న్యూఢిల్లీ: భారతీయ వైమానిక రక్షణ సామర్థ్యం మరింత మెరుగుపడింది. ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ వ్యవస్థ(S-400 Missile System)కు చెందిన ఫోర్త్ స్క్వాడ్రన్ ఇండియాకు చేరుకున్నది. ఈ క్షిపణి వ్యవస్థను రష్యా నుంచి కొనుగోలు చేశారు. ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లో క్షిపణులు, లాంచర్లు, సెన్సార్లు, రేడార్లు ఉంటాయి. అయితే దశల వారీగా రష్యా నుంచి భారత్కు ఈ పరికరాలు వస్తున్నాయి. దీనిలో భాగంగా తొలి కన్సైన్మెంట్ ఇవాళ చేరుకున్నట్లు అధికారులు చెప్పారు. రాబోయే రోజుల్లో మిగితా పరికరాలు దిగుమతికానున్నాయి. ఒకసారి అసెంబ్లింగ్ చేస్తే, ఇక భారతీయ వైమానిక దళం ఎస్-400 క్షిపణి వ్యవస్థను ఆపరేషన్లోకి తీసుకురావచ్చు.
2018లో రష్యాతో ఎస్-400 కొనుగోలు కోసం 5.4 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే రెండేళ్ల క్రితం మూడు క్షిపణి వ్యవస్థలను డెలివరీ చేశారు. ఇక రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల మరో రెండు సిస్టమ్ల డెలివరీ ఆలస్యం అవుతోంది. గత ఏడాది ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్రూయిజ్ మిస్సైళ్లను ఎస్-400 సిస్టమ్ సమర్థవంతంగా ఎదుర్కొన్నది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎస్-400 పనితీరుకు చెందిన ఓ వీడియోను కూడా వైమానిక దళం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ విమానాన్ని ఎస్-400 సిస్టమ్ కూల్చివేసినట్లు ఐఏఎఫ్ చెప్పింది.
అయిదో స్క్వాడ్రన్కు చెందిన ఎస్-400 మిస్సైల్ సిస్టమ్ ఈ ఏడాది చివర వరకు భారత్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి.