హాయ్ పిల్లలూ! చిన్నప్పటి నుంచీ మనకు ఎన్నో అలవాటవుతాయి. మాటలు, ఆటలు, పద్ధ్దతులు.. ఇంకా చాలా. కానీ, నాగాలాండ్లోని పిల్లలకు ఓ ఆట ఉగ్గుపాలతో ఒంటబడుతుంది. అందుకే, జాతీయ స్థాయి జట్టులో సైతం ఆ రాష్ట్రానికి చెందిన వాళ్లే ఉంటారు. ఇంతకీ ఆ ఆట ఏమిటో, వాళ్ల కృషి ఏమిటో చూద్దామా..
నాగాలాండ్ జనాభా దేశ జనాభాలో మూడు శాతం. జాతీయ ఫుట్బాల్ టీమ్లో మాత్రం ఐదో వంతు వారే ఉంటారు. ఎందుకంటే, వారికి బాల్యంలోనే ఫుట్బాల్ పరిచయం అవుతుంది. జీవితంలో ఒక భాగంగా పెనవేసుకుపోయి ఉంటుంది. నాగా గ్రామాల్లో 7 నుంచి 20 ఏండ్ల వయసులోని ప్రతి ఒక్కరూ ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తుంటారు. సీనియర్ ఆటగాళ్లు సెలవుల మీద వచ్చినప్పుడు ఇరుగు పొరుగు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. బంతి కొనుక్కునే స్థోమత లేకపోతే, ఒక్కోసారి పామోలిన్ పండ్లతో తయారు చేసిన బంతులను ఉపయోగిస్తుంటారు. చుట్టుపక్కల గ్రామాలు కలిసి తరచూ ఫ్రెండ్లీ మ్యాచులు నిర్వహించుకుంటాయి. వాటి పట్ల గ్రామప్రజలు ఎంతో ఆదరణ చూపుతారు. ఆట మైదానం వరకూ పిల్లలు నడవలేకపోతే భుజాలపై ఎత్తుకుని మరీ వారిని అక్కడకు చేరుస్తుంటారు. రోజూ ఉదయం గ్రామంలోని ప్రతి ఇంటి ఆవరణలో ప్రాక్టీస్ ఉంటుంది. నాగా గ్రామాలు ఎత్తయిన కొండల మీద ఉంటాయి. ప్రతి కొండ చివర ఒక ఫుట్బాల్ పిచ్ తప్పక ఉంటుంది.
‘మేము నడక ప్రారంభించినప్పటి నుంచే ఆట నేర్చుకుంటాం’ అంటాడు 20 ఏండ్ల యువ ఆటగాడు నయోమి. ఇదిలా ఉండగా.. భారతదేశంలో ఫుట్బాల్ ఆటకు గొప్ప నేపథ్యం ఉంది. స్వాతంత్య్రం తర్వాత సరిగ్గా ఏడాదికి, 1948 లండన్ ఒలింపిక్స్కు తొలిసారి మనదేశం నుంచి ఫుట్బాల్ బృందం హాజరైంది. ఆ మ్యాచ్లో చివరిక్షణంలో మన ఆటగాళ్లు ఓడిపోయారు. కానీ, ఆ ఆటతీరు ఎందరి మనసులనో దోచుకుంది. 11 మంది బృందంలో 8 మంది బూట్లు ధరించకుండా, ఒట్టికాళ్లతోనే ఫుట్బాల్ ఆడారు. దీనిపై ఎదురైన ప్రశ్నలకు జట్టు కెప్టెన్ టాలిమెరెన్ అయో ‘మా దేశంలో మేము ఫుట్బాల్ ఆడతాం. బూట్బాల్ కాదు’ అంటూ సమాధానమిచ్చారట. అప్పటి లండన్ రాజు కింగ్ జార్జ్ – VI బకింగ్హామ్ ప్యాలెస్కు ఆ బృందాన్ని ఆహ్వానించారట. అంతటి చరిత్ర గలిగిన ఫుట్బాల్ బృందంలో నేటికీ ఈశాన్య రాష్ర్టాల ఆటగాళ్లు కీలకంగా ఉంటున్నారు. దేశానికి పతకాల పంట పండిస్తూనే ఉన్నారు. మైదానంలో మెరుపులు మెరిపిస్తూనే ఉన్నారు.
ఇవీ కూడా చదవండి…