నింగ్బొ (చైనా): బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్స్లో యువ షట్లర్ ఆయుష్ శెట్టి సంచలనాలు కొనసాగుతున్నాయి. అంచనాలే లేకుండా బరిలోకి దిగి తనకంటే మెరుగైన ర్యాంకర్లకు షాకులిస్తున్న ఈ మంగళూరు కుర్రాడు.. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లోనూ మరో టాప్సీడ్ షట్లర్ను ఇంటిబాట పట్టించాడు. క్వార్టర్స్ పోరులో ఆయుష్.. 23-21, 21-17తో నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేషియా)ని చిత్తు చేసి సెమీస్ చేరాడు.
తన కెరీర్లో తొలిసారి క్రిస్టీతో ఆడిన ఆయుష్.. ప్రత్యర్థిపై రెండు గేమ్స్లోనూ సంపూర్ణ ఆధిపత్యం కనబరిచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. పదునైన స్మాష్లకు తోడు పటిష్టమైన డిఫెన్స్తో ఆకట్టుకున్నాడు.తొలి గేమ్ ఆరంభం నుంచే 5-3 ఆధిక్యంతో ఉన్న ఆయుష్.. మధ్యలో క్రిస్టీ దానిని 16-13కు తగ్గించి, ఒక దశలో 18-18తో స్కోర్లు సమమై అతడికి గేమ్పాయింట్ దక్కినా ఇండోనేషియా షట్లర్ చేసిన తప్పిదంతో గేమ్ భారత కుర్రాడి వశమైంది.
రెండో గేమ్ మరింత రసవత్తరంగా మారగా స్కోర్లు 17-18గా ఉన్న సమయంలో మూడు మ్యాచ్ పాయింట్లు సాధించిన ఆయుష్.. సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. ఈ టోర్నీలో ఆయుష్ ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా సెమీస్ చేరుకోవడం గమనార్హం. ఫైనల్లో అతడు టాప్ సీడ్ కున్లావత్ విదిత్సరన్ (థాయ్లాండ్)ను ఢీకొననున్నాడు.