West Indies Cricket : వెస్టిండీస్ క్రికెట్లో నవ శకం మొదలైంది. ఇకపై మహిళా క్రికెటర్ల(Women Cricketers) కు కూడా పురుష క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ ఫీజు ముట్టనుంది. ఈ మేరకు శుక్రవారం క్రికెట్ వెస్టిండీస్, వెస్టిండీస్ ప్లేయర్స్ అసోసియేషన్(WIPA) చారిత్రాత్మక ఒప్పందానికి వచ్చాయి. రాబోయే నాలుగేండ్లలో ఇరువురికి సమానంగా డబ్బులు చెల్లించేందుకు వెస్టిండీస్ బోర్డు సిద్ధమైంది. 2023 అక్టోబర్ 1 నుంచి 2027 సెప్టెంబర్ 30 వరకూ ఈ ఒప్పందం అమలులో ఉండనుంది.
‘ఒప్పందం ప్రకారం జాతీయ, అంతర్జాతీ మ్యాచ్లు ఆడే పురుష, మహిళా క్రికెటర్లకు ఇకపై సమానంగా మ్యాచ్ ఫీజు ఇవ్వనున్నాం. కెప్టెన్లను ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తాం. అంతర్జాతీయ వేదికలపై గెలిచిన ప్రైజ్మనీ, ప్రాంతీయ టోర్నీల్లో వచ్చిన నగదు బహుమతికి కూడా ఈ నియమం వర్తించనుంది’ అని కరీబియన్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
A landmark day for cricket in the West Indies as the Caribbean side commits to achieving pay equity for their male and female players 🙌
Details 👇https://t.co/87MYg1WDUW
— ICC (@ICC) January 26, 2024
‘విండీస్ క్రికెట్లో ఇది చారిత్రాత్మక రోజు. క్రికెట్ పురోగతి దిశగా కీలకమైన అడుగు వేశాం. ఇకపై పురుషు క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు ఒకే మ్యాచ్ ఫీజు అమలు చేస్తాం. విండీస్ క్రికెట్కు ఎంతో చేస్తున్న మహిళా ప్లేయర్ల శ్రమకు దక్కిన గుర్తింపు ఇది’ అని విండీస్ బోర్డు అధ్యక్షుడు కిశోర్ షాల్లో తెలిపాడు.
ఐసీసీ టోర్నీ విజేతలకు ఇచ్చే ప్రైజ్మనీలో అంతరాన్ని నిరుడు ఐసీసీ ప్రశ్నించింది. ఇకపై మహిళల జట్టుకు కూడా పురుషుల జట్టుతో సరిసమానంగా ప్రైజ్మనీ ఇస్తామని ప్రకటించింది. ఆ తర్వాత కొన్ని రోజులకే ఇంగ్లండ్ బోర్డు మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజు పెంచింది. ఇప్పటివరకూ ప్రపంచ క్రికెట్లో ఇప్పటికే పలు దేశాలు పురుష, మహిళా క్రికెటర్లకు సమాన మ్యాచ్ ఫీజు చెల్లిస్తున్నాయి. భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ బోర్డులు ఈక్వల్ పే రూల్ను అమలు చేస్తున్నాయి.