Jaya Senapathi | జరిగిన కథ : ఒకనాడు మిత్రబృందంతో వచ్చి జాయపుణ్ని కలిశాడు పుళిందపుడు. దండరాసకం ఆటలో పాల్గొనాలని కోరాడు. ఆసక్తిగా తనవెంట ఉద్యానవనానికి వెళ్లాడు జాయపుడు. అక్కడంతా తెలిసిన మిత్రులే ఉన్నారు. వారిలో ఇంద్రాణి కూడా ఉన్నది. ఇద్దరూ కన్నులతో పలకరించుకున్నారు. ఆడటానికి ఉద్యుక్తులయ్యారు. మిత్రులంతా క్రీడాకారులయ్యారు. అయితే, అక్కడన్నీ వృక్షాలు అల్లుకుని ఉన్నాయి. ఆ చెట్ల కొమ్మలకు వేలాడుతున్న గోగునార పాయలను అందరూ ఆశ్చర్యంగా చూశారు.
కార్యక్రమ నిర్వాహకుడు పుళిందపుడు గొంతెత్తి ప్రకటించాడు. “దండరాసకం ఆడుతూ వేలాడుతున్న గోగునారతో జడ అల్లాలి. ఎవరు ముందుగా పూర్తి చేస్తారో.. వారు ప్రథములవుతారు”.. ‘ఓహ్! ఇదేదో కొత్త సృజన.. బావుంది బావుంది!’ అనుకున్నాడు జాయపుడు. ఇంద్రాణి వైపు చూశాడు. అప్పటికే ఆమె అతనివంక చూస్తున్నది. తనక్కూడా ఆసక్తి ఉన్నట్లు ఆమె కనుదోయి ప్రకటించింది. దగ్గరగా వచ్చినప్పటి బిడియపు స్పందన.. దూరాన ఉన్నప్పుడు లేదు. దూరంనుంచి రాగప్రసారం సమున్నతం.
“అల్లిక అంటే అమ్మాయిలే నెగ్గుతారుగా పుళిందపా..” అన్నారెవరో గట్టిగా, హాస్యయుతంగా. అవునవునంటూ అమ్మాయిలంతా తమ కేశసంపదను ప్రదర్శిస్తున్నట్లుగా.. వెనకనున్న తమ జడలను సుతారంగా ముందుకు తెచ్చారు.
అందరికంటే పొడవైన జడ ఇంద్రాణిదే! సంభ్రమంగా చూశాడు జాయపుడు. ఆమెకు అంత కేశసంపద ఉన్నట్లు అప్పటివరకూ గుర్తించకపోవడం ఘోరమైన తప్పుగా, తీవ్రంగా కుమిలిపోయాడు. ఆమెను అభినందనగా చూశాడు. ఆమె ప్రకటించిన స్మితం మహత్తరం.
“నాది పిలకజడ.. కాబట్టి ఇంద్రాణి కంటే నేనే వేగంగా జడ అల్లగలను!”.. అందరినీ నవ్వించింది లవంగిక. అంతా ఉత్సాహంగా దండియలు కదుపుతూ పక్కన తగిన స్నేహితుణ్ని లేదా స్నేహితురాలిని కోరి ఉంచుకుంటున్నారు. తన పక్కకు రమ్మన్నట్లు ఇంద్రాణిని అభ్యర్థించాడు జాయపుడు. ఆమె బిడియంగా చూసి.. ఇష్టమేనన్నట్లు చిరునవ్వు నవ్వి, కదిలి వస్తూవస్తూ మరోచోట ఆగిపోయింది.
‘ఈ కోమలాంగికి కచ్చితమైన నిర్ణయం తక్కువనుకుంటా..’ నిట్టూర్చాడు జాయపుడు. క్రీడ మొదలయ్యింది. సంగీతం ప్రారంభమయ్యింది. డోలు, సన్నాయి జమిలిగా మారుమోగుతున్నాయి. మెల్లగా మొదలై లయబద్ధంగా పడుతున్న అడుగులవెంట.. అంతే లయబద్ధంగా మోగుతున్న దండియలు. అదే సమయంలో పట్టుకున్న నారను పాయలుతీస్తూ, వడివడిగా జడ అల్లడానికి క్రీడాకారులు పడుతున్న ఆతృత! రానురానూ అన్నీ సంగమిస్తూ.. ఆటలో ఉరవడి పెరుగుతున్నది. ముచ్చట్లు, వ్యాఖ్యలు.. అమ్మాయిలపై అబ్బాయిలు.. అబ్బాయిలపై అమ్మాయిలు.. జోరు పెరుగుతున్నది. దండియల ధ్వని కూడా రెచ్చిపోతున్నది.
దండియలు.. నాట్యాలు.. అల్లికలు..
నాట్యాలు.. దండియలు.. అల్లికలు..
అల్లికలు.. నాట్యాలు.. దండియలు..
అన్నీ కలగలిసిపోతూ.. ఉద్యానమంతా ఉర్రూతలూగుతున్నది. చాలామంది జడ అల్లడమూ పూర్తవుతున్నది. తను అల్లుతూ అందరినీ చూస్తూ.. ముఖ్యంగా ఇంద్రాణిని చూస్తూ, చూపులతో ప్రోత్సహిస్తూ.. జాయపుడు. తాను గెలవకూడదని ముందే నిశ్చయించుకున్నాడు. గెలవడం కంటే అందరి క్రీడాతత్వాన్ని చూస్తూ వీలైతే ఇంద్రాణిని గెలిపిస్తే ఎలా ఉంటుంది!?? అప్పుడప్పుడూ మధ్యమధ్య పెద్దపెట్టున అరుస్తున్నారు ముమ్మడి, సుగ్రీవ, సీమంతిని. ఆమెకు, లవంగికకు మధ్య పోటీ.. ‘నువ్వా నేనా!?’ అన్నట్లుంది. ఇంద్రాణి చెమటలు కక్కుతూ అల్లుతున్నది గానీ, కాస్త వెనకపడినట్లే.. ఉన్నట్టుండి అరిచాడు జాయపుడు..
“జడ అల్లడం మాత్రమే కాదు. ఆ జడను తిరిగి ఊడదీయాలి. అప్పుడే గెలిచినట్లు!”. అందరూ గందరగోళంగా మాట్లాడారు. కానీ, చివరికి పుళిందపుడు.. “జాయపుడు లేవనెత్తిన క్రీడాంశం సబబే! ఇది దండరాసకానికి మరొక కొత్త జోడింపు..” అని ప్రకటించాడు. క్రీడాప్రాంగణం మరోసారి ఉవ్వెత్తున ఉత్సాహంతో తేజరిల్లింది. చివరికి ఎంత పాకులాడినా.. ఇంద్రాణి గెలవలేకపోయింది. జాయపుడు తన సానుభూతిని ప్రకటించాడు. క్రీడ అద్భుతంగా విజయవంతమైంది. ఇలాంటి కార్యక్రమాలు, క్రీడలు మరిన్ని జరపాలని తీర్మానిస్తూ పుళిందపుణ్ని అందరూ అభినందించారు. అందరూ ఒక్కసారిగా వెళ్లడానికి ఉద్యుక్తులవగా.. వెళ్తూవెళ్తూ ఇంద్రాణి దగ్గరగా వెళ్లి..
“అనుమకొండలో గుండయామాత్యుని గురుకులానికి వస్తే సంతోషం..” అన్నాడు జాయపుడు. ఆమె తల ఎత్తి చూసి, అంగీకారంగా తల ఊపింది. “సత్వరమే! అంటే రేపే!”.
* * *
అప్పటికి ఓ జాము నుంచి గురుకులం ముఖద్వారం వద్దకు, లోపలికి తిరుగుతున్నాడు జాయపుడు. ఇంద్రాణి కనుచూపు మేరలో లేదు. కొత్త విద్యార్థులకు జాయపుడొక అపురూప అనుసరణీయుడు. జాయపుణ్ని ఇప్పుడు గురుకులంలో ఆట పట్టించేవారు ఎవ్వరూ లేరు. గతంలో ఉండే బిడియం తగ్గి, అతనిలో ఆత్మవిశ్వాసం మెండుగా నిండుగా తొణికిసలాడుతున్నది. అతని అసాధారణ ప్రతిభ, అందచందాలు, అతిసాధారణ ప్రవర్తన అక్కడున్న కులీన యువతీ యువకులకు విభ్రమం. అక్కడికి జాయపుడు వచ్చాడంటే సత్కళా కాలక్షేపమే. ఎన్నో గమ్మత్తయిన నాట్యాంశాలు చెప్తాడు.. చేసి చూపుతాడు. పేరుపేరునా పలకరించి నవ్వించి వెళ్తాడు. ఈరోజూ జాయపునితో కబుర్లను పెద్దలు – పిన్నలు ఆశిస్తున్నారు. కానీ, ఆయన మాత్రం కాలుకాలిన మార్జాలంలా లోపలికీ బయటికీ తిరుగుతున్నాడు. బయటికి వచ్చి దూరంగా చూస్తున్నాడు కానీ.. ఇంద్రాణి పల్లకి జాడ లేదు. జాయపుని అసహనం చూస్తున్న అశోకుడు అడిగాడు..
“ఏమిటి జాయపా! ఎవరికోసం ఎదురుచూపులు.. కాకతి కోసమేనా?”. అప్పుడొచ్చిపడ్డాడు ఇహలోకంలోకి జాయపుడు. అరెరే.. కాకతి?! కాకతి రానురానూ తన మనో ఫలకం నుంచి చెరిగిపోతోందేమి?.. కాసేపు నిర్విణ్నుడై నిలబడిపోయాడు. ఆరోజంతా అదే అసహనం. రాలేదు ఇంద్రాణి. మరి ఆమె గురించి తనెందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నాడు.. ‘తప్పు! ఇక ఆలోచించను’ అనుకున్నాడు. కానీ, మరునాడు వచ్చింది ఇంద్రాణి.
“జాయపులవారు క్షమించాలి!”..
ఆమె కంఠం వినగానే నిన్నటి రోజంతా సతమతం చేసిన అసహనం ఎవరో తుడిచేసినట్లు మాయమైపోయింది. ఆమె రావడమే రాజనగరి పల్లకిలో ముందూ వెనక అశ్వాలపై రక్షకభటులు వెంట రాగా.. పరివార సమేతంగా వచ్చింది. ఆమెను చూసి గురుకులమంతా ఉత్తేజితమవ్వలేదు కానీ, జాయపుడు మాత్రం హడావుడి చేసేశాడు.
“ప్రభువులవారి సోదరుని కుమార్తె.. ఇంద్రాణి దేవి. గొప్ప గాయని..” అంటూ అందరికీ పరిచయం చేశాడు. సాధారణంగా రాజనగరి నివాసులు గురుకులాలకు రారు. గురువులనే తమ నివాసాలకు పిలిపించుకుంటారు. గురుకుల విద్యార్థుల్లో ఎక్కువగా ధనవంతులు, కొండొకచో సాధారణ కుటుంబాలవారూ ఉంటారు. సహజంగానే రాజనగరి నివాసులంటే కులీనుల్లో ఉత్తమస్థాయి అని భావిస్తూ గౌరవిస్తారు. కానీ, గురుకుల నియమాలు అందరినీ సమానంగానే చూస్తాయి. ఆమెను అందరూ సాధారణంగానే గౌరవించారు కానీ జాయపుడే కాస్త ఎక్కువ హడావుడి చేశాడు. సంగీతశాస్త్ర గురువు సుగ్రీవకు, సాహితీ గేయరచన గురువు మాజీకునికి ఇంద్రాణిని పరిచయం చేశాడు.
“నువ్వు రచించిన గేయం ఏదైనా పాడు.. దాని మంచి చెడ్డలు విచారించి రాగయుక్తం చెయ్యడం ఎలాగో ఆలోచిద్దాం..” అన్నాడు అశోకుడు. ఇంద్రాణి గొంతు సవరించుకుని ఓ పాట నాలుగు పంక్తులు పాడింది.
“సింగార మిదే.. నామదిలో మెదలాడిన.. సింగార మిదేనోయి.. నా తనువునెల్లా చుట్టేసిన.. శృంగారపట్టు చీరే.. భవత్ హృదయోద్ప్రఫుల్ల సమరస ముప్పార.. సింగార మిదే.. నామదిలో ఎగసిన శృంగారమిదే!”.
“చాలు చాలు.. బావుంది. పాటో గేయమో.. అందులో శ్రవణపేయమైన శబ్దలాలిత్యం ఉండాలి. మూడవ వరుసలో పెద్ద క్లిష్టసమాసం వేశావు. అది అక్కడ ఒప్పదు. ఏదైనా అలతి అలతి పదాలతో ఉన్న పాటలో పెద్ద సమాసం ఇమడదు. నీ పేరేమిటి? జాయపా.. ఈ అమ్మాయి పేరేమిటి చెప్పావ్..?”.
“ఇంద్రాణి.. ఇంద్రాణి!”.
“ఆ.. ఇంద్రాణి! పెద్దసమాసం వల్ల శబ్దసౌందర్యం ఇనుమడిస్తుంది.. నిజమే! కానీ అలతి అలతి.. పదాలే పాటను శ్రోతకు చేరువ చేస్తాయి”.
“అలాగే గురువుగారు.. తప్పక మీసలహా ప్రకారమే గేయాన్ని రాయడానికి యత్నిస్తాను..” అన్నది ఇంద్రాణి. అనంతరం విద్యార్థులు.. జాయపుడు, ఇతర పరిశోధకులతో మాటామంతి నెరపింది. తర్వాత ఓ గదిలో జాయపుడు, ఇంద్రాణి ఏకాంతంగా కూర్చుని కబుర్లు చెప్పుకొన్నారు. దాదాపు ఓ రెండు గంటలు.
దూర దూరంగా నిలబడి కన్నులతో చెప్పుకొన్న ఊసులెన్నో.. ఇక్కడ మాటల పాటలై పరిమళించాయి. జాయపుడు గుర్తించిందేమిటంటే.. ఏకాంతంలో ఆమె కబుర్లపోగు! అతను మాట్లాడటానికి అవకాశమే లేదు. తన గురించి.. తన తల్లిదండ్రుల గురించి.. రాజవంశాల గురించి.. తన అందచందాల గురించి.. తన గానం.. గేయ ప్రావీణ్యం.. తనతో మిత్రురాళ్లు ఎలా ప్రవర్తిస్తారో.. ఇలాంటివే ఆ కబుర్లన్నీ!లేచి వస్తున్నప్పుడు అన్నది జాయపునితో..
“ఇక్కడ విద్యార్థులందరూ బానిస కుటుంబాల వాళ్లలా ఉన్నారే! ఓ రాజవంశపు యువతిని ‘నువ్వు.. గివ్వు’ అని మాట్లాడటం.. ఛ ఛ! మాకేమీ నచ్చలేదు జాయపసేనానీ!”. విస్తుపోయాడు జాయపుడు. కొన్ని లిప్తల్లో తమాయించుకున్నాడు. ఆ కొన్ని లిప్తల్లోనే.. అతనికి అనేకానేక అంశాలు అవగతమయ్యాయి. ఆమె రాజనగరిలో జన్మించి ఎదిగిన కులీనురాలు. కవయిత్రి, సంగీతజ్ఞురాలు అయినా.. ఆమె ఆలోచనా ధోరణి వేరు.
ఆమె తదనుగుణంగానే ప్రవర్తించింది. ఈ కబుర్లలో అతనికి ఎన్నో నేర్పించింది. ముఖ్యంగా తానింతవరకూ ప్రవర్తిస్తున్న సరళికి.. తాను ప్రవర్తించాల్సిన సరళికి తేడా ఆమె చెప్పకనే చెప్పింది. తానిప్పుడు పరిపూర్ణ రాజయువకుడు. కేవలం జాయప కాదు.. జాయపసేనాని. తానిప్పుడు రాజనగరి నివాసి. కాబట్టి అందరూ తనను ఏకవచనంతో పిలవకూడదు. బహువచనంతోనే మాట్లాడాలి. రాజవంశ మిత్రులు, మిత్రురాళ్లు కూడా అలాగే ప్రవర్తిస్తారు.. తానూ అలాగే ప్రవర్తించాలి.. జీవించాలి. రేపు వివాహమైతే తనభార్య కూడా ఇదే గౌరవ హోదాలు కోరుకుంటుంది కాబోలు.. ఇద్దరూ బయటికి వచ్చారు. రాజోచిత రక్షకభటుల మధ్య బయల్దేరింది. పల్లకి ఎక్కబోతుండగా అడిగాడు జాయపుడు..
“అడగడం మర్చిపోయాను.. నిన్న తమరు రాలేదు. కారణం అడగలేదు. తమరు చెప్పలేదు!”. ఆమె నవ్వి.. “నిన్న మా పల్లకి బోయీలు రాలేదు. అందుచేత మేం రాలేకపోయాం. క్షమించాలి సేనానీ!”.
గోముగా జాయపుని హృదయం కరిగేలా ప్రేమమయ దృక్కులతో అన్నది ఇంద్రాణి. ఈసారి జాయపుని హృదయం పెద్దగా స్పందించలేదు. అర్థమైనట్లు తల పంకించాడు. ముందు పల్లకిలో ఇంద్రాణి.. వెనుక అశ్వంపై జాయపుడు.
ఏదో ఆలోచిస్తూ పోతున్న జాయపుణ్ని.. ఓ బిచ్చగాడు పాడుతున్న పాట ఆపేసింది. అతని కుడిభుజంపై ఏదో వాద్యం, దానికి పైభాగాన ఉన్న ఎండు గుమ్మడిబుర్ర.. ఎడమ చేతివేళ్లతో చిన్న ఇత్తడిచిడతలు పట్టి, కుడిచేత్తో వాద్యానికున్న తీగెలను సవరిస్తూ.. ఏదో తత్వగీతం ఆలపిస్తున్నాడు. అశ్వం దిగాడు జాయపుడు. నమస్కరించాడు. ఆ బిచ్చగాడు స్థాణువైపోయాడు. కంగారుపడిపోయాడు. చూస్తున్న జనంకూడా ఆశ్చర్యపోయారు. ‘ఎవరో రాజవంశీయుడు బిచ్చగాడికి నమస్కరించడం.. అమ్మో.. దారుణం! కలికాలం కాకపోతే ఏమిటి!?’. ఆ జనాన్ని పట్టించుకోకుండా అతణ్ని భుజంపట్టి అక్కడున్న ఇంటి అరుగుపై కూర్చోబెట్టి, పక్కనే కూర్చున్నాడు జాయపుడు.
“ఊ.. అద్భుతం నీ గీతం! సరే.. అదిలా ఇవ్వు. ఏమిటీ వాద్యం? భలే మోగుతున్నదే!? శ్రుతి కూడా అదిరిపోతున్నది కదా!” అంటూ ఆ వాయిద్యాన్ని తీసుకుని.. పసిపాపను ఎత్తుకున్నట్లు ఒడిలోపెట్టుకుని పరీక్షించసాగాడు. జీవితంలో తొలిసారి తన వాయిద్యాన్ని ఓ కులీనుడు గుర్తించి అభినందించడం.. ఆ బిచ్చగాని ముఖంలో ఓ మైమరపు.
(సశేషం)
-మత్తి భానుమూర్తి
99893 71284