అవకాశాలు విస్తరిస్తున్నాయి. ప్రపంచం చిన్నదైపోతున్నది. దూరాలు దగ్గరవుతున్నాయి. కానీ, మనిషి మాత్రం కుంచించుకుపోతున్నాడు. తనలో తాను కుమిలిపోతున్నాడు. మానసికంగా మరుగుజ్జు అవుతున్నాడు. ఈ పరిస్థితి ప్రవాస భారతీయురాలు, లండన్ నివాసి స్మితా మెల్లింగ్ను ఆలోచింపజేసింది. ఆమె మనస్తత్వ నిపుణురాలు. మనిషి ప్రవర్తన, స్వభావం సాధికారికంగా విశ్లేషించగలరు. ఆ నైపుణ్యమే ‘ఎంపవరింగ్ లండన్’ ఏర్పాటు దిశగా నడిపించింది. విజేతకు, పరాజితుడికి మధ్య తేడా.. మానసిక స్థితే. మనోబలం ఉన్నవారు లక్ష్యాన్ని చేరుకుంటారు. లేనివారు అగాథంలో కూరుకుంటారు. సరిగ్గా కరోనాకు ముందు లండన్ కేంద్రంగా సేవలు ప్రారంభించారు స్మిత. తన ఇంట్లోని ఓ పడకగదిని ఆఫీసుగా మార్చుకున్నారు.
ఎటూ బయటికి వెళ్లలేని పరిస్థితులే కాబట్టి ఆన్లైన్ సేవలకే పరిమితం అయ్యారు. ఆర్థిక సంక్షోభాలు, ఒంటరితనం, కరోనా భయం, ఉద్యోగ అభద్రత.. ఇలా రకరకాల సమస్యలతో జనం ఫోన్లు చేసేవారు. ఈ మూడేండ్ల కాలంలో ఎంపవరింగ్ లండన్ .. ఆ మహానగరాన్ని దాటి విస్తరించింది. భారతీయ భాషల్లోనూ సేవలు అందిస్తున్నారామె. ‘మీకు బాగా ఇష్టమైన పనిని, మీరు అత్యద్భుతంగా చేయగలిగిన పనిని చేస్తూనే ఉండండి. విజయం మీ తలుపు తడుతుంది. సంకోచాన్ని పక్కనపెట్టి
జీవితంలోకి ఆహ్వానించండి. ఆ క్షణకాల నిర్ణయమే ఓ గొప్ప మలుపు’ అని మహిళలకు సలహా ఇస్తారు స్మిత.