Barkha Dutt | హైదరాబాద్, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ) : దాదాపు 30 ఏండ్లకు పైగా పాత్రికేయ వృత్తిలో ఉన్న ప్రముఖ టీవీ జర్నలిస్ట్, యుద్ధక్షేత్రాలకు కూడా వెళ్లి వార్తలను సేకరించిన ధీశాలి, జాతీయ మీడియా ప్రతినిధి, పద్మశ్రీ అవార్డు గ్రహీత బర్ఖాదత్కు సాక్షాత్తూ సీఎం రేవంత్రెడ్డి ఎదుటే అవమానం జరిగింది. గాంధీభవన్లో శనివారం ఉదయం ఎదురైన ఈ అనుభవంపై ఆమె స్వయంగా తన ‘ఎక్స్’ ఖాతాలో ఆవేదన వ్యక్తం చేశారు.
తాను సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా ఆయన సెక్యూరిటీ సిబ్బంది తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని, నడుం పట్టుకొని అసభ్యకరంగా తోసివేశారని మండిపడ్డారు. బహిరంగంగా జరిగే కార్యక్రమాల్లో ప్రముఖ వ్యక్తులతో మాట్లాడే హక్కు పాత్రికేయులకు ఉంటుందని పేర్కొన్నారు.
తమ కెమెరా ఇతర పరికరాలు కిందపడిపోయాయని, ఇదంతా సీఎం రేవంత్రెడ్డి చూస్తుండగానే జరిగిందని వెల్లడించారు. ‘కొన్ని నెలల క్రితం వచ్చిన అధికారం తెచ్చిన మార్పా’ అంటూ ఎక్స్ ఖాతాలో ప్రశ్నిస్తూ పోస్ట్ పెట్టగా పలువురు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇది అత్యంత దురదృష్టకరమైన ఘటన అని, ఒక మహిళా జర్నలిస్టును ఈ విధంగా అవమానించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.