బంజారాహిల్స్, ఆగస్టు 7 : ఎటుచూసినా ఎత్తైన కొండలు.. అడవిని తలపించేలా భారీ వృక్షాలు.. పక్కనే ఉన్న కేబీఆర్ పార్కుతో పోటీపడేలా పచ్చదనంతో నగరం నడిబొడ్డున బంజారాహిల్స్ రోడ్ నంబర్-10లోని సుమారు 11 ఎకరాల ఖాళీ ప్రభుత్వ స్థలంపై కాంగ్రెస్ సర్కార్ పెద్దల కన్నుపడింది. సుదీర్ఘ న్యాయపోరాటాల అనంతరం బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో కరోనా లాక్డౌన్ సమయంలో కంచెలు వేయించి కాపాడిన స్థలాన్ని, కాంగ్రెస్ సర్కార్ పెద్దలు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే కుట్రలకు తెరతీశారు. ప్రభుత్వ పెద్దల అండదండలు పుష్కలంగా ఉన్న మెగా సంస్థకు చెందిన భారీ యంత్రాలు, ట్రిప్పర్లు పచ్చదనాన్ని కబళించివేస్తున్నాయి. ఎలాంటి అనుమతి లేకుండా భారీ వృక్షాలను నేలమట్టం చేస్తూ వేలాది టన్నుల మట్టిని బండరాళ్లను తీసుకువచ్చి పచ్చదనాన్ని నాశనం చేస్తున్నాయి. ఇప్పటికే కేబీఆర్ పార్కు చుట్టూ జీహెచ్ఎంసీ వాక్వేతోపాటు ఫుట్పాత్లు, సెంట్రల్ మీడియన్లో వందలాది వృక్షాలను హెచ్ సిటీ పేరుతో నిర్దాక్షిణ్యంగా నరికివేసిన ఘటన మరువకముందే పోలీస్ కమాండ్ కంట్రోల్కు సమీపంలోని వందలాది మొక్కలను నేలకూల్చడం పర్యావరణ ప్రేమికులను కలచివేస్తున్నది.
షేక్పేట మండల పరిధి సర్వే నంబర్-403లోకి వచ్చే బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు చుట్టూ ప్రభుత్వం హెచ్ సిటీ పేరుతో నిర్మించతలపెట్టిన ఫ్లై ఓవర్లు, అండర్పాస్ నిర్మాణ పనులను మెగా ఇంజినీరింగ్ సంస్థ చేపట్టింది. ఇందులో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నంబర్-14 నుంచి ఫిల్మ్నగర్, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వెళ్లే దారుల్లో తవ్వకాలు చేపట్టింది. ఈ తవ్వకాల్లోని మట్టి, బండరాళ్లను తెచ్చి బంజారాహిల్స్ రోడ్ నంబర్-10లోని తట్టిఖానా సెక్షన్ జలమండలి రిజర్వాయర్ పక్కనున్న ప్రభుత్వ స్థలంలో డంపింగ్ చేస్తున్నది. ఈ స్థలం మొత్తం రెవెన్యూశాఖ ఆధీనంలో ఉండగా, ఎలాంటి అనుమతి లేకుండా రాత్రికిరాత్రే స్థలాన్ని స్వాధీనం చేసుకున్న నిర్మాణసంస్థకు చెందిన వ్యక్తులు గత 15 రోజులుగా వందలకొద్దీ ట్రిప్పుల మట్టి, బండరాళ్లను డంపింగ్ చేస్తున్నారు. భారీ హిటాచీలు, జేసీబీలతో ఎప్పటికప్పుడు ట్రక్కుల ద్వారా తెచ్చిన మట్టిని లోయలోకి పోస్తుండటంతో వందలాది వృక్షాలు మట్టిలో కూరుకుపోతున్నాయి. గత 15 రోజుల్లో సుమారు 2వేల వరకు భారీ వృక్షాలను ధ్వంసం చేసినట్టు అంచనా. ఎన్నో ఏండ్లుగా న్యాయస్థానం పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలం చుట్టూ బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి షేక్పేట తహసీల్దార్ చంద్రకళ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఫెన్సింగ్ వేయించారు. అంతకుముందు పలుమార్లు ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఫెన్సింగ్ వేసిన తర్వాత స్థలంలోకి వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో భారీ అడవిలా మారింది. తాజాగా మట్టి డంపింగ్తో వందలాది చెట్లు మట్టిలో కూరుకుపోయాయని, దీంతో పర్యావరణానికి ఎనలేని నష్టం వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
హెచ్ సిటీ ప్రాజెక్టు పనుల కోసం స్థలాన్ని తాత్కాలికంగా వినియోగిస్తున్నారని రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే జలమండలి రిజర్వాయర్కు కుడివైపున ఉన్న 1.20 ఎకరాల జలమండలి స్థలాన్ని, 3.20 ఎకరాల రెవెన్యూ స్థలాన్ని మెగా ఇంజినీరింగ్ సంస్థకు చెందిన యంత్రసామగ్రి, వాహనాలు, ఇతర వస్తువులు పెట్టుకొనేందుకు రెవెన్యూ అధికారులు అప్పగించారు. దీనికి తోడు జలమండలి రిజర్వాయర్కు ఎడమవైపున ఉన్న 11 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని డంపింగ్ చేస్తుండడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతమైన బంజారాహిల్స్లో ఎకరం స్థలం విలువ సుమారు రూ.200కోట్లు ఉంటుందని, 11ఎకరాల స్థలం విలువ రూ.2,200కోట్లకు పైమాటే అని తెలుస్తున్నది. ఇంతటి ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నాల్లో భాగంగానే స్థలంలో మట్టిని డంపింగ్ చేస్తున్నారని, దీనికి ప్రభుత్వ పెద్దల సహకారం ఉన్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.