బ్యాచ్కు ప్రేమ్సాగర్ సుట్టం రెచ్చగొట్టుడు ఎక్కువైంది. కోటేశులో కూడా ఏ మూలనో అణిగి ఉన్న ఈర్ష్య రాజుకుంది. తాగి వచ్చిన అందరూ కలిసి ఒక్కపాలి స్టేజీ ఎక్కింర్రు. కోటేశు మైక్ అందుకొని..
“మనూరి జనులారా ఇనండి! ఇక్కడ మనందరికీ అవమానం జరుగుతంది. ఒక ముస్లిం వ్యక్తి, మన ఆంజనేయ స్వామి ఏషం కట్టి, మన సమాజానికి అవమానం జేస్తుండు. ఇంక ఈ అవమానం జరుగడానికి వీల్లేదు. అందుకే, ఈ నాటకం జరుగడానికీ వీల్లేదు. ఇంక జరుగదు. అంతే.. అందరూ ఎవరిండ్లకు వాళ్లు ఎల్లిపోండని మనవి” అని చెప్పి, మైక్ కట్ చేసిండు. ఆ బ్యాచ్లో ఒకడు ఆంజనేయుడి వేషధారణలో ఉన్న దస్తగిరి దగ్గరికి వెళ్లి, తోక కత్తిరించిండు. ఇంకొకడు కిరీటం పీకేసిండు. ఒకడు విగ్గు, మరొకడు గద గుంజుకొని నేలకేసి కొట్టింర్రు. స్టేజీ కర్టెన్లు, కరెంటు కనెక్షన్ పీకేసింర్రు. ఏం జరుగుతుందో తెల్వక జనం ఎటోళ్లటు ఎల్లిపోయింర్రు.
చిందరవందరగా పడి ఉన్న తన క్యాస్టూమ్స్ను ఏరుకొని, బ్యాగులో పెట్టుకొన్నడు దస్తగిరి. అవమానభారంతో కంటనీరు పెట్టుకుంటూ, చీకట్లోనే ఇంటికెళ్లిపోయిండు.
మర్నాడు.. అన్నివర్గాల పెద్దలు జమైంర్రు.
“కళలకు, కళాకారులకు కులమతాలు అంటగట్టడం తప్పు. దస్తగిరి మంచి నటుడు. ఆయనకు ఇలా జరుగడం బాధాకరం” అంటూ అందరూ రాత్రి జరిగినదాన్ని ఖండించింర్రు.
‘ఇలాంటి కులమతాల వేర్పాటు ఆలోచనలు మన ఊరోళ్లవి కావు. బయటి వ్యక్తి పెట్టిన చిచ్చు. మన మధ్య విభేదాలు సృష్టించే చీడ పురుగు మన ఊర్లె ఎవరింటికొచ్చిండో..? వాణ్ని లాక్కొచ్చి నడి బజాట్లే మక్కెలిరగ దన్నాలె. ముక్కు నేలకు రాయించి, బట్టలూడదీసి ఊర్లెకెళ్లి ఎల్లగొట్టాలె’ అని తీర్మానించింర్రు.
ఈ వార్త తెలుసుకున్న ప్రేమ్సాగర్ సుట్టం పరార్ అయ్యిండు. ప్రేమ్సాగర్, కోటేశు కూడా వారం పదిరోజులు ఊర్లె ఎవ్వలకూ కన్పించలే. కానీ, ఆత్మాభిమానమున్న దస్తగిరి అవమాన భారాన్ని తట్టుకోలేక తనకున్న రెండెకరాల భూమిని, సొంతింటినీ అమ్ముకొని, భార్యా పిల్లల్నీ తీసుకొని ఊరిడ్సి ఎల్లిపోయిండు. ఇది జరిగి పదిహేనేండ్లు దాటింది. తిరిగి దస్తగిరి ఊర్లెకడుగు పెట్టలేదు. ఊరిడ్సి పోయేటప్పుడు దస్తగిరికి ఆరేండ్ల, ఐదేండ్ల వయస్సున్న ఇద్దరాడపిల్లలు. ఆర్నెళ్ల కిందటే గుండెపోటచ్చి దస్తగిరి కాలం జేసిండని తెల్సింది.
‘మరి తనకు రాత్రి దర్శనమిచ్చిన ఆంజనేయస్వామి ఎవరు?’ ఇట్లా ఆలోచిస్తూ కూకున్న కోటేశుకు తేటగ తెల్లారిన సంగతి కూడా ఎర్కగాలె..
“ఓ అయ్యా! ఇంకలే..” అన్న శాంత మాటల్తో.. ఆ ఆలోచనలకెల్లి బయటపడ్డడు. ఇంట్లకు పొయ్యి మొఖం కడుక్కొని, తానంజేసచ్చి కూకున్నడు.
కోటేశు రాత్రి ఇచ్చిన లిక్కర్ బాటిల్, గిలాస, నీళ్లు, నంజుకోవడానికి గిన్నెల కొంచెమంత శింతకాయ తొక్కు పట్టుకచ్చింది శాంత. కోటేశు దగ్గరున్న స్టూల్మీద పెట్టి, ఎన్కకు దిరిగింది.
కోటేశుకు పొద్దున్నే గింత ఉతార తాగి, రెండు ముద్దలు అన్నం తిని, నాటుకోళ్ల బేరానికి పోవుడు అలవాటు. కానీ, రాత్రి జరిగిన సంఘటనతోని ఒక నిర్ణయానికొచ్చిండు. ఎన్కకు దిరిగిపోతున్న శాంతను పిల్సిండు. ‘ఏంది’ అన్నట్లు ఆమె వచ్చి కోటేశు దగ్గర నిల్సుంది.
“ఇయ్యాల్టికెళ్లి నేను తాగుడు బంద్జేత్తున్న. ఈడికెళ్లి మందుసీస తీసేసి, గింత సద్దన్నం ఉంటె పెట్టు. తిని బేరానికి పోత” అన్నడు.
తను విన్నది నిజమో.. అబద్ధమో.. అర్థం కాక కోటేశుకెళ్లి చూస్తూ నిలబడ్డది శాంత.
కోటేశు మళ్లీ అదే చెప్పిండు. శాంత అక్కడికెళ్లి అవన్నీ తీసేసి, అన్నం పట్టుకొచ్చింది. అన్నం తిని, చేతులు కడుక్కున్నంక..
“ఇగో.. అరవిందు ఇంటికొచ్చినంక, రేపటికెళ్లి పనికి బోవద్దని చెప్పు. ఆ విషయం వాళ్ల సేటుకు శెప్పుమను. బడికి పోయి వాని సదువు సంగతి చూస్కోమని చెప్పు” అన్నడు.
“మరి.. అప్పు..?” అనడిగింది శాంత.
“నేనే తీరుస్త!” అని చెప్పి, కోళ్లబుట్ట కట్టిన మోపెడ్ తీసుకొని బేరానికెళ్లిపోయిండు కోటేశు. భర్తలో వచ్చిన ఈ మార్పేందో అర్థం కాక, భర్త పోయిన దిక్కే సూస్తూ నిలబడింది శాంత.
కోటేశు మందు మానేసి రెండు వారాలయ్యింది. ఆ సంగతి ఊరంతా ఎర్కయ్యింది.
‘గవర్నమెంటు ఆదాయానికి గండికొట్టి, రాజద్రోహ నేరం జేసిండు కోటేశు’ అంటూ జోకులేస్కొని నవ్వుకున్నరు కొంతమంది.
ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా, తన బేరమేదో తను చేసుకుంటున్నడు. కానీ, ఆ రాత్రి ‘తనకు దర్శనమిచ్చిన స్వామి ఎవరు?’ అనే ప్రశ్న కోటేశు బుర్రలో తిరుగుతనే ఉన్నది.
ఒకరోజు కోళ్ల బేరానికి మిర్యాలగూడకు బోయి, తిరిగి ఇంటికొస్తూ మధ్యలో చాయ్ తాగుదమని దామరచర్లలో ఆగిండు. హోటళ్లకు బోయి, చాయ్ ఆర్డరిచ్చిండు. అదే బెంచిమీద కూకున్న ఓ ఫొటోగ్రాఫర్ బ్యాగులకెళ్లి ఫొటోల కట్ట తీసి, లెక్కబెట్టుకుంటుండు. అండ్లకెళ్లి ఒక ఫొటో జారి కోటేశు కాళ్లకాడ వడ్డది.
“అన్నా.. జర గా ఫోట్వ తీసియ్యవా..?” అని అడిగిండు ఆ ఫొటోగ్రాఫర్.
వంగి ఫొటో తీసిన కోటేశు, దాన్ని అతనికిస్తూ ఫొటోవంక చూసిండు. ఒక్క క్షణం ఆశ్చర్యంతో కండ్లెళ్లబెట్టిండు. ఆ ఫొటో.. ఆ రాత్రి తనకు దర్శనమిచ్చిన ఆంజనేయస్వామిది.
‘ఆ ఫొటో ఎవరిదో’ అడిగి తెల్సుకున్నడు. అతని అసలు పేరు తెల్వదనీ, అందరూ ‘టిల్లు’ అని పిలుస్తరని చెప్పి, అడ్రస్ కూడా ఇచ్చిండు ఆ ఫొటోగ్రాఫర్.
ఇంతలో చాయ్ తాగి, బయటకచ్చిండు కోటేశు. బండి స్టార్ట్ చేసి, ఐదు నిమిషాలల్ల అతను చెప్పిన అడ్రస్ కాడికొచ్చిండు. అక్కడ ఒక లేడీస్ టైలర్ షాప్ కన్పిస్తే.. టిల్లు గురించి అడుగుదామని షాప్కాడికి వచ్చిండు. అప్పుడే లోపటంగ ఒకామె వచ్చి, మిషిన్ కుట్టే స్టూలుమీద కూకుంటూ కోటేశు వంక చూసింది. ఆమెను సూడంగనే కోటేశుకు భయమైంది.
‘ఇక్కడికి ఎందుకచ్చిన్నా..?’ అని అనుకున్నడు. అంతల్నే ఆమె గుర్తువట్టి..
“కోటేశు కదా..? నువ్వు” అని అడిగింది.
“సలాం అక్కా.. కోటేశునే!” అన్నడు.
ఆమె టైలర్ దస్తగిరి భార్య ఆయేషా.
“రా తమ్మీ రా.. కూకో! బాగ ఎండల పడి వచ్చినవ్! ఎన్నాళ్లకు కనవడ్డవ్ తమ్మీ! కూకో మంచినీళ్లు దెస్త” అంటూ లోపలికి పోయింది.
కోటేశు షాప్లకచ్చిండు. ‘మంచి నీళ్లిచ్చినంక, గతంలో తను అవమానపర్చిన సంఘటన గుర్తుచేసి, తిట్టి, నానా శాపనార్థాలు పెడ్తదేమో?’ అనుకుంటూ భయపడుకుంటనే కూకున్నడు.
ఇంతల్నే ఆయేషా నీళ్లు తెచ్చిచ్చింది.
‘తిడ్తె తిట్టనీ. నేను నిజంగనే తప్పు చేసిన. ఏదంటే అది అననీ’ అనుకున్నడు కోటేశు.
“శాంత మంచిగున్నదా.. తమ్మీ! బిడ్డ పెండ్లి చేసినవంట కదా..?” అనడిగింది.
గతంలో ఏమీ జరుగనట్టు.
ఎంతో ఆత్మీయంగా ఆమె తన కుటుంబం గురించి అడుగుతుంటే.. వాళ్లకు తనవల్ల జరిగిన అపకారం యాదికొచ్చి సిగ్గుపడ్డడు కోటేశు.
“మేమందరం బాగున్నమక్కా!” అని
క్షణకాలం ఆగిండు. మళ్లీ తనే..
“దస్తగిరి బావ కాలం చేసిన చాలా రోజుల తర్వాత తెల్సింది నాకు. బావ మంచి ఆరోగ్యంగనే ఉండేటోడు కదా.. ఇట్టెట్టా జరిగిందక్కా..?” అని అడిగిండు.
“అవును.. మంచిగనే ఉండె తమ్మీ! ఆ రోజు మిషిన్మీద కూకొని బట్టలు కుట్టుకుంటనే.. పడిపోయిండు. డాక్టర్ను పిలిపించే లోపటే..” భర్త జ్ఞాపకాలు యాదికొచ్చి కన్నీళ్లు పెట్టుకుంట..
“చనిపోయిండు” అన్నది కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ..
కోటేశుకు లోపట బాధేసింది. లేచి నిలబడి రెండు చేతులు జోడించి..
“అక్కా! నన్ను క్షమించాలె” అన్నడు.
ఆమె ఆశ్చర్యంగా.. “ఎందుకు తమ్మీ! నువ్వేం జేసినవ్?” అని అడిగింది.
“నావల్లనే కదక్కా.. మీరు మనూరిడ్సిపెట్టి, ఈ ఊరికి రావాల్సి వచ్చింది. అయ్యాల శివరాత్రి జాతర నాడు.. దస్తగిరి బావను నాటకం దగ్గర అవమానించకపోతే..!” కోటేశు గొంతు పశ్చాతాపంతో జీరబోయింది.
ఆమె ఓదార్పుగా.. “అలా అనుకొని నువ్వేం బాధ పడకు తమ్మీ! మేమేరోజు గూడ నీ మూలంగనే ఊరిడ్సి పెట్టాల్సి వచ్చిందనుకోలేదు. మీ బావ బతికున్నప్పుడు ‘కోటేశు చెడు ఆలోచన గల్లోడు కాదు.. వానికెవరో మందు తాపించి రెచ్చగొట్టింర్రు.. కోటేశు మంచోడే’ అనేటోడు” అని అన్నది ఆయేశా.
“నువ్వు ఎన్నైనా చెప్పక్కా.. అది మీ మంచితనం. కానీ, నేను చేసింది తప్పని నాకు తెలుసక్కా! అందుకే క్షమించమని అడుగుతున్న”
“చూడు తమ్మీ! చేసిన తప్పు తెల్సుకొని బాధ పడినవంటెనే.. నువ్వు శిక్ష అనుభవించినవ్వన్నట్లే! దేవుడు నిన్ను మాఫ్ జేసినట్లే తమ్మీ”
ఆమె మాటల్లోని మంచితనం, సహృదయత, క్షమాగుణం అర్థం చేసుకున్న కోటేశు, ఇంకేం మాట్లాడాలో తెల్వక మూగబోయిండు.
ఇంతల్నే ఇంటి లోపట్నుంచీ.. “అమ్మీ! కర్రీ” అని పిలుపు. “అమ్మీ! మజ్జిగ” అని మరొక పిలుపు. “అమ్మీ! పాపడి” అని మూడో పిలుపు.
“ఆ! వస్తున్నా” అంటూ లేసింది ఆయేషా.
“అక్కా! ఎవరీ పిల్లలు?” అడిగిండు కోటేశు.
“మనూర్లె ఉన్నప్పుడు ఇద్దరు ఆడపిల్లలు.. తెల్సుకదా? ఇక్కడికి అచ్చినంక బాబు పుట్టిండు. ఆడ పిల్లల పెండ్లిళ్లు చేసినం. కాపురాలకెల్లిపోయింర్రు. బాబు, వాడి దోస్తులు అన్నం తింటున్నరు. ఇగో.. ఈ కిటికీలోంచి సూడు!” అని చెప్పి లోపలికి పోయిందామె.
లేసి కిటికీలోంచి లోపలికి సూసిండు కోటేశు. ముగ్గురు పిల్లలు అన్నం తింటున్నరు. వాళ్లలో ఒక పిలగాడు లావుగ, అజంగ ఉన్నడు. గా పిలగాడే దస్తగిరి కొడుకు కావచ్చు, ఇంకో పిలగాడెవరో తెలుస్త లేదు. వాడి పక్కన కూకున్నోన్ని సూసి ఆశ్చర్యపోయిండు కోటేశు. తన కండ్లను తానే నమ్మలేకపోయిండు. వాడు తన కొడుకు అరవిందు. వాళ్లను సూసొచ్చి మళ్లీ కూకున్నడు.
ఆయేషా పిల్లలకు ఏం కావాలో వడ్డించి, తిరిగి షాపులోకి వచ్చింది.
“అక్కా! అరవిందు ఎవరో తెలుసా?”
అడిగిండు కోటేశు.
ఆమె చిన్నగ నవ్వి.. “నీ కొడుకే కదా!” అంది. ఆ ఇంకో పిలగాడి గురించి చెప్తూ.. “వాడు పక్కనున్న లంబాడి తండా పిలగాడు. పేరు బాలు. వీళ్లు ముగ్గురూ మంచి దోస్తులు. క్లాసులో వీళ్లే మంచిగ సదువుతరంట. మీ అరవిందు బడి మానేసిండని తెలిసి, గుబులు పెట్టుకున్నరు. తిరిగి మీ అరవిందు సదూకోనీకి వచ్చినంక హుషారొచ్చింది వీళ్లకు” అంది నవ్వుతూ.
అబ్బురమనిపించింది కోటేశుకు. ఈ సమాజంల ఇంకా ఇంత మంచితనం మిగిలి ఉందా? కుల మతాల, తరతమ భేదాల్లేకుండా.. అంతేకాకుండా తమ కుటుంబానికి చెడు చేసినోల్ల పిలగాడిని కూడా తన పేగు బంధంలాగే అక్కున చేర్చుకోవడం తొలిసారి చూసిన కోటేశుకు, ఒక నమ్మలేని అద్భుతాన్ని సూసినట్టు అనిపించింది.
ఇంతల్నే ముగ్గురు పిల్లలు తినడం ముగించుకొని, ఒకరి వెనకాలొకరు షాప్లోకి వచ్చింర్రు.
ఆయేషా.. తన కొడుకు జహంగీర్కు, కోటేశును అరవిందు తండ్రిగా పరిచయం చేసింది. వాడు కోటేశును “నమస్తే అంకుల్” అన్నడు.
“నమస్తే నాయనా!” అని జవాబు ఇచ్చి, వాడి పాదాలకెల్లి సూసిండు. అవే.. ఆ రాత్రి దర్శనమిచ్చిన స్వామి పాదాలకున్న
‘ఎర్ర హవాయి చెప్పులు’. కోటేశుకు చాలా
విషయాలు అర్థమయినయ్.
“నువ్వెప్పుడొచ్చినవ్ నాన్న?” అడిగిండు అరవిందు. వాడి వెనక వచ్చిన బాలుకూడా
“నమస్తే అంకుల్” అన్నడు.
ఇద్దరికీ జవాబిచ్చిండు కోటేశు.
“ఎండల పడి అచ్చినవ్ అన్నం యాళ్లకు. రెండు ముద్దలన్నం తింటే పాణం నెమ్మదైద్ది. లే! కాళ్లు కడుక్కోపో.. అన్నం తిందువు! టిల్లు బేటా! అంకుల్ కాళ్లు కడుక్కోడానికి నీళ్లియ్యి” అంది ఆయేషా.
టిల్లు జగ్గుల నీళ్లిచ్చిండు. కాళ్లు కడుక్కున్నడు కోటేశు. టిల్లును పక్కకు పిల్సి..
“అల్లుడూ! అంతా అర్థమైంది. కానీ, ఆ రాత్రి నన్ను నిద్ర బుచ్చడానికి ఏ మంత్రం ఏసినవ్” అనడిగిండు కోటేశు.
టిల్లు నవ్వి.. “మా స్కూల్ సైన్స్ ల్యాబ్లో ‘క్లోరోఫామ్’ ఉంటది. అది జరంత దస్తిల సల్లుకొని అచ్చిన. అదే వాసన మీకు చూపించిన. అంతే.. మీకు మత్తు కమ్మింది” అన్నడు వాడు.
అనుమానం తీరింది కోటేశుకు. “ఇంకెల్లండి నాయనా.. మంచిగ సదువుకోండి” అన్నడు.
పిల్లలు ఎల్లిపోయింర్రు. ఆయేషా అన్నం వడ్డిస్తే తిని, షాప్లోకొచ్చి కూకుండు కోటేశు.
“అక్కా.. నా బిడ్డ పెండ్లయినంక ఈ వచ్చే దీపావళి తొలి పండుగ. బిడ్డ, అల్లుడు వస్తరు. నువ్వేం అనుకోనంటే.. పండక్కి ముందురోజు వచ్చి నిన్ను, టిల్లును మా ఇంటికి పిల్సుకపోత. మీరు రావాలక్కా.. నా ఇంటికి..” అన్నడు.
“నేను ఎవరిండ్లకూ రాకూడదు తమ్మీ!”
“ఎందుకక్కా?”
“మీ బావ చనిపోయిన తర్వాత, నన్ను మా పుట్టింటోళ్లు పిల్సుకపోయి నిద్ర చేయించాలె. కానీ, మా ఇద్దరన్నలూ నన్ను పిల్సుక పోలేదు. అట్లా పుట్టింట్లో నిద్రచేసి రాకుండా, ఎవరింటికీ రాకూడదు తమ్మీ”
“అన్నలు ఎందుకు పిల్సుక పోలేదక్కా..?”
“ఇద్దరన్నలకు ఇద్దరు కొడుకులున్నరు. ఇద్దరికీ సదువబ్బలే. అన్ని చెడలవాట్లూ ఉన్నయ్. అసొంటోళ్లకు నా పిల్లల్నిచ్చి పెండ్లి చేయలేదని కోపం. గందుకే బావతోపాటు చెల్లెకూడా చచ్చిపోయిందనుకున్నరు” అని కన్నీళ్లు పెట్టుకుంది.
“ఊకో అక్కా! నాకు తోడబుట్టిన ఆడబిడ్డలు లేరక్కా! నన్ను నీ సొంత తమ్ముడనుకో. నాకీ పట్టింపులు లేవు. నా ఇంట్లో నాలుగు రోజులుండి వద్దువు. కాదనమాకక్కా..”
“నోరారా అక్కా.. అని ఇంత అభిమానంగ పిలుస్తున్నవ్. వస్తంలే తమ్మీ!”
“చాలక్కా! పండక్కి నువ్వు మా ఇంటికొస్తే.. అంతే చాలక్కా. ఇంక నేను ఇంటికి బయలుదేరుతా” అంటూ లేశి, బయటకొచ్చిండు కోటేశు.
కొన్నేండ్లుగా మోస్తున్న బరువేదో దిగిపోయినట్లయింది కోటేశుకు. బండి స్టార్ట్ చేసి, అరగంటలో ఊరికి చేరుకున్నడు.
ఊరి చివర లిక్కర్ షాప్లో మందుతాగి బయటికొచ్చిన పూలకొట్టు శ్రీను, చాపలకొట్టు కనకయ్యల కంట్లె వడ్డడు. వాళ్లిద్దరూ కోటేశు దోస్తులే. బండికి అడ్డంబోయి ఆపింర్రు.
“ఒరే కోటేశు. మందు బంజేసి.. పోయేటప్పుడు ఏం కట్క పోదమన్కుంటున్నవ్? నువ్వియ్యాల మందు తాగాల్సిందే ” అన్నడు కనకయ్య.
“అవునొరే కోటేశు! మాతోని మందు బంజేసినని చెప్పినవ్ గనీ, మాకెర్కలేకుండా ఏదో కొత్తమందు తాగుతున్నట్లున్నవ్రా! గదేందో మాక్కూడా జర శెప్పరాదుర” అడిగిండు శ్రీను.
కోటేశు నవ్వి.. “అవ్.. కొత్తమందే తాగుతున్నరా! కానీ, మీరనుకుంటున్న మందుకాదు. ఇంట్లే.. భార్యాపిల్లల ప్రేమమందు తాగుతున్న. ఇంకో సంగతెర్కనా మీకు? అపకారం చేసినోళ్లకు ఉపకారం చేసేటోల్లని సూసిండ్రా?”
అని అడిగిండు.
“సాయం జేసినోన్ని, సందుజూసి సంకల పొడిసేటోల్లు గల్లీకి నలుగురుంటర్రా.. ఇంక నువ్వన్నట్టూ.. చెడు చేసినోనికి మంచి చేసేటోళ్లు కూడా ఉంటరా.. ఈ కాలంల?” అన్నడు శ్రీను.
“ఉంటరు.. ఉన్నరు.. నేనిప్పుడే సూసి వస్తున్నా. నష్టపర్చి, కష్టపెట్టినోల్లని కూడా, ఇష్టంగా దగ్గరకు తీసుకునేటోల్లని చూసి వస్తున్నా. కులమతాలకతీతంగా, కోపతాపాలకతీతంగా మనుషుల్ని ప్రేమించేటోల్లని చూసి, వాళ్ల సొచ్చమైన ప్రేమ, ఆత్మీయతల్నీ, మనిషితనాలనీ, మంచితనాలనీ కుతి తీరా తాగి వస్తున్నా. ఆ ప్రేమాభిమానాలిచ్చే ‘నషా’ ముందు.. తాగిన రెండుమూడు గంటల్లో దిగిపోయే ఈ లిక్కర్ కిక్కు లెక్కలోకే రాదు” అన్నడు.
వాళ్లిద్దరికీ ఏం అర్థం కాక, ఒకరి ముఖాలు ఒకరు సూస్కుంటుంటే..
“వీలైతే మీరుగూడ గీ మందు బంజేసి సూడండి. ఇగ వస్త..” అని చెప్పి, మోపెడ్ను ఇంటిదారి పట్టించాడు కోటేశు.. ‘జరిగిందంతా శాంతకు చెప్పాల’ అనుకుంటూ..
సయ్యద్ గఫార్
30 ఏండ్లుగా రచనా వ్యాసంగంలో ఉన్న సయ్యద్ గఫార్, నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి వాస్తవ్యులు. ప్రస్తుతం హైదరాబాద్లోని హఫీజ్పేట్లో నివాసముంటున్నారు. నల్లగొండ నాగార్జున డిగ్రీ కళాశాలలో డిగ్రీ చేశారు. స్టేజీ నాటకరంగంలో నటనతోపాటు దర్శకత్వంలోనూ అనుభవజ్ఞులు. ‘పంచాయతీ రాజ్ లీడర్’ పేరుతో స్థానిక సంస్థల విశ్లేషణ మాసపత్రికను ఎనిమిదేండ్లపాటు నడిపారు. నవతెలంగాణ దిన పత్రిక నిర్వహించిన ‘బండారు అచ్చమాంబ స్మారక కథలపోటీ’లో హంస’ కథ మొదటి బహుమతికి ఎంపికైంది. ప్రస్తుతం ఈ కథతో స్వీయదర్శకత్వంలోనే లఘుచిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతేడాది ‘నమస్తే తెలంగాణ ముల్కనూరు ప్రజా గ్రంథాలయం’ నిర్వహించిన కథల పోటీలో ‘ఖుర్బానీ’ కథకు ప్రత్యేక బహుమతి లభించింది. 2018లో ‘జనన వాంగ్మూలం’ కవితా సంపుటిని ముద్రించారు. తెలుగు నాటక కళా పరిషత్, వైజాగ్ వారు నిర్వహించిన తెలుగు కథా, నాటక పోటీల్లో ‘మౌనధ్వని’ నాటికకు ప్రత్యేక బహుమతి దక్కింది. ప్రస్తుతం ఖుర్బానీ కథలు సంపుటి, మౌనధ్వని నాటిక ముద్రణ దశలో,
పలు సినిమా కథలు చర్చల దశలో ఉన్నాయి.
-సయ్యద్ గఫార్ ,8143253116
ఇవీ కూడా చదవండి…