ap weatherman | ‘బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీనివల్ల చలి విపరీతంగా ఉంటుంది. రాగల 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఉత్తమం’ అంటూ సాయి ప్రణీత్ చేసే వాతావరణ ప్రకటన రెండు రాష్ట్రాల రైతులకు హెచ్చరికతో కూడిన సలహా .
బుర్రా సాయి ప్రణీత్ ఆరోజు ఇచ్చే వెదర్ రిపోర్ట్లో వర్షం పడదని చెబితే.. నిరభ్యంతరంగా వడియాలు ఎండబెట్టుకోవచ్చు. వర్షం పడుతుందని అంచనా వేస్తే మాత్రం.. గడప దాటిన ప్రతిసారీ గొడుగు తీసుకెళ్లాల్సిందే. రైతులైతే తక్షణం తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందే. అందుకే, తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల ప్రజానీకం మేఘాలు కమ్ముకున్నప్పుడు ఆకాశం వైపు.. చలిగాలులు వీస్తున్నప్పుడు కొండల వైపు కాకుండా ‘ఏపీవెదర్మ్యాన్ (ap weatherman )’ రిపోర్టు వంకే చూస్తారు. ఉరుము ఉరిమినా.. మేఘం గర్జించినా.. సుడిగాలులు తీవ్రమైనా.. ఆ తీవ్రత తెలుసుకునేందుకు, రాబోయే నష్టం అంచనా వేసేందుకు ‘ఏపీవెదర్మ్యాన్ రిపోర్టు’పైనే ఆధారపడతారు. చాలా సందర్భాల్లో వాతావరణ శాఖ నివేదిక కంటే.. వెదర్మ్యాన్ రిపోర్టే పక్కాగా ఉంటుంది. సాయి ప్రణీత్ అలియాస్ ఏపీవెదర్మ్యాన్ తిరుపతి వాసి.
అతని నివేదిక ఆధారంగా ముందు జాగ్రత్తలు తీసుకొని.. పంటలు కాపాడుకున్న రైతులు ఎంతోమంది. ఇటీవల వచ్చిన తుఫాను సమయంలో ఒక టీ ఎస్టేట్ యజమాని వందశాతం నష్టాన్ని నివారించుకోగలిగాడు. దక్షిణ భారతంలోని రైతులంతా సాయి ప్రణీత్ ఫాలోవర్లే.
సాయి ప్రణీత్ తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్లు ఆఫీస్కు వెళ్లిన తర్వాత ఒక్కడే ఇంట్లో ఉండాల్సి వచ్చేది. ఆ ఒంటరితనం కారణంగా వీడియోగేమ్స్, కార్టూన్ నెట్వర్క్కు అలవాటైపోయాడు. అప్పుడే టెక్నాలజీపై అవగాహన వచ్చింది. ఓ వేసవిలో మిట్టమధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఆ ఉత్పాతం అతనిలో కొత్త ఆలోచన రేకెత్తించింది. అకారణంగా వర్షం ఎందుకు పడింది? దారితీసిన కారణాలేంటి? అనే కోణంలో అధ్యయనం ప్రారంభించాడు. దినపత్రికలు, టీవీల్లో వచ్చే వాతావరణ వార్తలు తప్పక ఫాలో అయ్యేవాడు. అయితే, వాటిలో చెప్పినట్టుగా, వర్షం రాకపోతే మాత్రం తీవ్ర నిరాశ చెందేవాడు. వాతావరణ వివరాల్లో కచ్చితత్వం ఎలా తీసుకురావాలా అని ఆలోచించేవాడు. ఆ క్రమంలో ఇంటర్నెట్తో స్నేహం చేశాడు. అలా 2012 నుంచి వెదర్ బ్లాగింగ్ ప్రారంభించాడు. గతంలోని వాతావరణ పరిస్థితులు పరిశీలిస్తూ.. తన దగ్గరున్న టెక్నాలజీ సాయంతో కచ్చితమైన సమాచారాన్ని మాత్రమే తన బ్లాగ్లో పోస్టు చేస్తాడు సాయి.
2013లో ‘ఆండ్రాయిడ్’ యుగం ప్రారంభమైంది. అదే సమయంలో కోయంబత్తూరులోని ‘అన్నా యూనివర్సిటీ’ నుంచి ఇంజినీరింగ్లో గోల్డ్ మెడల్ సాధించాడు సాయి. తర్వాత తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంటెక్ చేశాడు. HYMIES అనే స్టార్టప్కు కో ఫౌండర్గా వ్యవహరించాడు. అది పెద్దగా విజయం సాధించలేదు. దీంతో ఉద్యోగాల వేటలో పడ్డాడు. నిరుద్యోగంతో కొంతకాలం డిప్రెషన్లోకి వెళ్లాడు. 2019లో బెంగళూరుకు చెందిన ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. వర్షాలు, ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులపై కచ్చితమైన సమాచారం లేక తెలుగు రాష్ట్రాల ప్రజల ఇబ్బందులను కళ్లార చూసిన ప్రణీత్.. ‘ఏపీ వెదర్మ్యాన్’ అవతారం ఎత్తాడు. ప్రత్యేకంగా ఏపీ వెదర్మ్యాన్ పేరుతో ఫేస్బుక్ పేజీ, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ చానెల్, బ్లాగ్ ప్రారంభించాడు. నాటి నుంచి నేటి వరకూ కచ్చితమైన సమాచారం ఇస్తున్నాడు. ఆ సూచనలతో రైతులు పంటల నష్టాల నుంచి గట్టెక్కుతున్నారు. సెలవు దినాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్తో ప్రయోగాలు చేస్తుంటాడు సాయి. ఇంతటితో ‘ఏపీవెదర్మ్యాన్’ వార్తలు సమాప్తం.
“komera ankarao | మనుషులకు ఆయువునిచ్చే అడవులకు అండగా మారిన తెలుగోడు”