World Cup | సొంత గడ్డపై ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023)ను టీమ్ ఇండియా (Team India) జట్టు చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియా (Australia) తో జరిగిన టైటిల్ పోరులో రోహిత్ సేన పరాభవం పాలైంది. దీంతో మూడోసారి వరల్డ్ కప్ను ముద్దాడాలనుకున్న టీమ్ఇండియా కల కలలానే మిగిలింది. ఇక ఈ టోర్నీలో తొలి నుంచి దూకుడుమీదున్న రోహిత్ సేన ఫైనల్స్లో ఓటమి చవిచూడటంతో ఆటగాళ్లతోపాటు కోట్లాది మంది భారతీయుల కళ్లు ఒక్కసారిగా చెమర్చాయి. భారత్ ఓటమిని ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. ఈ కష్టసమయంలో పలువురు ప్రముఖులు టీమ్ఇండియాకు మద్దతుగా నిలుస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) ఆసక్తికరంగా స్పందించింది. 11 ఏళ్ల క్రితం టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) పెట్టిన ఓ స్ఫూర్తిదాయక పోస్ట్ను ఇప్పుడు టీమ్ఇండియాకు అనుకూలంగా మార్చి పెట్టింది. 2012 ఆగస్టులో (inspirational 2012 post) ధోనీ ‘మీరు కొన్ని గెలుస్తారు.. కొన్ని ఓడిపోతారు. ఆటలో ఉన్న మాధుర్యం అదే’ అని పోస్ట్ చేశారు. దాన్ని జొమాటో సంస్థ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చి ‘మీరు కొన్ని గెలుస్తారు, కొన్ని కోల్పోతారు. కానీ టీమ్ ఇండియా.. మేము మీకు మద్దతు ఇవ్వడం ఎప్పటికీ ఆపము’ అంటూ పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెటిజన్లను, క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
వరల్డ్ కప్ లీగ్ దశలో టీమిండియా తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్ల్లో గెలిచింది. కీలకమైన సెమీస్లోనూ 2019 రన్నరప్ న్యూజిలాండ్ను 70 పరుగులతో చిత్తు చేయడంతో ఈసారి ట్రోఫీ మనదే అనుకున్నారంతా. అయితే.. దక్షిణాఫ్రికాను ఓడించి ఆస్ట్రేలియా ఫైనల్ చేరడంతో ట్రోఫీ దక్కేనా? అని మనసులో సందేహం. అనుకున్నట్టుగానే కంగారూల చేతిలో రోహిత్ సేన ఓటమిపాలైంది. అహ్మాదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో భారత్ తడబడింది. ఆసీస్ పేసర్ల విజృంభణతో 240 పరుగులకే పరిమితమైంది. లక్ష్య ఛేదనలో ఆదిలోనే మూడు కీలక వికెట్లు తీసినప్పటికీ ట్రావిస్ హెడ్(137), మార్నస్ లబూషేన్(58 నాటౌట్) గోడలా నిలబడ్డారు. దాంతో, 7 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆసీస్ ఆరోసారి ప్రపంచ కప్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది.
Also Read..
Anand Mahindra | ఓటమిని కూడా అంగీకరించాల్సిందే.. టీమ్ఇండియా పరాజయంపై ఆనంద్ మహీంద్రా ట్వీట్
Virat Kohli | చేజారిన ప్రపంచ కప్.. కోహ్లీని ఓదార్చిన అనుష్క.. పిక్స్ వైరల్