Womens T20 WC : దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్లో సెమీస్ పోరు ఆసక్తికరంగా మారింది. గ్రూప్ -2లో మూడు విజయాలు, ఆరు పాయింట్లతో ఇంగ్లండ్ టాప్లో ఉంది. దాంతో ఆ జట్టు సెమీస్ చేరడం ఖాయం. ప్రస్తుతం భారత జట్టుకు రెండు విజయాలు, నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ రెండు పాయింట్లతో మూడో ప్లేస్లో ఉంది. వెస్టిండీస్ ఫోర్త్ ప్లేస్లో నిలిచింది. ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఐర్లాండ్ గ్రూప్ -2లో అట్టడుగున ఉంది.
టీమిండియా సెమీస్ అవకాశాలు పాకిస్థాన్, వెస్టిండీస్ మ్యాచ్పైన ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ విండీస్ గెలిస్తే భారత్కు కలిసొస్తుంది. ఇండియా తన చివరి లీగ్ మ్యాచ్లో ఫిబ్రవరి 20న ఐర్లాండ్పై విజయం సాధిస్తే నేరుగా సెమీస్ చేరుతుంది. అలాకాకుండా విండీస్పై పాకిస్థాన్ గెలిస్తే.. ఆ జట్టు రెండో స్థానానికి చేరుతుంది. నాలుగు పాయింట్లు మాత్రమే ఉన్నప్పటికీ ఇండియా కంటే పాక్ నెట్ రన్ రేటు మెరుగ్గా ఉంది. అందుకని ఐర్లాండ్తో మ్యాచ్లో హర్మన్ప్రీత్ సేన కచ్చితంగా గెలవాలి. లేదంటే ఇంగ్లండ్ తన తదుపరి మ్యాచ్లో పాకిస్థాన్ను చిత్తుగా ఓడించాలి. అప్పుడు ఇండియా సెమీస్ చేరే అవకాశం ఉంది.
పొట్టి ప్రపంచకప్లో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. ఇంగ్లండ్పై 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. స్మృతి మంధాన అర్థశతకం కొట్టిన తర్వాత ఔట్ అయింది. అప్పటికే ఇంగ్లండ్ విజయం దాదాపు ఖరారైంది. అయితే.. చివర్లో రీచా ఘోష్ ధాటిగా ఆడినా కూడా జట్టును గెలిపించలేకపోయింది. హాఫ్ సెంచరీతో రాణించిన నాట్ సీవర్ బ్రంట్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.