కవి, కథకుడు, నవలా రచయిత రామా చంద్రమౌళి తన అనుభూతులను మేళవించి వెలువరించిన కవితా సంకలనం ‘ఆత్మ’. ఇందులోని కవితలు చాలావరకు వర్తమాన సామాజిక అంశాలపై రాసినవే. ‘ఇది నిరంతర అనంత యాత్ర’ కవిత భారత స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ సాగుతుంది. ప్రత్యేక రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ అన్నపూర్ణగా మారిన వైనాన్ని, అందుకు కారణాన్ని ‘అన్నం గిన్నె మన తెలంగాణ’ మన కండ్లముందు ఉంచుతుంది. ‘అక్షరాలకు పరిమళాన్నద్దిన అమృతమూర్తి’ తెలంగాణ జ్ఞానపీఠం సినారె వ్యక్తిత్వం గొప్పతనాన్ని వెల్లడిస్తుంది. ఆధునిక జీవితాల్లో స్మార్ట్ఫోన్లు సృష్టిస్తున్న విధ్వంసంపట్ల ‘తీయని విషం’లో కవి ఆవేదన కనిపిస్తుంది.
ఇక ‘గుండెల్లో రాచపుండు’ కరోనా కరాళ నృత్యం వేళ వందల కిలోమీటర్లు నడక సాగించిన వలస కార్మికుల కడగండ్లను కండ్లకు కడుతుంది. మనిషి మరణించడం అంటే ఏంటో ‘నువ్వు మెలమెల్లగా మరణిస్తుంటావు’ వివరిస్తుంది. ఇది ప్రముఖ స్పానిష్ కవి పాబ్లో నెరుడా కవితకు తెలుగు అనువాదం. ఇక ‘మళ్ళీ ఒకసారి ఆ జ్ఞాపకాల్లోకి..’ హైదరాబాద్ చారిత్రక వైభవాన్ని వర్ణిస్తుంది. అపర చాణక్యుడు, ఆర్థిక సంస్కరణల పితామహుడు మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావుకు ‘స్వాప్నికుడు.. రూపశిల్పి’ కవితలో నివాళి అర్పించారు. రామా చంద్రమౌళి ‘ఆత్మ’ సంకలనంలోని కవితలన్నీ పాఠకుల్లో అనేక ఆలోచనలను రేకెత్తిస్తాయి.
రచన: రామా చంద్రమౌళి
పేజీలు: 186; ధర: రూ. 200
ప్రతులకు: ఫోన్: 93901 09993