ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలకు డచ్ ప్రభుత్వం అందించే స్పినోజా ప్రైజ్ నోబెల్ బహుమతితో సమానమని అంటారు. అంత గొప్ప పురస్కారాన్ని ఓ ప్రవాస భారతీయ శాస్త్రవేత్త అందుకోవడం గర్వ కారణం. యూనివర్సిటీ ఆఫ్ ఆమ్స్టర్డామ్లో పర్యావరణశాస్ర్తాన్ని బోధిస్తున్న జొయీతా గుప్త.. జీవ వైవిధ్యం కోసమూ కృషి చేస్తున్నారు. ప్రకృతిలో సుస్థిరతను ఆకాంక్షిస్తున్నారు. ప్రశంసా పత్రంతోపాటు ఒకటిన్నర మిలియన్ యూరోలను బహుమతిగా అందుకోనున్నారు జొయీతా. సమాజానికి పనికొచ్చే పరిశోధనల కోసం ఈ మొత్తాన్ని ఆమె ఖర్చు చేస్తారు.
పర్యావరణంలో వచ్చే ప్రతికూల మార్పులను అంతర్జాతీయ ప్రపంచం ఎలా ఎదుర్కోవాలి, సర్కారు వైపు నుంచి జరగాల్సింది ఏమిటి.. అనే కోణంలో అనేక పరిశోధన పత్రాలు సమర్పించారు జొయీతా. అంతర్జాతీయ న్యాయాలు, ఆర్థికశాస్త్రం తదితర అంశాలపైనా ఆమెకు లోతైన అవగాహన ఉంది. ‘మనుషులతో పాటు ప్రకృతికి న్యాయం జరగాల్సి ఉంది. అదే మన ముందున్న అతిపెద్ద సవాలు’ అంటారామె. తను ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదివారు. గుజరాతీ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎమ్ చేశారు. వివిధ అంశాలపై అంతర్జాతీయ వేదికల మీద ఉపన్యాసాలు ఇచ్చారు. అనేక పుస్తకాలూ రాశారు.