ప్రైవేట్ దవాఖానల మాయాజాలం..
రోగుల అవసరాన్ని సొమ్ముచేసుకుంటున్న నిర్వాహకులు
విపత్తులోనూ అక్రమ వ్యాపారం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం
నకిలీ మందులతో మోసం.. బ్లాక్ మార్కెట్లో రెమ్డెసివిర్
‘ప్రైవేట్’ దోపిడీపై టాస్క్ఫోర్స్నుఏర్పాటు చేసిన ప్రభుత్వం
దోపిడీ దందాపై ఫిర్యాదు చేయాలంటున్న అధికారులు
ఖలీల్వాడి, ఏప్రిల్ 30: కరోనా వేళ..కాసుల వేటలో ప్రైవేట్ దవాఖానలు పడ్డాయి. వైద్యం కోసం వచ్చే వా రిని నిలువుదోపిడీ చేస్తున్నాయి. రోగుల బలహీనతను ఆసరాగా చేసుకొని అందిన కాడికి దండుకుంటున్నా యి. కొందరు చికిత్స పేరిట, కొందరు నకిలీ మందులు అంటగట్టుతుండగా.. మరోవైపు కొవిడ్ మందులను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి అక్రమాలకు పాల్పడుతున్నారు. ని జామాబాద్ జిల్లాలోని పలు ప్రైవేట్ దవాఖానలు కరో నా వైద్యం పేరిట భారీ వసూళ్లకు పాల్పడుతున్నాయి. కొవిడ్ బాధితుల బలహీనతను డబ్బుల రూపంలో మలుచుకుంటున్నాయి. దవాఖానకు వచ్చిన వారిని జలగల్లా పట్టి పీడిస్తున్నాయి. కొవిడ్ వచ్చిందని దవాఖానకు వెళ్తే చాలూ..లక్షలు ముట్టజెప్సాల్సిందే. ముందు డబ్బులు చెల్లిస్తేనే వైద్యం చేస్తామని నిర్వాహకులు తేల్చి చెప్పేస్తున్నారు. చేసేదేమిలేక బాధితులు అప్పులు చేసి వారి చేతుల్లో పెడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో రోగుల్లో ఆత్మైస్థెర్యం అందించాల్సిన కొన్ని ప్రైవేట్ దవాఖానలు..వారిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల ఓ వైద్యుడు తనకు కొవిడ్ సోకినా ఏమీపట్టనట్లుగా డబ్బులు కోసం దవాఖాన తెరిచి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఎంతమందికి వైరస్ సోకిందో తెలియని పరిస్థితి.
నకిలీ మందుల విక్రయం..
కొందరు ప్రైవేట్ వైద్యులు నకిలీ మందులను రోగులకు అంటగట్టి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. రెండు రోజుల క్రితం ఓ ప్రైవేట్ వైద్యుడు నకిలీ రెమ్డెసివిర్ తయారుచేసి విక్రయించి సొమ్ము చేసుకోవాలని యత్నించి..అడ్డంగా దొరికిపోయాడు. కొందరు రెమ్డెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్కు తరలించి అందినకాడికి దోచుకోవడానికి ప్రయత్నించి కటకటాల పాలయ్యారు. ఆపత్కాలంలో ఆదుకోవాల్సిన వైద్యులతోపాటు వైద్య సిబ్బంది ఇలా నిలువునా మోసం చేస్తే రోగులు ఎవరినీ నమ్మాలి. చికిత్స చేయాల్సిన వారే కాసుల వేటలో పడితే రోగుల్లో మనోధైర్యం సడలే అవకాశం ఉంది. కృత్రిమ కొరత సృష్టించి రెమ్డెసివిర్ పేరిట వేలకు వేలు దండుకుంటున్నారు. అవసరం లేకున్నా రోగులతో ఇంజక్షన్లను కొనుగోలు చేయించి వేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా బాధితులతో మెడికల్ దుకాణాల నిర్వాహకులు ఆడుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా అధిక ధరలకు విక్రయిస్తూ వారి జేబులకు చిల్లు పెడుతున్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం
కొవిడ్ బాధితులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వారికి మెరుగైన చికిత్స అందించేందుకు దవాఖానల్లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రంతోపాటు బోధన్, ఆర్మూర్ దవాఖానల్లో వందల సంఖ్యలో బెడ్లను అందుబాటులోకి తెచ్చింది. కరోనా బాధితులకు అందుతున్న సేవలపై ముంత్రి వేముల, ఎమ్మెల్సీ కవిత ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. వైద్యాధికారులకు పలు సూచనలు చేస్తున్నారు. రూపాయి ఖర్చులేకుండా రోగులు పూర్తిస్థాయిలో చికిత్స పొంది క్షేమంగా ఇండ్లకు వెళ్తున్నారు. పుకార్లు, సోషల్మీడియాలో వచ్చే వందతులను నమ్మి ప్రజలు ప్రైవేట్ దవాఖానకు వెళ్లి రూ. లక్షలు ఖర్చు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ దవాఖానల్లో దోపిడీ దందాను అరికట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది.