జరిగిన కథ : పినచోడుని కుమార్తెలు నారాంబ, పేరాంబలను రాజధానికి తెచ్చినట్లుగా గణపతి దేవునికి విన్నవించాడు చౌండ సేనాని. అందుకు సంతోషించి, వారికి రాజోచిత మర్యాదలతో అంతఃపురంలో నివాసం కల్పించాడు చక్రవర్తి. బాలుడైన జాయప కూడా చెప్పాచేయకుండా తమవెంట వచ్చినట్లు చెప్పలేక పోయిన చౌండ.. జాయపను తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. అతని భార్య మైలాంబిక తమ పిల్లలు కాటయ, పద్మాక్షితోపాటే జాయపను కూడా ఆదరాభిమానాలతో అక్కున చేర్చుకున్నది. వారితో కలిసి చదువు, యుద్ధవిద్యలు అభ్యసిస్తున్న జాయప.. చిత్రకారిణిగా మైలమ కళాకౌశలాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. దాదాపు ఆరునెలల తర్వాత బయటి ప్రపంచం చూడాలన్న కుతూహలంతో రాజప్రాసాదం దాటి వచ్చాడు జాయప.
‘మాఘమాసం.. శుక్లపక్షం. ఉదయపు మంచు పూర్తిగా కరిగి ఎండ తళతళ మెరుస్తున్నవేళ రాజవీధి రద్దీగా ఉన్నది. రహదారి వెంట జనసమ్మర్ధం, హడావుడీ ఎక్కువగానే ఉన్నది. అశ్వారూఢులైన ధనుర్ధారులు, కులీనులు, అధికారులు వేగంగా పోతున్నారు. గుర్రపు గిట్టల లయబద్ధత.. పల్లకి బోయీల ‘వహోం హోం.. వహోం హోం’ శబ్దాలు, వరుసగా నడుస్తున్న మత్తగజాల మెడల్లో చిరుగంటల సవ్వడి, వాటి మావటీల చిన్నచిన్న కేకలు, ఎడ్లబండ్ల గణగణలు.. చక్రాల గరగర శబ్దాలు, బండ్లవాళ్ల అదిలింపులు, కావిళ్ల వాళ్ల వయ్యారపు మూలుగులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గాడిదలమీద.. కొండొకచో పెద్ద గొర్రెపొట్టేళ్ల మీదకూడా సవారీ చేస్తున్నారు కొందరు. కావళ్లు లయబద్ధంగా మోస్తూ ఓ వరుస సాగిపోతున్నది. పాదచారులైన పురజనులు తమధోరణిలో తాము కదలిపోతున్నారు.
రాజధానిలోని ప్రధాన వీధుల్లో అదీ ఒకటి..
పక్కవీధిలోనే చక్రవర్తుల ప్రాసాదం ఉంది. ప్రధానులు, అమాత్యులు, సేనానులు, ప్రెగ్గడలు నివాసం ఉంటున్న భవంతులు, నగరులు ఆ వీధిలోనే ఉన్నాయి. వీధి విశాలంగా, ఆహ్లాదంగా ఉంది. శుభ్రతతో, ఏపుగా పెరిగిన చెట్లను కూడా.. వీధి అలంకరణకు వాడుకున్నట్లు అంతా కళ్లకు ఇంపైన సహజ ప్రకృతి దృశ్యంలా ఉంది. వీధి పక్కగా నిలబడి చేతులు వెనక్కు కట్టుకుని.. ఆహ్లాదంగా ఉన్న ఆ వీధిని, ఆ పురజనుల కదలికలను చూస్తున్న జాయపను ఆశ్చర్యపరచేలా ఇద్దరు మహిళలు గుర్రాలపై పోతూ కనిపించారు. ఇది అతనికి ఊహాతీతం. వాళ్లు కబుర్లు చెప్పుకొంటున్నారు. నవ్వుకుంటున్నారు. గుర్రాల కదలికలకు తగ్గట్లు చిన్నగా కదులుతున్నారు. ఎంతో అపురూపంగా తోచిందా దృశ్యం జాయపకు.
‘మా అక్కలూ అలా వెళితే?! ఎంత బావుంటుంది?!’..
అనూహ్యంగా వాళ్లిద్దరూ వీధివార నిలబడి చోద్యం చూస్తున్న జాయపను చూసి ఆత్మీయంగా నవ్వారు. నవ్వుతూ కదిలిపోయారు. పలకరింపుగా నవ్వాడు జాయప.
‘అక్కలే! అక్కలైతేనే తమ్ముడితో అలా నవ్వగలరు!’.. బోలెడు నవ్వొచ్చింది జాయపకు.
వీధి విశాలంగా ఉన్నా రద్దీగానే ఉంది. రక్షకభటుల హడావుడి కూడా ఎక్కువగానే ఉంది. వీధి కూడలిలో గుర్రంపై కదలుతూ, అందరినీ కదలమని అదిలిస్తున్నాడో రక్షక భటుడు. చేతిలో కొరడా.. అది విసురుగా, చురుగ్గా దూరంగా వెళ్లి అంతే వేగంగా అతని చేతికి వస్తున్నది. జాయప గుర్తించింది ఏమిటంటే.. ఆ కొరడా ఎవరికీ తగలడం లేదు. బెదిరిస్తోందంతే! అతని మాట వినకపోతే తగులుతుంది కాబోలు. ఆ భటుడి అధికారం, దర్పం, పొగరు.. భలే నచ్చాయి జాయపకు.
‘మహారాజైన మా తండ్రికి, ఇక్కడ చౌండ బాబాయి గారికి కూడా ఇంత పొగరులేదు కదా!’ అనుకున్నాడు జాయప. అప్పుడే కొరడా కొస విసురులు జాయప కళ్లముందు వరకూ వచ్చి, వెనక్కి వెళ్లాయి. తత్తరపడేలోగా అతని కరకుగొంతు ఆ వీధిహోరులో కూడా భయపెట్టేలా వినిపించింది.
“రేయ్.. ఎవ్వరు నువ్!? పో.. గట్ల గా సందులోకి పో. రాచవీధిలో ఏంది గుడ్లప్పగించి చూసేడిది.. పోపో!”..
మళ్లీ కొరడా ముఖం ముందుకొచ్చి వెళ్లింది. అదెంతో బావుంది జాయపకు. మెచ్చుకుందామని అనుకున్నాడు. కానీ, వాడు ఈలోగా ముఖంపైనో వీపుమీదో కొరడాతో నాట్యం చేయిస్తాడనిపించింది. కదిలి పక్క సందులోకి వెళ్లాడు. అలా మరో రెండు వీధులు దాటాడు.
దృశ్యం పూర్తిగా మారిపోయింది. అదొక అంగళ్ల వీధి. వీధికి రెండువైపులా మఠెయలు, అంగళ్లు. కొన్ని రాతి
కట్టుడు భవనాలున్నా.. ఎక్కువ తాటి ఆకులు కప్పి, మట్టి అడుసుతో నిర్మించిన మఠెయలు. ముందంతా తట్టలలో, బుట్టలలో, కుండల్లో, గాజుకుప్పెల్లో, పెరిక సంచులలో నిండుగా పేర్చిపెట్టిన అంగడి వస్తువులు. వెనగ్గా త్రాసు.. ఆ వెనక అందమైన తలపాగాతో కూర్చున్న మఠెయదారు. ఆ సరుకులు జాయపకు తెలియదు. కానీ, ఆ దృశ్యం బావుంది. ప్రతి మఠెయ ఎదుట నిలబడి కొనుగోలు చేస్తున్నవాళ్లు.. సంచులు నెత్తిన పెట్టుకుని వెళ్తున్నవాళ్లు. అంగళ్ల ముందు నడుస్తూ.. అందులోని సరుకును పరిశీలిస్తున్న ఆడా మగా.. మఠెయల మధ్య రహదారి అంతటా ఎడ్లబండ్లు.. కొన్ని కొట్ల ముందు కూడా ఎడ్లబండ్లు ఆపి వాటిపై సరుకు దింపడం.. ఎత్తడం.. జరుగుతున్నది.
ఓ పెద్దమనిషి గుర్రంపై కూర్చుండి ఏదో తింటున్నాడు. అప్పుడు చూశాడు జాయప. అదొక తినుబండారాల అంగడి. అవతలగా మరో పెద్దమనిషి తన పిల్లలకు కోరిన తినుబండారాలు ఇవ్వమని అంగడి సెట్టికి చెబుతున్నాడు. తినుబండారాలు ఇలా వీధిలో అమ్ముతారని అతనికి తెలియదు. కొందరు సంచులలో ఏవో తెచ్చి ఇచ్చి, తమకు కావాల్సిన సరుకులు తీసుకుంటున్నారు. మరో వీధిలో చాలా ఎడ్లబండ్లు విడిచి ఉన్నాయి. బండ్ల పక్క ఎడ్లు నిలిచి ఉన్నాయి. అక్కడ ఆ ఎడ్లకు కావాల్సిన గడ్డి, నీటితొట్టెలు, నీడ కోసం వేసిన చలువపందిరులు, ఎడ్లకు, బండ్లకు కావాల్సిన వస్తువుల అంగడికూడా ఉంది.
ఇలా సందులుగొందులు చూస్తూ పోతున్న జాయపకు ఓ యువతి.. నవ యవ్వనవతి.. వయసు కలిగిస్తున్న చురుకుతో, కాకతీయరాజ్యం కల్పించిన నిర్భీతితో బుట్ట నెత్తిన పెట్టుకుని గొంతెత్తి పాట పాడుకుంటూ వయ్యారంగా పోతున్నది. ఆ పాట జాయపను పట్టేసింది.
“అయ్య సెప్పె అబ్బాయి నచ్చే అమ్మ సెప్పె మామా నచ్చే ఎవ్వరిని ముడేసుకొనే లప్పా..
ఓ అత్తో.. ఎవ్వరిని ముడేసుకొనే.. లప్పా!”..
ఆ పాట భలేగా ఉంది. ఆ జానపద మాధుర్యం అతణ్ని లాగేసింది. చెవులు రిక్కించి ఆ పాట వింటూ ఆమె వెంట పోతున్నాడు. బాటపై ముందున్న గోతిని చూడకుండా కాలువేసి ముందుకుపడ్డాడు. ఆమె దాటిపోయింది.
“అయ్యో బిడ్డా!” అంటూ కొందరు పరుగున దగ్గరికి వచ్చారు. ఒకరు పైకి లేవదీశారు. జాయపకు నొప్పికంటే ఆ పాట దూరమైనందుకు కించిత్తు చిరాకు కలిగింది. తనను లేవనెత్తిన వ్యక్తి వంక తలెత్తిచూశాడు. సుబుద్ధి!!
జాయప ముఖమంతా ఆనందంతో వెలిగిపోయింది. ఎందుకంటే అతను రెండు రోజులుగా సుబుద్ధి గురించే తలపోస్తున్నాడు. వీధిలోకి వచ్చాక మళ్లీ గుర్తుచేసుకున్నాడు. ఆయనే ఇప్పుడు ప్రత్యక్షం కావడంతో జాయప వెర్రి ఆనందంతో అతణ్ని హత్తుకున్నాడు. సుబుద్ధి కూడా ఆత్మీయంగా అదుముకున్నాడు. చౌండ అండలో ఉన్న జాయప.. ఇట్లా మళ్లీ కలుస్తాడని అనుకోలేదు. అందువల్ల అతని మనసు ప్రఫుల్లమయ్యింది.
“ఇంతకాలం ఎక్కడున్నారు జాయప బాబూ?!” అన్నాడతను.
“నేను చౌండ బాబయగారి ఇంట్లో ఉన్నాను బాబయ గారూ!” అన్నాడు హుషారుగా.
తన చేయి పట్టుకుని సొంత కొడుకులా జాయప నడుస్తుంటే.. సుబుద్ధికి ఎంతో ఆనందంగా ఉంది. అయితే అదే సమయంలో జాయప అంశంలో తనస్థాయి ఏమిటో.. అందువల్ల వచ్చే సమస్యలేమిటో..? అతనికి తెలుసు. నడుస్తూనే మెల్లగా అన్నాడు.
“మరి.. చౌండసేనానుల ఇంట్లో ఉండకుండా ఒక్కరే బయటికి ఎలా వచ్చారూ?”..
“ఇవ్వాళ బాబాయిగారు, పిన్నిగారు, కాటయ, పద్మాక్షి ఎక్కడికో వెళ్లారు. అందుకని నేను బయటికి వచ్చాను!” అన్నాడు జాయప.
“మరి.. వారి దౌవారికులు, బయట శ్రీవాకిలి అధికారి.. ఎవ్వరూ మిమ్మల్ని నిలువరించలేదా?”.
“లేదే! ఏమో.. నిలువరించలేదు”.. అన్నాడు జాయప అమాయకంగా.
సుబుద్ధికి కొంత అర్థమైంది. ఈ సామంత యువరాజు పెద్దల గుర్తింపులో లేడు. ఇతని అక్కలను బందీలుగా తెచ్చారు కాబట్టి, కోట లోపల ఉంచి ఉంటారు. కానీ, ఇతనికొక గుర్తింపు లేదు. ‘ఉంటే ఉన్నాడు! పొతే పోయాడు!’ అన్నదే చౌండ సేనానుల ధోరణి కావచ్చు. అందుకే బయటికి వెళ్లినా అడ్డుకోవద్దని చెప్పి ఉండాలి. మళ్లీ వెళ్తే.. లోపలికి రానిస్తారో.. లేదో!?
“ఆ.. సుబుద్ధి బాబయగారూ! అది.. అదిగోఅదేమిటి?” ఆశ్చర్యంగా అడిగాడు జాయప.
అప్పటికి వాళ్లు ఇంకా అంగళ్ల వీధుల్లోనే నడుస్తున్నారు.
“అది గానుగ. అంటే మనం తినే కూరలు.. అవి వండే నూనె, దీపాలు వెలిగించుకునేది, తలకు రాసుకునేది.. ఇలా తీసేదన్నమాట!” వివరించాడు సుబుద్ధి.
ఆ వీధి అంతా గానుగలే. విచిత్రంగా చూస్తూ సుబుద్ధి పక్కగా, అతని చేతిని విడవకుండా పట్టుకుని నడుస్తున్నాడు జాయప. తన ఆలోచనలో తానున్నాడు సుబుద్ధి.
ఆలోచించి..
“ఆ.. యువరాజా! మీరు చౌండసేనానుల వారిని
‘బాబయ గారూ!’ అని పిలిస్తే.. నన్నూ అలా పిలవకూడదు. నన్ను ‘సుబుద్ధీ!’ అని పేరుపెట్టి పిలవండి చాలు”.. అన్నాడు వివరిస్తున్నట్లు.
జాయప వెంటనే..
“అదెట్లా!? మీరు మా బాబయగారిలా ఉన్నారని కదా మిమ్మల్ని అలా పిలిచింది. ఇప్పుడు ఎలా పేరుపెట్టి పిలవగలను!” అన్నాడు.
“అయితే ఇద్దరినీ ‘బాబయ గారూ!’ అని ఎలా పిలుస్తారు?” అన్నాడు సుబుద్ధి.
ఆయన చెప్పడంలో.. ‘అర్థం చేసుకో?’ అనే అనునయం ఉంది. జాయప మాత్రం ఆలస్యం చేయలేదు.
“నాకు ఇద్దరు బాబయలు కదా!?” అన్నాడు.
“నిజమే! కానీ, వారు.. మీరు మహారాజులు. నేను కాదు కదా! మీరు, వారు రాజులు కాబట్టి పిలవవచ్చు. కానీ, నన్ను అలా పిలవకూడదు”.
“మీరూ యుద్ధవీరులే కదా!?”.. అన్నాడు జాయప.. తన వాదనను బలపరుచుకుంటూ.
“యుద్ధంచేసే ప్రతివారూ రాజులు కారు. వేరువేరు స్థాయుల యుద్ధ వీరులుంటారు కదా. నేను అలాంటి వాడినన్న మాట. నన్ను చౌండసేనానుల వారిలా పిలవకూడదు. ఇదిగో మా ఇంటికి వచ్చేశాం. నన్ను ‘మామయ’ అని పిలవండి. మిమ్మల్ని ద్వీపరాజ్యంలో ఉన్న మా బంధువుల అబ్బాయి అని చెబుతా. సరేనా?”.
జాయప ఏదో చెప్పేలోగానే.. సుబుద్ధి పిల్లలు బయటికి వచ్చారు. జాయపను చుట్టుముట్టి ఎగాదిగా చూడసాగారు.
“ఈ అబ్బాయి మన బంధువు. మొన్న ద్వీపరాజ్యం నుంచి సైన్యంతోపాటు వచ్చాడు. పేరు జాయప”.. పరిచయంగా వివరించాడు సుబుద్ధి. జాయప అందరినీ, ఆ ఇంటిని, ఆ వీధిని, ఆ వాతావరణాన్ని వివరంగా చూస్తున్నాడు.
“ఈమె మీ అత్త! అంటే నాభార్య.. సోమిదమ్మ!” అంటూ ఒకామెను పరిచయం చేశాడు.
ఆమెను అలా చూస్తుంటే మరొకామె వచ్చి..
“ఆమె భార్య అయితే మరి నేనెవ్వరిని?” అన్నది
గడుసుగా.
“ఈమె కూడా నా భార్యే. రెండో భార్య బాలాంబ”.. అన్నాడు సుబుద్ధి పరిచయంగా.
ఆమె నవ్వింది పలకరింపుగా! ఆమె మాట నచ్చింది జాయపకు. తనూ నవ్వాడు జవాబుగా.
(సశేషం)
సుబుద్ధికి కొంత అర్థమైంది. ఈ సామంత యువరాజు పెద్దల గుర్తింపులో లేడు. ఇతని అక్కలను బందీలుగా తెచ్చారు కాబట్టి, కోట లోపల
ఉంచి ఉంటారు. ‘ఉంటే ఉన్నాడు! పొతే పోయాడు!’ అన్నదే చౌండ సేనానుల ధోరణి కావచ్చు.