శ్రీలంకతో మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అత్యద్భుత ప్రదర్శన చేశాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అతను ఏకంగా 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో భారత మాజీ దిగ్గజం కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టాడు.
అదే మ్యాచ్లో తొమ్మిది వికెట్లు కూడా తీసిన జడ్డూ.. ఒక విధంగా శ్రీలంకను అతనే ఓడించాడని చెప్పవచ్చు. అలాంటి జడేజాను బెంగళూరులో జరిగే పింక్ బాల్ టెస్టులో పక్కన బెడతారని కొందరు అనుకుంటున్నారు. తొలి టెస్టులో అలసిపోయిన కారణంగా జడ్డూకు ఈ మ్యాచ్లో రెస్ట్ ఇస్తారా? అని ఒక విలేకరి అడిగితే.. ప్రస్తుత టీమిండియా వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా సూపర్ సమాధానం ఇచ్చాడు.
మొహాలీ టెస్టులో జడ్డూ వంటి ప్రదర్శన తర్వాత.. ఏ ఆటగాడూ విశ్రాంతి తీసుకోవాలని కోరుకోడని, మళ్లీ అలాంటి ప్రదర్శనే చేసి జట్టుకు సాయపడాలని అనుకుంటారని బుమ్రా చెప్పాడు. దీంతో జడ్డూ రెండో టెస్టులో కూడా ఖాయంగా ఆడతాడని సంకేతాలు ఇచ్చాడు.
కాగా, బెంగళూరులో జరిగే పింక్బాల్ టెస్టు భారత్ ఆడే మూడో పింక్బాల్ మ్యాచ్. అంతకుముందు బంగ్లాదేశ్, ఇంగ్లండ్తో ఆడిన మ్యాచుల్లో టీమిండియా విజయాలు సాధించింది. బంగ్లాదేశ్తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన టెస్టులోనే విరాట్ కోహ్లీ చివరగా సెంచరీ సాధించాడు. ఆ తర్వాత నుంచి అంతర్జాతీయ సెంచరీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు.