AA 23 | సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత సినీ పరిశ్రమలో గాసిప్స్, ఊహాగానాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా భారీ ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినా రూమర్లు వైరల్ అవుతున్నాయి. తాజాగా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘AA23’ చిత్రం ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నిలిచిపోయిందని వచ్చిన వార్తలతో, అది అల్లు అర్జున్-లోకేష్ సినిమా అనే ప్రచారం నెట్టింట జోరుగా సాగింది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో, అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా బన్నీ, లోకేష్ కాంబోపై భారీ అంచనాలు ఉండటంతో ఈ రూమర్లు మరింత వైరల్ అయ్యాయి.
అయితే ఈ ఊహాగానాలకు ప్రముఖ దర్శకుడు, రచయిత రత్నకుమార్ చెక్ పెట్టారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్బస్టర్ చిత్రం ‘విక్రమ్’ విడుదలై నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా లోకేష్ను అభినందిస్తూ, తాను ‘AA23’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. రత్నకుమార్ నేరుగా రూమర్ల గురించి స్పందించకపోయినా, ఆయన చేసిన వ్యాఖ్యలతో అల్లు అర్జున్-లోకేష్ ప్రాజెక్ట్ ఇంకా కొనసాగుతోందనే సంకేతాలు స్పష్టమయ్యాయి. దీంతో సినిమా ఆగిపోయిందన్న ప్రచారానికి ఒక్కసారిగా బ్రేక్ పడింది. అభిమానులు కూడా ఊరట చెందారు.
ఈ రూమర్లకు మరో కారణం కూడా ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో భారీ బడ్జెట్ చిత్రం ‘రాకా’ లో నటిస్తున్నారు. ఆ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో మరో ప్రాజెక్ట్ చేయనున్నట్లు సమాచారం. మరోవైపు లోకేష్ కనగరాజ్ తన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఖైదీ 2’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇద్దరి షెడ్యూల్స్ కూడా బిజీగా ఉండటంతో ‘AA23’ ఆలస్యమవుతుందనే ప్రచారం మొదలైంది. అయితే ఫిల్మ్నగర్ వర్గాల సమాచారం ప్రకారం, సోషల్ మీడియాలో చర్చకు వచ్చిన ‘ఆగిపోయిన ప్రాజెక్ట్’ పూర్తిగా వేరే సినిమా అని, దానికి ‘AA23’ తో ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. రత్నకుమార్ వ్యాఖ్యలతో ఈ విషయంపై మరింత స్పష్టత వచ్చింది.